సంధ్య థియేటర్ ఘటన : మానవ హక్కుల కమిషన్ సీరియస్ యాక్షన్

ఈ దుర్ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడంపై తీవ్రంగా స్పందించిన కమిషన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.;

Update: 2025-08-06 12:34 GMT

హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో "పుష్ప-2" సినిమా ప్రీమియర్‌ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ దుర్ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడంపై తీవ్రంగా స్పందించిన కమిషన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

పోలీసుల నివేదికపై ఎన్హెచ్ఆర్‌సీ అసంతృప్తి

ఈ ఘటనపై పోలీసులు సమర్పించిన ప్రాథమిక నివేదికపై ఎన్‌హెచ్ఆర్‌సీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రీమియర్ షోకు పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి లేదని నివేదికలో పేర్కొనడాన్ని కమిషన్ గమనించింది. అనుమతి లేకుండా షో ఎలా నిర్వహించారనే దానిపై అలాగే నటుడు అల్లు అర్జున్ రాకతో పెద్ద సంఖ్యలో అభిమానులు ఎందుకు తరలివచ్చారో స్పష్టమైన వివరణ ఇవ్వాలని ప్రశ్నించింది.

ప్రభుత్వానికి ఎన్ హెచ్ఆర్‌సీ సూటి ప్రశ్నలు

ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన యువతి కుటుంబానికి కనీసం రూ. 5 లక్షల పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఎందుకు ఇవ్వకూడదు? అని ప్రశ్నించింది. ఘటనకు సంబంధించి పూర్తిస్థాయి విచారణ జరిపి, ఆరు వారాల్లోగా మరో నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు సీఎస్‌కు కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

హైదరాబాద్ సీపీకి సూచనలు

సంధ్య థియేటర్‌లో రద్దీని ముందుగానే అంచనా వేయడంలో అధికారులు నిర్లక్ష్యం చూపారని ఎన్‌హెచ్ఆర్‌సీ అభిప్రాయపడింది. అందుకే, ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌ (సీపీ)కు సూచించింది.

ఈ ఘటనపై ఎన్‌హెచ్ఆర్‌సీ తీసుకున్న ఈ చర్యలు తెలంగాణలో ప్రభుత్వ వ్యవస్థల పర్యవేక్షణపై మానవ హక్కుల కమిషన్ ఎంత సీరియస్‌గా ఉందో స్పష్టం చేస్తున్నాయి. బాధిత కుటుంబానికి న్యాయం జరగడం, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం.

Tags:    

Similar News