ఆర్ ఆర్ ఆర్‌కు ప్ర‌త్య‌ర్థి రెడీ.. ఇక‌ తేల్చుకోవ‌డ‌మే.. !

ఇక‌, ఉండి నియోజ‌కవ‌ర్గంలో ర‌ఘ‌రామ‌పై పోటీకి.. ప్ర‌స్తుతం స‌స్పెన్ష‌న‌లో ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ రెడీ అవుతున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా చెబుతున్నారు.

Update: 2026-06-07 06:11 GMT

గ‌త 2024 ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని ఉండి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ర‌ఘురామ‌కృష్ణ రాజు టీడీపీటికెట్‌పై విజ‌యం ద‌క్కించుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ త‌న‌కే టికెట్ ద‌క్కుతుంద‌ని ఆయ న భావిస్తున్నారు. అయితే.. ఆయ‌న కొంత మేరకు ప్ర‌ద‌ర్శిస్తున్న దూకుడు కార‌ణంగా.. ఎస్సీ సామాజిక వ‌ర్గం ముఖ్యంగా మాల‌లు ఆయ‌న‌ను వ్య‌తిరేకిస్తున్న ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. నిజానికి ఏ నియోజ‌క‌వ‌ర్గంలో అయినా నాయ‌కుడు అన్ని వ‌ర్గాల మ‌ద్ద‌తుతోనే గెలవాలి.

దీనికి ఎవ‌రూ అతీతులు కారు. ఎస్సీల నుంచి మైనారిటీ వ‌ర్గాల వ‌ర‌కు అంద‌రి ఆమోదం ఉంటేనే గెలుపు గుర్రం ఎక్క‌డం సాధ్య‌మ‌వుతుంది. ఈ చిన్న లాజిక్కును ర‌ఘురామ మిస్స‌య్యార‌ని.. మిస్ అవుతార‌ని కూడా ఎవ‌రూ అనుకోరు. కానీ, ఆయ‌న మొండిగా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుతో ఆకివీడు, భీమ‌వ‌రం స‌హా.. ఉండి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని కొన్ని మండ‌లాల్లో ఎస్సీలు ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా గ‌ళం వినిపిస్తున్నారు. ఇది వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆయ‌న‌కు పెను శాపంగా మారే అవ‌కాశం ఉంది.

ఇక‌, ఉండి నియోజ‌కవ‌ర్గంలో ర‌ఘ‌రామ‌పై పోటీకి.. ప్ర‌స్తుతం స‌స్పెన్ష‌న‌లో ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ రెడీ అవుతున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను ఇక్క‌డ నుంచే పోటీచేస్తాన‌ని.. మీరంతా గెలిపించాల‌ని ఆయ‌న ఎస్సీల‌కు చెబుతున్నారు. త‌ర‌చుగా ఇక్క‌డ ఎస్సీ సామాజిక వ‌ర్గానికి అండ‌గా ఉంటున్నారు. ర‌ఘురామ‌పై ఆకివీడులోని పెద‌పాడులో కొంద‌రు దాడి చేశార‌నికేసు న‌మోదైంది.

ఈ కేసులో చిక్కుకున్న వారికి న్యాయ స‌హాయం అందించ‌డంతో పాటు.. వారికి బెయిల్ ద‌క్కేలా కూడా.. సునీల్ కుమార్ వ్య‌వ‌హ‌రించారు. మ‌రోవైపు.. ప్ర‌ముఖ న్యాయ‌వాది జ‌డ శ్ర‌వ‌ణ్ కుమార్ కూడా.. ర‌ఘురా మ‌పైనే పోటీచేస్తాన‌ని చెబుతున్నారు. వీరిద్ద‌రిలో ఒక‌రు ఖ‌చ్చితంగా ర‌ఘురామ‌పై పోటీ చేసే అవ‌కాశం ఉంది. జ‌డ శ్ర‌వ‌ణ్‌కుమార్ కంటేకూడా.. సునీల్‌కుమార్‌కు మెరుగైన అవ‌కాశం ఉంటుంద‌న్న అంచ‌నాలు వున్నాయి. ఈ నేప‌థ్యంలో ర‌ఘురామ దూకుడు త‌గ్గించుకుంటారా? లేక‌.. అలానే ముందుకు వెళ్తారా? అనేది చూడాలి.

Tags:    

Similar News