రాహుల్తో భేటీకి జగన్ ప్రిపరేషన్.. నిజమేనా ..!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉద్యమించేందుకు సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఎన్నికల సంఘం చేస్తున్న అవకతవకలు, అక్రమాలు అంటూ.. వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు రెడీ అయ్యారు;
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉద్యమించేందుకు సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఎన్నికల సంఘం చేస్తున్న అవకతవకలు, అక్రమాలు అంటూ.. వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు రెడీ అయ్యారు. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ సహా.. పలు రాష్ట్రాల్లో ఓటర్లను తప్పించడం.. నకిలీ ఓటర్లకు అవకాశం ఇవ్వడం.. గత ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై వివరణ ఇవ్వకపోవడం వంటివాటిని ప్రజలకు వివరిం చేందుకు `స్వతంత్ర క్రాంతి` పేరుతో ఉద్యమానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇక, ఏపీ విషయానికి వస్తే.. వైసీపీ కూడా ఇదే మాట చెబుతున్న విషయం తెలిసిందే. ఈవీఎంలలో ఏదో జరిగిందని.. అందుకే తాము బలమైన నియోజకవర్గాల్లోనూ ఓడిపోయామని చెబుతోంది. అయితే.. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి రిప్రజెంటేషన్ ఇచ్చి మౌనంగా ఉంది. కానీ... ఇటీవల రాహుల్ చేసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్.. అనంతరం.. జరుగుతున్న చర్చ.. వంటి వాటిని పరిగణనలోకి తీసుకున్న వైసీపీ.. దేశవ్యాప్తంగా జరిగే కాంగ్రెస్ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం ద్వారా ఏపీలో జరుగుతున్న పరిణామాలను దేశం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో రాహుల్ గాంధీతో జగన్ భేటీ అయ్యేందుకు, ఆయన చేస్తున్న స్వతంత్ర క్రాంతి ఉద్యమానికి మద్దతు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్టు.. తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. అయితే.. దీనిపై ప్రస్తుతం చర్చలు మాత్రమే జరుగుతున్నాయని.. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తే.. తమకు ఎదురయ్యే సమస్యలు కూడా ఉన్నాయని పార్టీ నాయకులు అంతర్గత చర్చల్లో చెబుతున్నారు. కాంగ్రెస్ అంటే.. ప్రధాని మోడీకి బద్ధ శత్రువన్న విషయం తెలిసిందే.
ఇప్పుడు ఆ పార్టీకి పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా మద్దతు ప్రకటిస్తే.. మోడీకి ఆగ్రహం తెప్పించినట్టు అవు తుంది. తద్వారా కేసులు తెరమీదికి వస్తాయి. అలాని.. మౌనంగా ఉంటే.. ఏపీలో అన్యాయం జరిగిందని చెబుతున్న వైసీపీ గళం వినిపించకపోతే.. వచ్చే ఎన్నికల నాటికి మరింత.. ఇబ్బందులు తప్పే పరిస్థితి ఉండకపోవచ్చన్నది మరో చర్చ. ఏతా వాతా ఎలా చూసుకున్నా.. అంశాల వారీగా బీజేపీకి గతంలో మద్దతు ఇచ్చినట్టుగానే.. ఇప్పుడు కాంగ్రెస్కు మద్దతు ఇస్తే.. తప్పులేదన్న చర్చ దిశగా కూడా వైసీపీ ఆలోచన చేస్తోంది. ఏదేమైనా.. రాహుల్తో భేటీ అయ్యే విషయంపై జగన్ దృష్టి పెట్టినట్టు సమాచారం.