తలకు దెబ్బ తగిలితే చికిత్స మరిచి ఫోటోలతో ప్రచారమేంది దీదీ?

గాయం అయితే వెంటనే ప్రధమ చికిత్స్ చేయాల్సింది పోయి.. ఫోటోలు దిగేందుకు ప్రదర్శించిన ఆసక్తి విమర్శలకు తెర తీసింది.

Update: 2024-03-15 04:33 GMT

కాసేపు అన్ని విషయాల్ని వదిలేద్దాం. రోజువారీ జీవితంలో మనకు ఎదురయ్యే అనుభవం గురించి మాట్లాడుకుందాం. ఉన్నట్లుండి అనుహ్య రీతిలో దెబ్బ తగిలిందని అనుకుందాం. మీరేం చేస్తారు? దెబ్బ కారణంగా కారే రక్తాన్ని ఆపే ప్రయత్నం చేస్తామా? లేదంటే ఇంట్లో వారందరిని పిలిచి.. హడావుడి చేసి.. ఫోటోలు తీయించి.. ఆ తర్వాత తాపీగా రక్తం కారుతున్న ప్లేస్ కు చికిత్స చేస్తామా?

ఎవరి సంగతి ఎలా ఉన్నా.. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అలియాస్ దీదీ తీరు మాత్రం రోటీన్ కు భిన్నంగా ఉంటుందని చెప్పాలి. గాయం అయితే వెంటనే ప్రధమ చికిత్స్ చేయాల్సింది పోయి.. ఫోటోలు దిగేందుకు ప్రదర్శించిన ఆసక్తి విమర్శలకు తెర తీసింది. తలకు తగిలిన దెబ్బకు కారణం చెప్పకుండా.. ముందు ఫోటోలు వైరల్ చేసి.. అందరిని సదరు గాయం గురించి మాట్లాడుకునేలా చేసి.. ఆ తర్వాత అసలు విషయం చెప్పటం.. అందులో పస లేకపోవటం చూస్తే.. కీలకమైన లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు కాస్త ముందుగా ఇలాంటి హైడ్రామా అవసరమా? అన్న భావన కలుగక మానదు.

ఇంతకూ అసలేం జరిగిందంటే..గురువారం రాత్రి ఎనిమిది గంటలు దాటిన తర్వాత పశ్చిమ బెంగాల్ సీఎం మమత తలకు దెబ్బ (నుదిటి మీద) తగిలి.. దాని నుంచి రక్తం కారుతున్న ఫోటో ఒకటి వైరల్ అయ్యింది. గాయమైందని పేర్కొన్నారే తప్పించి.. ఎందుకలా? జరిగిందన్న దానిపై స్పష్టత లేని పరిస్థితి. కాసేపటికి దాని మీద క్లారిటీ ఇచ్చారు. సీఎం మమత తన ఇంట్లో థ్రెడ్ మిల్ మీద నుంచి పొరపాటున జారి పడ్డారు. పడిన సమయంలో ఇనుప వస్తువ బలంగా తాకటంతో నుదిటికి గాయమైంది. రక్తం ముఖం మీద నుంచి కారుతున్న వేళ.. దాన్ని తుడిచే కన్నా.. ఫోటోలతో ప్రచారం చేసుకోవటాన్ని పలువురు తప్పపడుతున్నారు.

Read more!

దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి బెడ్ మీద పడుకొని ఉన్న దీదీ ఫోటోను తీసిన పార్టీ టీం.. ‘మా ఛైర్ పర్సన్ మమతా బెనర్జీ తీవ్రంగా గాయపడ్డారు. దయచేసి ఆమె కోసం ప్రార్థించండి’’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేయటం.. ఆ వెంటనే ఈ అంశం వైరల్ కావటం జరిగింది. ఆమెను ఎస్ ఎస్ కేఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో కారు ప్రమాదంలో మమతకు తలకు స్వల్ప గాయమైంది. మళ్లీ.. ఇప్పుడు కూడా తలకే కావటం ఇబ్బందికి గురి చేస్తుంది. అయితే.. గాయాన్ని చూస్తే.. పెద్ద గాయంగా కనిపించకున్నా.. ప్రచారంలో మాత్రం తీవ్ర గాయమని పేర్కొనటం.. ఆ హడావుడి చూస్తే మాత్రం.. కీలకమైన ఎన్నికల వేళ ఇలాంటి ఉదంతాలు మైలేజీ కంటే డ్యామేజీకే ఎక్కువ అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News