పవన్ చెబుతోంది కరెక్ట్...కానీ వారు డీలా పడుతున్నారే ?
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వాస్తవ పరిస్థితులను చెబుతున్నారు. అంతే కాదు ఏపీలో రాజకీయ వాతావరణాన్ని ఆయన ఒకటికి పదిసార్లు వివరించి మరీ చెబుతున్నారు.
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వాస్తవ పరిస్థితులను చెబుతున్నారు. అంతే కాదు ఏపీలో రాజకీయ వాతావరణాన్ని ఆయన ఒకటికి పదిసార్లు వివరించి మరీ చెబుతున్నారు. ఏపీలో జనసేన ఆవిర్భావం వెనక ఉన్న తన ఆశయాలను కూడా విడమరచి చెబుతున్నారు. విభజన ఏపీ ఇబ్బందుల్లో ఉందని ప్రగతి దారులు వెతకాలని పవన్ ఆలోచన. అందుకే తాను భేషరతుగా 2014లో టీడీపీ బీజేపీలకు మద్దతు ప్రకటించాను అని ఆయన చెబుతున్నారు. ఇక 2024 ఎన్నికల్లో కనుక పొత్తులకు దిగకుండా కూటమి కట్టకుండా ఒంటరిగా పోటీ చేస్తే జనసేన పెర్ఫార్మెన్స్ బాగానే ఉండేది కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి వైసీపీ మరో సారి అధికారంలోకి వస్తే రాష్ట్రం తట్టుకోలేదని అందుకే అయిదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తుని అభివృద్ధి సుస్థిరతను తాను ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను అని పవన్ చెబుతున్నారు. ఆయన చెబుతున్నది అంతా కరెక్ట్ బాగానే ఉంది కానీ ఒక బలమైన సామాజిక వర్గంలో మాత్రం అసంతృప్తి అయితే పెరుగుతోంది అని అంటున్నారు.
అతి పెద్ద వర్గంగా :
ఏపీలో చూస్తే అతి పెద్ద సామాజిక వర్గంగా కాపులు ఉన్నారు. వారికి సుదీర్ఘ కాలంగా ఉన్న కోరిక అయితే తమ నుంచి ముఖ్యమంత్రి కావాలని. దాని కోసం వారు కళ్ళు కాయలు కాచేలా చూశారు. అంతే కాదు గతంలో ఎందరో నాయకులను ఆ దిశగా నడిపించారు, వారి వల్ల తమ ఆశలు నెరవేరుతాయని కూడా భావించారు, మద్దతుగా నిలిచారు. ఇపుడు పవన్ విషయంలో తీసుకుంటే కాపులు అలాగే ఆలోచించారు. తమ నాయకుడు ముఖ్యమంత్రి కావాలన్నది వారి కోరిక. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తనకు రాష్ట్రం తొలి ప్రాధాన్యత అని అంటున్నారు.
ఈ కామెంట్స్ తోనే :
అంతే కాదు తాను ఏదో ముఖ్యమంత్రి కావాలని ఆశపడి పార్టీ పెట్టలేదని తాజాగా జరిగిన పార్టీ సభలో ఆయన స్పష్టం చేశారు. తాను ఎంతో కాలంగా నలిగి ఉన్నాను అన్నారు. పార్టీ పెట్టింది తన భావజాలాన్ని వ్యాప్తి చేయడమే కాదు ఏపీని బాగు చేయడం కోసం కూడా అని అన్నారు. ఇక్కడే ఆయన అభిమానులు కానీ సొంత సామాజిక వర్గం కానీ కొంత అసంతృప్తి చెందుతున్నారు. ఎవరైనా పార్టీ పెట్టింది అధికారం అందుకోవడానికే కదా అని అంటున్నారు. అధికారం ఉంటే కదా తమ ఆశయాలను అమలు చేసే అవకాశం వస్తుందని కూడా గుర్తు చేస్తున్నారు.
వైసీపీ సెటైర్లు :
ఇదే సమయం అన్నట్లుగా వైసీపీ నేతలు అంతా కలసి పవన్ కామెంట్స్ మీద సెటైర్లు వేస్తున్నారు. పార్టీ పెట్టి అధికారంలోకి రాకపోతే మరి దేనికి మద్దతు పార్టీగా ఎల్లకాలం ఉండిపోవడానికేనా అని మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని కామెంట్స్ చేస్తున్నారు. ఒక విధంగా వారు వ్యూహాత్మకంగా కాపులలో అసంతృప్తిని రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. సహజంగానే పవన్ వ్యాఖ్యలు వారికి ఆ విధంగానే ఉన్నాయని కూడా అంటున్నారు.
అందరి వాడిని అంటూ :
ఇక పవన్ కళ్యాణ్ మరో మాట కూడా చెప్పారు. తాను ఒక కులంలో పుట్టడం యాక్సిడెంట్ అని అంత మాత్రం చేత తనను ఆ కులానికే కట్టివేయవద్దు అని అంటున్నారు. తాను అందరి కోసం రాజకీయాల్లోకి వచ్చాను అని అందరి వాడిని అని ఆయన చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలు కూడా కాపులకు మనస్తాపం కలిగిస్తున్నాయని అంటున్నారు. తాము పవన్ ని సొంతం చేసుకున్నామని వారు అంటున్నారు. అయితే రాజకీయాల్లో అన్ని వర్గాల మద్దతు అవసరం అని అందుకే పవన్ అలా మాట్లాడుతున్నారని అంటున్న వారూ ఉన్నారు. గాజువాక భీమవరంలో ఎందుకు ఓడించారు అని పవన్ వేస్తున్న ప్రశ్నలకు జవాబు ఉందా అని కూడా అంటున్న వారూ అదే సామాజిక వర్గంలో ఉన్నారు. 2019లో ఒంటరిగా పవన్ పోటీ చేస్తే ఓడించారు కదా అని అంటున్న వారూ ఉన్నారు. మొత్తానికి కాపు సీఎం కల తీరేది ఎన్నాళ్ళకు అన్నది ఆ సామాజిక వర్గంలో ఉంటే పవన్ కామెంట్స్ తాజా కామెంట్స్ మాతం వైరల్ అవుతున్నాయి.