ఉత్తర కొరియా అణుపరీక్షలు ఎంత డేంజర్ చెప్పిన తాజా రిపోర్టు
వరం కానీ ఆయుధం కానీ బాధ్యత కలిగిన వారికి చిక్కితే మంచి జరుగుతుందా? లేదా? అన్నది పక్కన పెడితే ఎవరికైనా హాని జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
వరం కానీ ఆయుధం కానీ బాధ్యత కలిగిన వారికి చిక్కితే మంచి జరుగుతుందా? లేదా? అన్నది పక్కన పెడితే ఎవరికైనా హాని జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందుకు భిన్నంగా మొండిగా.. మూర్ఖంగా వ్యవహరిస్తూ.. తన మాటే శాసనం అన్నట్లుగా వ్యవహరించే వారితో తలనొప్పులు ఖాయం. ఉత్తర కొరియా అధినేత కిమ్ కు అణుపరీక్షల అతి.. ఇప్పుడు ఆ దేశానికి మాత్రమే కాదు.. పలు దేశాలను డేంజర్ జోన్ లోకి నెట్టేశాయన్న విషయాన్ని తాజాగా ఒక అంతర్జాతీయ సైన్స్ జర్నల్ సైన్స్ లో ఒక అధ్యయనం తాజాగా పబ్లిష్ అయ్యింది. అందులో పేర్కొన్న అంశాలతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడే పరిస్థితి.
ఇదేమీ అల్లాటప్పా అధ్యయనం కాదు. దీని మీద దక్షిణ కొరియాలోని పుసాన్ నేషనల్ వర్సిటీ.. చైనాలోని చెంగ్డూ వర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు 2008 నుంచి 2025 వరకు భూకంప తరంగాల డేటాను విశ్లేషించారు. ఇందులో భాగంగా అణు ఆయుధాల కోసం ఉత్తరకొరియా చేపట్టిన పరీక్షల కారణంగా ఏకంగా 1399గా భూకంపాలు చోటు చేసుకున్నట్లుగా లెక్క తేల్చారు. అదే పనిగా అణు పరీక్షల్ని మౌంట్ మంటప్ పర్వతం ప్రాంతం అడుగు భాగాన నిర్వహించారు. 2006 నుంచి 2017 మధ్య కాలంలో పుంగ్యే-రి పరీక్షా కేందంలోని మంటప్ పర్వతం కింద ఆరు భూగర్భ అణు పరీక్షల్ని నిర్వహించినట్లుగా గుర్తించారు. అణు పరీక్షల కారణంగా అక్కడి భూగర్భ పొరలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తేల్చారు.
అత్యంత శక్తివంతమైన పేలుళ్ల కారణంగా ఆ ప్రాంతంలో శతాబ్దాలుగా నిద్రాణంగా ఉన్న భూగర్భ ఫాల్ట్ లైన్లు యాక్టివ్ కావటం ఇప్పుడు ఆందోళనకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. సాధారణంగా పెద్ద పేలుళ్లు చోటు చేసుకున్న కొన్నిరోజులు లేదంటే వారాల వ్యవధిలో తీవ్రత తగ్గేలా చేస్తోంది. కానీ.. అందుకు భిన్నమైన పరిస్థితి. ఇక్కడే మరో సందేహం మదిలో మెదులుతుంది. అణు పరీక్షలు జరిపిన అమెరికా, రష్యా, చైనా, భారత్.. పాకిస్తాన్ తో సహా మరే దేశంలో లేని విధంగా ఉత్తరకొరియాలో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని. దీనికి సమాధానం తాజా రిపోర్టులో పేర్కొన్నారు.
అమెరికా, రష్యాలలో అణుపరీక్షలు జరిపినప్పుడు పేలుడు సంభవించిన కొన్ని వారాల్లోనే భూప్రకంపనలు పూర్తిగా తగ్గాయి. కానీ.. ఉత్తర కొరియాలో ఇందుకు భిన్న పరిస్థితులకు కారణం.. ఆ దేశం అనుసరించిన బాధ్యతారాహిత్యమేనని చెప్పాలి.
అమెరికా లాంటి దేశాలు తమ వందలాది భూగర్భ పరీక్షలను వేర్వేరు ప్రాంతాల్లో.. విశాలమైన ఏడారుల్లో పెద్ద ఎత్తున నిర్వహించాయి. కానీ.. ఉత్తర కొరియా మాత్రం తన ఆరు అణు పరీక్షలను మౌంట్ మాంటాప్ అనే ఒక్క చిన్న పర్వత శ్రేణి పరిధిలో నిర్వహించటమే ఈ దుస్థితికి కారణం. ఒకేచోట పదే పదే విస్ఫోటనాలు చోటు చేసుకోవటంతో అక్కడి భూమి పొరలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. అన్నింటికి మించి 2017లో చేపట్టిన ఆరో అణుపరీక్ష హిరోషిమా మీద వేసిన బాంబు కంటే దాదాపు 10-16 రెట్లు శక్తివంతమైనదిగా చెబుతున్నారు. ఒక అంచనా ప్రకారం దీని బరువు 160-250 కిలో టన్నులుగా చెబుతున్నారు. ఈ భారీ పేలుడు పర్వతం లోపల పెద్ద సొరంగాలు కూలిపోవటమే కాదు.. భూమి ఆకారాన్ని దాదాపు మూడు మీటర్ల మేర మార్చేసినట్లుగా పేర్కొన్నారు.
