అప్పుడు సాయిబాబా.. ఇప్పుడు సీబీఎన్: లోకేష్
చంద్రబాబు దూరదృష్టిని కొందరు సందేహిస్తున్నారని.. మరికొందరు సెటైర్లు వేస్తున్నారని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
చంద్రబాబు దూరదృష్టిని కొందరు సందేహిస్తున్నారని.. మరికొందరు సెటైర్లు వేస్తున్నారని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. కానీ, వాస్తవానికి విజన్ ఎప్పుడూ.. తొలినాళ్లలో నవ్వుల పాలవుతుందని.. కానీ, దాని ఫలాలు అందుకున్నాక.. విజన్ విలువ తెలుస్తుందని చెప్పారు. దీనికి ఉదాహరణగా పుట్టపర్తి సాయిబాబాను ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు 100 కుటుంబాలు కూడా లేని పుట్టపర్తిలో సాయిబాబా అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించారని తెలిపారు.
అప్పట్లో సాయిబాబా విజన్ను అందరూ తప్పుబట్టారని.. వృథాగా నిర్మిస్తున్నారని వ్యాఖ్యానించారని లోకేష్ చెప్పారు.కానీ, ఇప్పుడు ఈ విమానాశ్రయం కూడా సరిపోనంతగా ప్రజలు ఇక్కడకు వస్తున్నారని తెలిపారు. బెంగళూరు, అనంతపురం ప్రాంతాలకే కాకుండా.. ఇతర ప్రాంతాలకు కూడా ఈ విమానాశ్రయం ఎంతో కలిసి వస్తోందన్నారు. అదేవిధంగా చంద్రబాబు కూడా దూర దృష్టితో రాయలసీమలో అనేక ప్రాజెక్టులను ప్రారంభించారని చెప్పారు.
కియా కార్ల పరిశ్రమను అనంతపురం జిల్లాకు తీసుకువచ్చినప్పుడు కూడా అనేక మంది విమర్శలు చేశారని లోకేష్ చెప్పారు. కానీ, అదే కరువు నేలపై ఏర్పడిన కియా పరిశ్రమ ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా కూడా కార్లను ఉత్పత్తి చేస్తోందని తద్వారా సీమకు, ఏపీకి కూడా పేరు వస్తోందన్నా రు. అప్పట్లో సాయిబాబా విజన్ ఎలా అయితే.. సీమ ప్రాంతాన్ని ప్రపంచం దృష్టి ఆకర్షించేలా చేసిందో ఇప్పుడు చంద్రబాబు విజన్ కూడా అలానే దేశాన్ని, ప్రపంచాన్ని కూడా ఆకర్షించేలా చేస్తుందన్నారు.
75లో 25!
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ-రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్-సీఎం చంద్రబాబుల వయసును మంత్రి లోకేష్ ప్రస్తావించారు. వీరింతా ఇంచుమించు 75 ఏళ్ల వయసులోనే ఉన్నారని.. కానీ, వీరి ముందు 25 ఏళ్ల యువకులు కూడా సరిపోరని.. అంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని కొనియాడారు. అంతే వేగంగా పనులు కూడా చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ వల్లే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. త్వరలోనే కర్నూలులో హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.