తెలంగాణ రైతన్నకు పండగ: 3500 కోట్లు విడుదల
తెలంగాణ రైతులకు పెట్టుబడి సాయం కింద నిధులు మంజూరు చేస్తామన్న హామీని సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు.;
తెలంగాణ రైతులకు పెట్టుబడి సాయం కింద నిధులు మంజూరు చేస్తామన్న హామీని సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు.. పెట్టుబడి సాయంగా.. ఈ ఏడాది వ్య వసాయ సీజన్కు సంబంధించి తొలి విడత నిధులు అందించారు. మొత్తం మూడు విడతల్లో వ్యవసాయ సీజన్లో నిధులు విడుదల చేస్తున్నారు.
తొలి విడతగా 3590 కోట్ల రూపాయలను సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. సిద్దిపేట జిల్లాలోని నర్మెట ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు తుమ్మలనాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామిల సమక్షంలో సీఎం ఈ నిధులను విడుదల చేశారు. రాష్ట్రంలోని 73 లక్షల మంది రైతులకు ఒక్కొక్క ఎకరానికి సరిపోయేలా మొత్తం 3590 కోట్ల రూపాయలను విడుదల చేశారు. అంటే.. ఒక్కొక్కరికీ సుమారు 5000 రూపాయలను అందించారు.
ప్రస్తుతం ప్రారంభమైన ఖరీఫ్ సీజన్కు ఈ నిధులు తోడ్పడతాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మొత్తం మూడు విడతల్లో కలిపి కోటి 50 లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం అందించనున్నట్టు చెప్పారు. దీనికి సంబంధించి 9 వేల కోట్ల రూపాయలను కేటాయించామన్నారు. దీనిని మూడు విడతలుగా.. అందిస్తామన్నారు. రానున్న 20 రోజుల్లో 2650 కోట్ల రూపాయలు, అనంతరం మరో నెలలో 2760 కోట్ల రూపాయలను విడుదల చేయనున్నట్టు తెలిపారు.
ఇదీ లెక్క!
+ లబ్ది పొందేందుకు అర్హులైన రైతులు: 73 లక్షలు
+ ఒక్కొక్క ఎకరాకు ప్రభుత్వ సాయం : 5000 రూపాయలు
+ తొలి విడత విడుదల చేసిన మొత్తం: 3590 కోట్ల రూపాయలు
+ నిధులు రైతుల ఖాతాలకు చేరేది: సోమవారం ఉదయం 11-5 గంటల మధ్య
ఆయిల్ పామ్ రైతులకు మేలు!
మరోవైపు.. సిద్దిపేట జిల్లాలోని నుంగనూరులో పామాయిల్ సాగు చేసే రైతులకు.. మేలు జరిగేలా ఇక్కడే ఆయిల్పామ్ ఫ్యాక్టరీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 300 కోట్ల రూపాయలతో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రైతులు.. ఈ ఫ్యాక్టరీలో తమ పంటలను విక్రయించుకునేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడే రిఫైనరీ(శుద్ధి కేంద్రం)ని కూడా ఏర్పాటు చేయనున్నారు. దీనికి తాజాగా భూమిపూజ చేశారు.