పిఠాపురం నుంచి రేషన్ పంపిణీకి శ్రీకారం!
లబ్దిదారులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఆయన చెప్పారు. అరవై అయిదేళ్ళు దాటిన వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ సరకులు తెచ్చి ఇస్తారని ఆయన చెప్పారు.;

చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ సరకుల పంపిణీని జూన్ 1 వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నామని ఇప్పటికే కూటమి ప్రభుత్వం తెలియచేసింది. వాహనాల ద్వారా ప్రతీ ఇంటికీ రేషన్ ని సరఫరా చేయడంలో డొల్లతనం ఉందని అక్రమాలే ఉన్నాయని తేల్చింది. దాంతో రేషన్ డిపోల నుంచే సరకులు యధా ప్రకారం పాత విధానంలో పంపిణీ చేయనున్నారు.
ఇక జూన్ 1న ఈ కార్యక్రమాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ లాంచనంగా ప్రారంభిస్తారు. ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురం నుంచే ఈ కార్యకమాన్ని మొదలెడుతున్నారు.
పండుగ వాతావరణంలో రేషన్ సరకుని పంపిణీ చేస్తామని ఆయన ప్రకటించారు. అంతే కాదు లబ్దిదారులు తమకు నచ్చిన దగ్గరలో ఏ రేషన్ డిపో వద్ద అయినా సరకులు తీసుకోవచ్చు అని ఆయన ప్రకటించారు. ఆ విధంగా పోర్టబిలిటీ సదుపాయం ఉందని సాంకేతికంగా కూడా మార్పులు చేశామని అన్నారు.
లబ్దిదారులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఆయన చెప్పారు. అరవై అయిదేళ్ళు దాటిన వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ సరకులు తెచ్చి ఇస్తారని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే ఇంటింటికీ రేషన్ సరఫరా అంటూ వైసీపీ సర్కార్ హయాంలో భారీ అక్రమాలకు పాల్పడ్డారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విమర్శించారు.
గత ప్రభుత్వంలో ఇంటింటికీ వాహనాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ సక్రమంగా జరగలేదని ఆయన అన్నారు. పేదలకు సరకు సరిగ్గా ఇవ్వకుండా దానిని అక్రమంగా పక్క దారి పట్టించారు అని అన్నారు. విచారణలో తేలడంతోనే ఈ విధానం అమలు చేస్తున్నామని చెప్పారు. ఇకపై ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు అలాగే సాయంత్రం 4 గంటలల నుండి 8 గంటల వరకు రేషన్ డీలర్ల దుకాణాల వద్ద అందిస్తామని అన్నారు. పేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
మొత్తం మీద చూస్తే జూన్ 1 నుంచి చౌక దుకాణాల వద్దనే రేషన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ప్రతీ నెలలో పదిహేను రోజుల పాటు కచ్చితంగా రేషన్ షాపులు తెరచి ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. తూనికలు కొలతలలో లోపాలు లేకుండా నిఘా ఉంటుందని చెబుతున్నారు. రానున్న రోజులలో మరిన్ని సరకులను రేషన్ దుకాణాలో అందచేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇక ఉదయం వీలు కాకపొతే రాత్రి ఎనిమిది గంటల దాకా రేషన్ దుకాణాలు తెరచి ఉంటాయి కాబట్టి ప్రజలకు తమకు రేషన్ దక్కదు అన్న బెంగ ఉండదని అంటున్నారు. మొత్తానికి లబ్దిదారులు కూడా ఇదే బాగుందని అంటున్నారు. దాంతో ఈ క్రెడిట్ కూటమి ప్రభుత్వానికే దక్కేలా ఉంది.