ఐ లవ్ లోకేశ్.. రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు
తనకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ కు మధ్య గ్యాప్ ఉందనేది కేవలం తప్పుడు ప్రచారమేనని డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు స్పష్టం చేశారు.;
తనకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ కు మధ్య గ్యాప్ ఉందనేది కేవలం తప్పుడు ప్రచారమేనని డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు స్పష్టం చేశారు. తనకు మంత్రి లోకేశ్ అంటే చాలా ప్రేమ అని, ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే ఎంతో గౌరవమని రఘురామ వెల్లడించారు. మేము మేము కొట్లాడుకోవాలని కొందరు కలలు కంటున్నారని, అలాంటి ఆశావాదులకు నిరాశే మిగులుతుందని రఘురామ వ్యాఖ్యానించారు. ఓ వెబ్ చానల్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రఘురామరాజు ఆసక్తికర సమాధానాలిచ్చారు.
క్లారిటీ ఇచ్చినట్లేనా..!
పొలిటికల్ ఫైర్ బ్రాండ్, డిప్యూటీ స్పీకర్ రఘురామరాజుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారాన్ని కొట్టిపడేశారు. తమ మధ్య బేధాభిప్రాయాలు వచ్చే అవకాశమే లేదని తేల్చిచెప్పారు. ‘లోకేశ్ను నేను చాలా ఇష్టపడుతా.. లోకేశ్తో నేను చాలా క్లోజ్.. చంద్రబాబు 100 శాతం నన్ను ప్రేమిస్తున్నారు.’ అంటూ రఘురామరాజు చెప్పారు. మంత్రి పదవి ఇవ్వలేదని రఘురామ అసంతృప్తిగా ఉన్నారని, అదే సమయంలో రఘురామ వివాదాస్పద వ్యవహారశైలితో సామాజికవర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయని సీఎం అసహనం వ్యక్తం చేస్తున్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై తొలిసారిగా స్పందించిన తాను కూటమిలో సంతృప్తికరంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
అమరావతి కోర్ కేపిటల్
ఇక గురువారం మీడియాతో మాట్లాడిన రఘురామరాజు రాజధాని అమరావతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్మోహనరెడ్డి చెబుతున్న మావిగన్ ‘సీఆర్డీఏ’ పరిధిలో ఉందని స్పష్టం చేశారు. అమరావతి అనేది కేవలం కోర్ కేపిటల్ మాత్రమేనని చెప్పారు. కోర్ కేపిటల్ లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉంటాయని చెప్పారు. రాజధాని కోసం తీసుకున్న భూములతో సీఎం ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేశారని, భవిష్యత్తు అవసరాల కోసం ఆ భూమి ఎంతో ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు.
ఇరిటేషన్ తోనే కొత్త పేర్లు
అమరావతి ఒక సెల్ఫ్ ఫైనాన్స్ నగరమని, రాజధాని కోసం చేసిన అప్పులను ఆ నగరం ద్వారా వచ్చే ఆదాయంతోనే తీర్చుతామని వెల్లడించారు. అమరావతిని దేవతల రాజధాని అంటూ ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నారని, అది నచ్చని వారే మావిగన్ అంటూ పిచ్చి పిచ్చి పేర్లు పెడుతున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామ విమర్శించారు. దేవతలను ఇష్టపడని దానవులు ఇరిటేషన్ తెచ్చుకుంటున్నారని రఘురామ దెప్పిపొడిచారు. అమరావతిని దేవతల రాజధానిగా అనడం మానేస్తే దానవులు కొత్త పేర్లు పెట్టడం మానేస్తారని రఘురామ వ్యాఖ్యానించారు