రెడ్ బుక్ కాదు...రఘురామ బుక్ తోనే సస్పెన్షన్ !
గతంలో వైసీపీ రెబల్ ఎంపీ, ప్రస్తుతం ఏపీ శాసనసభలో ఉప సభాపతిగా ఉన్న రఘురామ క్రిష్ణం రాజు మాజీ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ ల మధ్యన పోరు అయితే గడచిన కొన్నేళ్ళ తరబడి అలా సాగుతూనే ఉంది. ఈ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా ఎప్పటికపుడు డైలాగ్ వార్ ని నడిపిస్తూ ఉంటారు. ఇక తాజాగా ఒక తెలుగు చానల్ ఇంటర్వ్యూలో పీవీ సునీల్ కుమార్ మాట్లాడుతూ రఘురామ మీద నిప్పులు చెరిగారు. ఆయన తన మీద కక్షతోనే ఉద్యోగం నుంచి తనను సస్పెండ్ చేయించారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన ఒత్తిడితోనే :
తన సస్పెన్షన్ వెనక ప్రభుత్వం తప్పు లేదని ఆయన చెప్పడం విశేషం. కేవలం రఘురామ నుంచి వచ్చిన ఒత్తిడిని తట్టుకోలేకనే ఈ విధంగా తనను సస్పెండ్ చేశారు అని ఆయన అన్నారు. తాను చేసిన తప్పు కూడా ఏమీ లేదని అది సస్పెండ్ చేయాల్సినంత నేరమూ కాదని ఆయన అన్నారు. తాను చెప్పాపెట్టకుండా విదేశాలకు వెళ్లాను అన్నది ఆరోపణ అని ఆయన చెబుతూ విదేశాలకు తాను వెళ్లేందుకు లీవ్ మంజూరు చేశారు కూడా మరి అది తప్పేలా అవుతుందని ప్రశ్నించారు. అయితే పర్మిషన్ తీసుకోలేదని అంటున్నారని అన్నారు.
వారికో రూల్ తనకో రూల్ :
అసలు ఈ విధంగా చెప్పా పెట్టకుండా వెళ్ళిన వారి లిస్ట్ చూస్తే ఏకంగా పదిహేను మంది అధికారులు ఉంటారని పీవీ సునీల్ కుమార్ చెప్పారు. వారంతా టూర్ల నుంచి తిరిగి వచ్చిన తరువాత రాటిఫై చేయించుకున్నారు అని అన్నారు. ఒక అధికారి అయితే ఏకంగా మూడు నాలుగు సార్లు ఇలా చేసి మరీ రాటిఫై చేసుకున్నారని అన్నారు. వారికో రూల్ తనకో రూల్ ఎలా అవుతుందని అన్నారు. రాటిఫై చేయించుకున్నారు అంటే అది ఏమంత పెద్ద తప్పు కాదని అర్ధమే కదా అని ఆయన ప్రశ్నించారు. కేవలం రఘురామ తమ మీద కక్షతోనే సస్పెండ్ దాకా వ్యవహారం తీసుకుని వెళ్ళారని ఆయన ఆరోపించారు.
కోటి మంది దళితులకు :
రాజులకు దళితులకు ఏపీలో గొడవలు కానీ సామాజిక సంఘర్షణలు కానీ లేవని పీవీ సునీల్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. ఏపీలో దాదాపుగా ఆరు లక్షల మంది దాకా రాజులు ఉంటారని కోటి మంది దాకా దళితులు ఉంటారని ఈ రెండు సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. అయితే వాస్తవం ఏమిటి అంటే రఘురామ ఒక్కరే కోటి మంది దళితులు మీదకు వస్తున్నారు అని ఆయనే వివాదాలు పెంచి పెద్దవి చేస్తున్నారు అని సునీల్ కుమార్ ఆరోపించారు. ఆయనకు ఏ ఒక్క రాజు నుంచి కూడా మద్దతుగా ఆందోళనలు చేయలేదని మాట్లాడలేదని గుర్తు చేశారు. వారితో తమకు ఎలాంటి సమస్య కూడా లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. రఘురామ మాత్రం దళితుల మీదకు దళిత క్రిస్టియన్స్ మీదకు కూడా వస్తున్నారు అని అందుకే ఆయనతోనే తమకు పోరాటం అని పీవీ సునీల్ కుమార్ స్పష్టం చేశారు. ఇక రెడ్ బుక్ తన మీదకు ఎవరూ ప్రయోగించలేదని ఆయన చెబుతూ రఘురామ బుక్ తోనే ఇబ్బంది అవుతోందని దానిని ధీటుగా ధైర్యంగా ఎదుర్కొంటాను అని సునీల్ కుమార్ చెప్పడం విశేషం.