రాహుల్ కి చాన్స్ ఇస్తున్న మోడీ ?
ప్రధాని నరేంద్ర మోడీ అపర చాణక్యుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయనకు ఓటమి అన్నది అయితే లేదు. ఆయన పదమూడేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా ఏకబిగిన కొనసాగారు.
ప్రధాని నరేంద్ర మోడీ అపర చాణక్యుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయనకు ఓటమి అన్నది అయితే లేదు. ఆయన పదమూడేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా ఏకబిగిన కొనసాగారు. సీఎం గానే ఉంటూ ప్రధానిగా ప్రమోట్ అయిన ఏకైక నాయకుడిగా నరేంద్ర మోడీ సరికొత్త రికార్డు సృష్టించారు. ఇక ప్రధానిగా కూడా ఆయన పన్నెండేళ్ల పాలనను పూర్తి చేసుకున్నారు. మరో మూడేళ్ళు పూర్తి అయితే మాజీ ప్రధాని ఇందిరమ్మ పాలనకు అతి సమీపంలోకి వచ్చేస్తారు. అలా కాంగ్రెసేతర ప్రధానిగా మోడీ మరో రికార్డుని కూడా క్రియేట్ చేస్తారు. ఇక మోడీ రాజకీయ వ్యూహాలు ప్రత్యర్ధులకు అందవు. వారు తెలుసుకునేలోగానే లక్ష్యాన్ని అవి చేదిస్తాయి. ఆ విధంగా ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ లాంటి సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీని ఇతర బలమైన ప్రాంతీయ పార్టీలను సైతం దాటుకుంటూ ముందుకు సాగిపోతూ వచ్చారు.
పట్టు చిక్కుతోందా :
అయితే కాంగ్రెస్ అగ్ర నేత లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాత్రం ఎక్కడా నిరాశ చెందడం లేదు. వరుసగా మూడు ఎన్నికల్లో ఓటమి సంభవించినా కూడా ఆయన శక్తిని కూడదీసుకుని మోడీతో ఢీ కొడుతూనే ఉన్నారు. కాలం కలిసి రావాలి అంటారు. రాజకీయాల్లో టైమింగ్ చాలా ఇంపార్టెంట్. బహుశా రాహుల్ కూడా దాని కోసమే ఇంత కాలం వేచి చూస్తూ ఉన్నారేమో అనుకోవాలి. అదే సమయంలో ఆయన ఎక్కడా మోడీని విడిచి పెట్టడం లేదు. లోక్ సభలోనూ బయటా ఏ సందర్భం వచ్చినా విమర్శల బాణాలు ఎక్కుబెడుతూనే ఉన్నారు. ఇక ఈ ఏడాది కాంగ్రెస్ కి గ్రాఫ్ పెరిగినట్లుగా ఉంది. అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి పశ్చిమ బెంగాల్ వంటి అతి పెద్ద రాష్ట్రం దక్కినా కూడా గ్రాఫ్ చూస్తే కాంగ్రెస్ వైపే ఉందని అంటున్నారు. దానికి కారణం కేరళంలో బంపర్ మెజారిటీతో గెలుచుకోవడం అలాగే మరో పెద్ద రాష్ట్రం తమిళనాడులో టీవీకేతో చేతులు కలిపి చక్రం తిప్పడం ద్వారా బీజేపీ ఆశలను అడియాశ చేయడం. దాంతో పాటు ఇపుడు రాహుల్ గాంధీ మరింత జోరు చేస్తున్నారు.
పెట్రో మంటల నేపధ్యం :
దేశంలో పెట్రోల్ డీజిల్ పెరగడానికి కారణాలు ఎన్ని చెప్పినా కూడా ప్రజలు శాంతించరు, పేదవారు మధ్య తరగతి అయితే ఆగ్రహంగానే ఉంటారు. దానికి తోడు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేది లేదని ఒక వైపు గంభీరమైన ప్రకటనలు అధికారంలో ఉన్న ఎన్ డీయే ప్రభుత్వం ఇచ్చి తీరా ఫలితాలు వచ్చి కుర్చీలు అందుకున్నా ఒక్కసారిగా ధరలు పెంచడంతోనే జనాగ్రహం బాగా కనిపిస్తోంది. ఇది నమ్మించి మోసం చేశారు అన్న భావనను కలిగిస్తోంది. అంతే కాదు పొదుపు చర్యలను పాటించమని స్వయంగా మోడీ చెబుతున్నారు కానీ అదే సమయంలో ప్రధాని వరసగా కొన్ని దేశాలలో పర్యటనలు పెట్టుకోవడం అది కాస్తా అయిదు రోజుల పాటు సాగడం మీద కూడా జనంలో చర్చ సాగుతోంది. సరిగ్గా ఈ పాయింట్ నే ముందు పెట్టి రాహుల్ గాంధీ మోడీ మీద భారీ విమర్శలే చేస్తున్నారు.
జనాలకేనా చెప్పేది :
ప్రజలకు పొదుపు మంత్రం చెప్పి ప్రధాని విదేశీ పర్యటనలు చేయడమేంటి అని రాహుల్ గాంధీ మోడీని సూటిగానే ప్రశ్నించారు. అంతే కాదు దేశంలో ప్రజలు నానా అవస్థలు పడుతూంటే అక్కడ అతిధులకు గిఫ్టులు ఇస్తూ హడావుడి చేయడం పట్ల కూడా గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్నారు. మోడీ పర్యటనలు ఆపుకోవచ్చు కదా అని సలహా కూడా ఇస్తున్నారు. అఫ్ కోర్స్ ప్రధాని పర్యటనలు అన్నీ ముందే షెడ్యూల్ చేయబడతాయి. అందులో ఒప్పందాలు ఉంటాయని కూడా ఎన్ డీయే ప్రభుత్వ పెద్దలు చెప్పుకోవచ్చు. కానీ దేశంలో పెట్రో మంటలు పెట్టించి మోడీ విదేశీ పర్యటనలు చేస్తున్న సమయం సందర్భం మాత్రం కచ్చితంగా బిగ్ డిబేట్ గానే ఉంది. దానిని చాకచక్యంగా అంద్దుకుని రాహుల్ గాంధీ అధికార పార్టీ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గాలి మార్పుతోనేనా :
గతంలో మోడీ ఏమి చెబితే జనాలు అది తుచ తప్పకుండా చేసేవారు. అలా పెద్ద నోట్ల రద్దు వ్యవహారం నుంచి కరోనా టైం లో కంచాల మీద చప్పుళ్ళు చేయడం దాకా ఎన్నో చేశారు. కానీ ఇపుడు బంగారం కొనవద్దు అని మోడీ అంటే జనాలలో స్పందన అంతగా కనిపించలేదు. పొదుపు చర్యలు పాటించమని కోరుతున్నా అదే రియాక్షన్ కనిపిస్తోంది. దీంతో మారుతున్న రాజకీయ గాలి మార్పు ఇదంతా అన్న విశ్లేషణలు ఉన్నాయి. దీనిని సరిగ్గా పసిగట్టిన రాహుల్ గాంధీ మోడీ మీద తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు దేశంలో ఇంకా మూడేళ్ళ సమయం ఉంది. ఈసారి పక్కాగా రాజకీయం జాతీయ స్థాయిలో మారుతుంది అన్న ఊహాగానాల మధ్య రాహుల్ ఇస్తున్న ప్రకటనలు చేస్తున్న కామెంట్స్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ రావడం బట్టి చూస్తే ఆలోచించాల్సిందే అని అంటున్నారు.