భోగాపురం 'వైభోగం'.. ఉత్తరాంధ్రలో సంబరాలు!
విజయనగరం జిల్లాని భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానా శ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించనున్నారు.
విజయనగరం జిల్లాని భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానా శ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా భారీ ఎత్తున సంబరాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా విజయనగరం, విశాఖ , శ్రీకాకుళం పాఠశాలలకు శనివారం సెలవు ప్రకటించారు. అలానే కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కూడా అధికారులు సెలవు ప్రకటించడం గమనార్హం.
ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పండుగ మాదిరిగా నిర్వహించాలని సీఎం చంద్రబా బు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తొలుత ఉత్తరాంధ్రలో సంబరాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా విజయనగరం విమానాశ్రయ ప్రారంభోత్సవ ఘట్టాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం దీనిని గిన్నీస్ బుక్లో ఎక్కించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో 13 వేల మంది చిన్నారులతో థింసా గిరిజన సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించేలా ఏర్పాట్లు చేశారు.
ఇక, 3 లక్షల మంది ప్రజలతో ప్రధాన సభను నిర్వహించనున్నారు. ప్రధాని మోడీ హాజరు కానున్న సభ కావడంతో దీనిని అగ్రస్థానంలో నిలిపేలా చేయాలని సర్కారు భావిస్తోంది. అందుకే.. శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం నుంచి ప్రజలను తరలించనున్నారు. దీనికిగాను 2000 బస్సులను ఏర్పాటు చేశారు. ఒకరకంగా చెప్పాలంటే.. మూడు జిల్లాల్లోని ఆర్టీసీ బస్సులు అన్నీ.. భోగాపురానికే దారితీయనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు కూడా అత్యవసరమైతే తప్ప.. ప్రజలు ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచించారు.
మంత్రులంతా అక్కడే!
సీఎం చంద్రబాబు తప్ప మిగిలిన మంత్రులు అంతా.. గత రాత్రే భోగాపురానికి చేరిపోయారు. ప్రధాని రావ డానికి 24 గంటల ముందే.. ఏర్పాట్లను వారు పర్యవేక్షించనున్నారు. మంత్రి లోకేష్ ఈ కార్యక్రమాన్ని సమ న్వయం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన కూడా విజయనగరంలోనే ఉండి.. అన్ని ఏర్పాట్లపై ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. ఇక, ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులతో పాటు టీడీపీ నాయకులు కూడా భోగాపురంపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. ఇలా.. అన్ని కోణాల్లోనూ.. భోగాపురం సంబరాలు ప్రారంభమయ్యాయి.