బ్యాంకులే కాదు.. బ్యాంకు సిబ్బందిదీ అమ‌రావ‌తి బాటే!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో ప‌లు నేష‌న‌ల్ బ్యాంకులు తమ ప్ర‌ధాన కార్యాల‌యాల‌ను ఏర్పాటు చేస్తున్న విష‌యం తెలిసిందే.

Update: 2026-08-21 11:30 GMT

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో ప‌లు నేష‌న‌ల్ బ్యాంకులు తమ ప్ర‌ధాన కార్యాల‌యాల‌ను ఏర్పాటు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఆరు మాసాల కింద‌ట‌.. అమ‌రావతిలో బ్యాంకుల‌కు ప్ర‌భుత్వం భూములు కేటాయించడం.. వాటిలో నిర్మాణాల‌కు అనుమ‌తులు కూడా ఇవ్వ‌డం తెలిసిందే. దీంతో అప్ప‌ట్లోనే కేంద్ర హోం మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ చేతుల మీదుగాప‌లు బ్యాంకులు త‌మ కార్యాల‌యాల నిర్మాణానికి భూమి పూజ‌లు చేశాయి. ప్ర‌స్తుతం బ్యాంకులు సొంత‌గా నిధులు కేటాయించి.. నిర్మాణాల‌ను పూర్తి చేస్తున్నాయి.

వీటిలో యూనియ‌న్ బ్యాంకు, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, కెన‌రా, హెచ్‌డీ ఎఫ్‌సీ వంటి ప‌లు బ్యాంకులు ఉన్నా యి. తాజాగా బ్యాంకుల‌తో పాటు.. బ్యాంకు సిబ్బంది కూడా అమ‌రావ‌తికి వ‌చ్చేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేశారు. ఆయా బ్యాంకులు ఉద్యోగుల నుంచి తీసుకున్న అభిప్రాయాల ప్ర‌కారం.. అమరావ‌తిలో ఉద్యోగులు నివాసం ఉండేందుకు వీలుగా బ్యాంకులు క్వార్ట‌ర్స్‌ను నిర్మించాల‌ని యోచిస్తున్నాయి. దీనిలో భాగంగా ఎస్ బీఐ తొలి ఒప్పందం చేసుకుంది.

శుక్ర‌వారం ఉద‌యం ఎస్ బీఐ.. అధికారులు రాజ‌ధాని ప్రాంత అభివృద్ధి సంస్థ‌(సీఆర్ డీఏ) అధికారుల‌తో ఒప్పందం చేసుకున్నారు. సిబ్బంది నివాస గృహ సముదాయానికి శ్రీకారం చుట్టేలా.. `ఎస్‌బీఐ హౌసింగ్ ప్రాజెక్ట్‌`కు భూమి ఒప్పందం కుదిరింది. రాజ‌ధాని ప‌రిధిలోని ఐనవోలులో మొత్తం 2 ఎకరాల‌ను ఎస్‌బీఐ సిబ్బంది నివాసాల నిర్మాణానికి కేటాయించారు. ఇక్క‌డ నివాసాల‌తో పాటు.. పార్కుల‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు.

దీనికి గాను 214 కోట్ల రూపాయ‌ల‌ను ఎస్‌బీఐ వెచ్చించ‌నుంది. 4.46 లక్షల చదరపు అడుగుల బిల్ట్- అప్ ఏరియాతో నిర్మాణం జరుగనుంది. వీటినీ ఎస్ బీఐ మేనేజ‌ర్ల నుంచి సిబ్బంది వ‌ర‌కు కేటాయించనున్నా రు. దేశంలోనే అతిపెద్ద బ్యాంకైన‌ ఎస్‌బీఐ అమ‌రావ‌తిలో నివాసాల‌కు ముందుకు రావ‌డంతో దీని బాట‌లో యూనియ‌న్ బ్యాంకు కూడా అడుగులు వేయ‌నుంద‌ని. ఇప్ప‌టికే ప్ర‌తిపాద‌న‌లు కూడా వ‌చ్చాయ‌ని సీఆర్ డీఏ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News