సింగపూర్కు మంత్రి లోకేష్.. ఈసారి ఎందుకంటే!
అంతేకాదు.. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను కూడా ఈ పర్యటనలో తెలుసుకుంటారు.;
ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్.. ఆదివారం(మే 10) నుంచి వరుసగా ఐదు రోజులు సింగపూర్లో పర్యటించనున్నారు. ఆయన వెంట అధికారుల బృందం కూడా ఉండనుంది. మొత్తం 15 మంది బృందం.. ఐదు రోజుల పాటు సింగపూర్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో పలు అంశాలపై మంత్రి అధ్యయనం చేయనున్నారు. ఈ పర్యటన విద్యా, పారిశ్రామిక సహకారాలపై దృష్టి సారిస్తుంది.
ఇందులో భాగంగా అంతర్జాతీయ అనుభవ కార్యక్రమాలు, నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను కూడా చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉత్తమ పద్ధతులను అమలు చేసేందుకు మంత్రి లోకేష్ సింగపూర్లో నైపుణ్యాభివృద్ధి, ఇ-గవర్నెన్స్, అంతర్జాతీయ భాగస్వామ్యాలను సమీక్షించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యా ప్రమాణాలను ఉన్నతీకరించడానికి, అంతర్జాతీయ టెక్నాలజీ కారిడార్ను ఏర్పాటు చేయడానికి ఆయన చేస్తున్న నిరంతర ప్రయత్నాలకు అనుగుణంగా ఈ పర్యటన ఉంటుంది.
అంతేకాదు.. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను కూడా ఈ పర్యటనలో తెలుసుకుంటారు. తద్వారా.. మరింత మెరుగైన పాలనా విధానాలను అనుసరించేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయనున్నారు. సంక్షేమంతో పాటు.. అభివృద్ధిని సమపాళ్లలో ముందుకు తీసుకువెళ్తున్న ప్రభుత్వానికి మరింత గ్రాఫ్ పెరిగేలా చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన పెట్టుకున్నట్టు మంత్రి కార్యాలయం పేర్కొంది.
ఈ పర్యటనకు అయ్యే ఖర్చును ప్రభుత్వం పెట్టుకుంటున్నట్టు తెలిపింది. ఈ మేరకు అన్ని అనుమతు లు ఇస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు. పర్యటన ముగిసిన తర్వాత.. ప్రభుత్వానికి మంత్రి నారా లోకేష్.. తాను చేసిన అధ్యయనం తాలూకు విశేషాలతో నివేదికను అందించనున్నారు.