రోజాలో మరో కోణం.. ఇది తెలిస్తే షాకే... !
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా గురించి తెలియని వారు ఉండరు. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆమె ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా ముద్ర వేసుకున్నారు.;
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా గురించి తెలియని వారు ఉండరు. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆమె ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా ముద్ర వేసుకున్నారు. అంతేకాదు.. పదునైన వ్యాఖ్యలతో రాజకీయాల్లో వేడి పుట్టించే నాయకురాలిగా కూడా గుర్తింపు పొందారు. నగరి నియోజకవర్గం నుంచి రెండు సార్లు విజయం దక్కించుకుని వైసీపీ ప్రభుత్వంలో మంత్రి గా కూడా చేశారు. అయితే.. ఆమె గురించి చర్చించాల్సివస్తే.. కేవలం రెండు కోణాలు మాత్రమే కనిపిస్తాయి.
1) సినీ రంగంలో రోజా, 2) రాజకీయంగా రోజా. అయితే.. వీటికి ఆవల మరో కోణం కూడా రోజాకు ఉంది. అదే.. సేవా దృక్ఫథం. ఆమె తన ఇంటికి వచ్చేవారిని.. ఆదరిస్తారన్న విషయం చాలా మందికి తెలియదు. పెద్దగా ప్రొజెక్టు కూడా కాలేదు. తన నియోజకవర్గంలో తాను ఓడిపోయినా.. టీడీపీ నాయకుడు గాలి భాను ప్రకాష్ రెడ్డి విజయం దక్కించుకున్నా.. ఇప్పటికీ రూ.2 కే నడిచే రోజా క్యాంటీన్లు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి.
అలానే.. నీట్ ప్రవేశ పరీక్షలో 95.86 శాతంతో 471 మార్కులు సాధించి సత్తా చాటిన విద్యార్థిని జయశ్రీ పేరు ఇటీవల చిత్తూరు జిల్లాలో మార్మోగింది. అయితే.. జయశ్రీకి అన్నీ తానై చదివిస్తున్నది రోజా అంటే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ, ఇది నిజం. విజయపురం మండలం ఆలపాకం గ్రామానికి చెందిన రంగనాథరెడ్డి కుమార్తె జయశ్రీ తల్లిదండ్రులు అత్యంత నిరుపేదలు. ఈ క్రమంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే రోజా జయశ్రీని ఇంటర్ చదివించారు.
రోజానే ఫీజులు చెల్లించి.. నీట్ కూడా రాయించారు. తాజాగా ఆమె మంచి ర్యాంకు సాధించేలా చేశారు. ఇక, మెడిసిన్ చదువుకు అయ్యే పూర్తి ఖర్చును తానే భరిస్తానని భరోసా ఇచ్చారు. కాగా జయశ్రీ రెండేళ్లుగా తిరుపతిలోని చైతన్య జూనియర్ కళాశాలలో చదివినా ఇంటర్ చదువుకు సైతం మాజీ మంత్రి రోజానే ఖర్చులు భరించడం విశేషం. పేద విద్యార్థులను అక్కున చేర్చుకొని వారి ఉన్నత విద్యకు చేయూతనివ్వడంలో రోజాలో మరో కోణం చాలా మందికి తెలియక పోవడం గమనార్హం. ఒక్క జయశ్రీనే కాదు.. దాదాపు 20 మంది అనాథ ఆడపిల్లలను రోజా చదివిస్తున్నారు. వారికి దుస్తులు, పుస్తకాల నుంచి అన్నీ తానై చూస్తున్నారు. రాజకీయాలు ఎలా ఉన్నా.. సేవా భావం ఉండడంతో రోజాపై ప్రశంసలు కురుస్తున్నాయి.