సదరు పర్వతం కింద శతాబ్దాలుగా కదలికలు అన్నవే లేని పరిస్థితి నుంచి వరుస పేలుళ్లతో ఒక్కసారిగా యాక్టివ్ ఏర్పడి.. పేలుళ్ల కారణంగా ఏర్పడిన కొత్త పగుళ్లలోకి భూగర్భ జలాలు చేరాయి. దీంతో వాటి మధ్య ఒత్తిడిని పెంచటంతో రాళ్లు ఒకదానికొకటి జారి నిరంతరం భూకంపాలకు కారణంగా మారాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రానున్న కాలంలో ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పు ఏమిటన్న దానికి పలు అంచనాలు వినిపిస్తున్నాయి. అందులో మూడు ముఖ్యమైనవిగా చెబుతున్నారు.
1. మౌంట్ బేక్తు అగ్నిపర్వతం బద్ధలు కావటం
2. భయంకరమైన రేడియో ధార్మిక వ్యర్థాలు.. వాయువులు బయటకు లీక్ అయ్యే ముప్పు
3. భూగర్భ జలాలు విషతుల్యం కావటం
ఉత్తర కొరియా అణుపరీక్షలతో సంభవిస్తున్న భూకంపాలు భవిష్యత్తు ముప్పుల కారణంగా నాలుగు దేశాలు అత్యంత దారుణంగా ఎఫెక్టు అవుతాయని చెబుతున్నారు. అందులో మొదటిది ఈ మొత్తం దరిద్రానికి కారణమైన ఉత్తర కొరియానే.మౌంట్ బేక్తు అగ్నిపర్వతం బద్దలైతే దాని శిఖరాగ్రాన ఉన్న సరస్సులోని 200 కోట్ల టన్నుల నీరు ఒక్కసారిగా ఉప్పొంగి ఉత్తరకొరియాలోని ర్యాంగ్ గాంగ్.. ఉత్తర హామ్ గ్యాంగ్ ప్రావిన్సులు పూర్తిగా మునుగుతాయి. అదే జరిగితే లక్షలాది మంది నిరాశ్రయులు అవుతారు. రేడియో ధార్మిక వ్యర్థాలు భూగర్భ జలాల్లోకి చేరితే పంట పొలాలు విషతుల్యమవుతాయి. అదే జరిగితే తీవ్ర ఆహారకొరతతో ఆ దేశం అల్లాడే పరిస్థితి.
ఉత్తర కొరియా తర్వాత ఎక్కువ ప్రభావం పడే దేశం చైనా. అణుపరీక్షలు నిర్వహించిన ప్రాంతం చైనాకు సమీపంలో ఉండటంతో.. దీని ముప్పు ఎక్కువే. మౌంట్ బేక్తు అగ్నిపర్వతం బద్దలైతే దాని నుంచి వెలువడే లావా కారణంగా చైనాలోని జిలిన్ ప్రావిన్స్ దారుణంగా దెబ్బతింటుంది. సరిహద్దుల్లోని యాలు, తుమెన్ నదుల నీరు కలుషితమైతే చైనాలోని కోట్లాదిమంది ప్రజల తాగునీటి వ్యవస్థలు
తర్వాతి దేశం దక్షిణ కొరియా. ఒకే దీపకల్పంలో ఉండటంతో దక్షిణ కొరియా రాజధాని సియోల్ తో పాటు దేశ వ్యాప్తంగా కలుషిత వాతావరణం విస్తరించే ప్రమాదం ఉంది. ఇది ప్రజల దీర్ఘకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. మరో దేశం కూడా ప్రభావితమవుతుంది. అదే జపాన్. ఉత్తర కొరియాతో కాస్త దూరంగా ఉన్నా.. మౌంట్ బేక్తు లాంటి అగ్నిపర్వతం బద్దలైతే విమాన సర్వీసులు మొదలు.. అగ్నిపర్వత బూడిద ఆకాశంలో కిలోమీటర్ల ఎత్తున విస్తరించి.. కొన్ని వారాల పాటు సూర్యకాంతి భూమికి చేరదు.అంతేకాదు.. తూర్పు ౠసియా లాంటి కీలక ఆర్థిక హబ్ స్తంభించిపోవటంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పరిస్థితులకు కారణమయ్యే ప్రమాదం ఉంది.