విశాఖలో అద్భుతం... 'యోగాంధ్ర'లో మోడీ, బాబు, పవన్!

ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ... అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.;

Update: 2025-06-21 04:30 GMT

విశాఖలో నేడు 'యోగాంధ్ర' కార్యక్రమం ప్రారంభమైంది. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా... ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తదితరులు యోగాసనాలు వేశారు. అంతకు ముందు మోడీ.. యోగా స్మారక పోస్టల్‌ స్టాంప్‌ విడుదల చేశారు.

 

అవును... ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు.'యోగా ఫర్‌ వన్‌ ఎర్త్‌.. వన్‌ హెల్త్‌' నినాదంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. విశాఖలోణి ఆర్కే బీచ్‌ నుంచి భోగాపురం వరకు పెద్ద ఎత్తున ప్రజానికం యోగాసనాలు వేశారు.

 

ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ... అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా... యోగా ప్రపంచ దేశాలను ఏకం చేసిందని.. యోగా దినోత్సవ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతిచ్చాయని.. యోగా అనేది మానవతను పెంచే సామూహిక ప్రక్రియ అని తెలిపారు.

ఇదే సమయంలో... ప్రకృతి సౌందర్యానికి, ప్రగతికి చిరునామా విశాఖపట్నం అని కొనియాడిన ప్రధాని మోడీ... ప్రకృతిలో మనిషి భాగస్వామి అని యోగా గుర్తు చేస్తుందని తెలిపారు. యోగాతో వ్యక్తిగత క్రమశిక్షణ అలవడుతుందని.. యోగా ద్వారా నేను అన్న భావన మనంగా మారుతుందని.. అదే మానవత్వాన్ని పెంచుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... యోగా దినోత్సవం రోజు విశాఖలో రికార్డు సృష్టించబోతున్నామని అన్నారు. 1.44 లక్షల మంది యోగా శిక్షకులు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నారని.. నిన్న 22 వేల మంది గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలతో గిన్నిస్‌ రికార్డు సాధించారని తెలిపారు.

ఇదే సమయంలో... యోగా అంటే కేవలం వ్యాయామం మాత్రమే కాదని చెప్పిన చంద్రబాబు... యోగాతో క్రమశిక్షణ, ఏకాగ్రత పెరుగుతాయని.. యోగా దినోత్సవాన్ని 130 దేశాల్లో నిర్వహించుకుంటున్నారని తెలిపారు. యోగాను అన్ని క్రీడల్లో భాగం చేయాలని.. 'స్వర్ణాంధ్ర 2047' సాధనలో యోగాకు భాగస్వామ్యం కల్పిస్తామని చంద్రబాబు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్... మోడీ సమక్షంలో, చంద్రబాబు కృషితో ప్రపంచ రికార్డు సాధించబోతున్నామని.. యోగా విశిష్ఠతను రుగ్వేదం చెబితే.. దాన్ని ప్రధాని మోడీ విశ్వవ్యాప్తం చేశారని అన్నారు. 'వన్ ఎర్త్.. వన్ హెల్త్' థీమ్ ను విశాఖ వేదిక నుంచి ప్రతి ఒక్కరు ముందుకు తీసుకెళ్లాలని కోరారు.

ఇదే సమయంలో... భారతీయ సనాతన ధర్మం విశిష్ఠతను యోగా ద్వారా ప్రపంచానికి తెలిపిన ఘనత మోడీదే అని చెప్పిన పవన్ కల్యాణ్.... యోగా సాధకులు ఎంతటి దృఢ చిత్తంతో ఉంటారనేదానికి.. ఒత్తిడిని జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారనేదానికి మోడీ నిలువెత్తు ఉదాహరణ అని పేర్కొన్నారు.

Tags:    

Similar News