రామ్మోహన్ కి కీలక శాఖ ?
ఇక ఏపీ నుంచి చూస్తే ఉత్తరాంధ్ర కు చెందిన కీలకమైన యువ నాయకుడు శ్రీకాకుళం నుంచి హ్యాట్రిక్ ఎంపీగా ఉంటూ కేంద్రంలో తొలిసారి కేబినెట్ హోదాను అందుకున్న కింజరాపు రామ్మోహన్ నాయుడుకు కూడా శాఖాపరంగా మార్పు ఉంటుందని చెబుతున్నారు.
కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరుగుతుంది అన్నది పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. రెండేళ్ళ పరిపాలన పూర్తి చేసుకున్న తరువాత కేంద్ర పెద్దలు మంత్రివర్గాన్ని విస్తరిస్తారని అలాగే పునర్ వ్యవస్థీకరిస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇక చాలా మంది మంత్రులకు ఉధ్వాసన తప్పదు అని అంటున్నారు. అదే సమయంలో కొందరి శాఖలు కూడా మారుతాయని చెబుతున్నారు. ఇక ఏపీ నుంచి చూస్తే ఉత్తరాంధ్ర కు చెందిన కీలకమైన యువ నాయకుడు శ్రీకాకుళం నుంచి హ్యాట్రిక్ ఎంపీగా ఉంటూ కేంద్రంలో తొలిసారి కేబినెట్ హోదాను అందుకున్న కింజరాపు రామ్మోహన్ నాయుడుకు కూడా శాఖాపరంగా మార్పు ఉంటుందని చెబుతున్నారు.
రెండు సార్లు అదే శాఖ :
కేంద్రంలో మోడీ ప్రభుత్వంలో రెండు సార్లు టీడీపీ భాగస్వామ్యం అయింది. ఆ రెండు సార్లూ కూడా కేబినెట్ మంత్రి ఒకరికి ఇచ్చారు, అలాగే ఒకే శాఖ ఇచ్చారు. అది కూడా ఉత్తరాంధ్రాకే. 2014 నుంచి 2018 దాకా అశోక్ గజపతి రాజు కేంద్ర పౌర విమాన యాన శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక 2024 నుంచి అదే మంత్రిత్వ శాఖను యువకుడైన రామ్మోహన్ చూస్తున్నారు. ఈ శాఖ వల్ల ఏపీకి పెద్దగా ఒరిగేది ఏముంది అన్న పెదవి విరుపులు కూడా ఉన్నాయి. నిజానికి చూస్తే విమానయాన రంగం పూర్తిగా ప్రైవేట్ పరం అయిపోయింది. దాంతో ఈ శాఖ కూడా చేసేది ఏమి ఉంది అన్న చర్చ కూడా సాగుతోంది.
ప్రధానమైనవి తీసుకుంటే :
ఇక యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఎర్రన్నాయుడు కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు ఉపాధి కల్పన శాఖలను నిర్వహించారు. ఆయా శాఖల మంత్రిగా కీలకమైన బాధ్యతలు నిర్వహించారు. ఆయన 1996 నుండి 1998 వరకు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో హెచ్డి దేవెగౌడ ఐకె గుజ్రాల్ మంత్రివర్గాలలో పనిచేశారు. దాంతో ఆనాడు ఉమ్మడి ఏపీకి ఎంతో లాభదాయకం అయింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి సాధ్యపడింది. నిధులు కూడా పెద్ద ఎత్తున లభించాయి. అందువల్ల ఈసారి కీలకమైన శాఖలనే తీసుకోవాలని టీడీపీ పెద్దలు చూస్తున్నారు. మరి ఎర్రన్న కుమారుడిగా యువ నేతగా మూడు భాషలలో విశేషం అయిన పట్టు సాధించిన నాయకుడిగా డైనమిక్ యంగ్ లీడర్ గా ఉన్న రామ్మోహన్ కి గ్రామీణాభివృద్ధి శాఖ వంటిది ఇస్తే కనుక విభజన ఏపీకి ఎంతగానో ఉపయోగం ఉంటుందని అంటున్నారు. పైగా ఆయన పార్లమెంట్ లో చేసే ప్రసంగాలు విపక్షాల విమర్శలకు ఇచ్చే కౌంటర్లు సమయ స్పూర్తి ఇవన్నీ కూడా ఎన్డీయే ప్రభుత్వానికి అనుకూలతను తెచ్చి పెడుతున్నాయని అంటున్నారు. మరి రామ్మోహన్ కి ఏ శాఖ దక్కుతుందో అన్నది చూడాల్సిన అవసరం ఉంది.