కేంద్ర మంత్రి వర్గ ప్రక్షాళన.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
సహజంగానే వారానికి ఒకసారి కేబినెట్ భేటీ జరుగుతోంది. కానీ, ఈ దఫా జరగనున్న మంత్రి వర్గ సమావేశానికి కేంద్రంలోని అందరు మంత్రులను ఆహ్వానించారు.
కేంద్ర మంత్రి వర్గాన్ని ప్రక్షాళన చేయనున్నారన్న వార్తలు ఊపందుకున్నాయి. కేంద్రంలో మూడోసారి వరుసగా ప్రధాని మోడీ అధికారం చేపట్టిన తర్వాత.. ఇంత త్వరగా మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేస్తారన్న వార్తలు రావడం ఇదే తొలిసారి. నిజానికిగతంలో రెండు సార్లు అధికారంలో ఉన్నా.. అప్పట్లో ఇంత పెద్ద ఎత్తున చర్చ జరగలేదు. కానీ, అప్పటి ప్రభుత్వాలకు.. ప్రస్తుత ప్రభుత్వా నికి మధ్య చాలా తేడా ఉంది. గత రెండు ప్రభుత్వాలు.. కూడా బీజేపీ సొంతంగానే మెజారిటీ ఫిగర్ దక్కించుకుని అధికారం చేపట్టింది. కానీ, ఈ దఫా మిత్రపక్షాలతో కలిసి.. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చారు.
ముఖ్యంగా టీడీపీ, జనసేన, జేడీయూ సహా.. అనేక చిన్నా చితకా పార్టీల మద్దతు కూడా ఉంది. ఈ నేపథ్యంలో మిత్రపక్షాలకు ప్రాధాన్యం పెంచాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. పైగా.. వచ్చే ఎన్నికలపై మరింత పట్టు పెంచుకోవాలంటే.. ఎన్డీయే కూటమిని ఇప్పటి నుంచే సంతృప్తి పరచడం ప్రధాని ముందున్న ప్రధాన లక్ష్యం. ఈ క్రమంలోనే తాజాగా మంత్రి వర్గ ప్రక్షాళన వార్తల్లో నిజం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి తోడు గురువారం.. ప్రధాని మోడీ అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు కానుంది. దీనికి ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.
సహజంగానే వారానికి ఒకసారి కేబినెట్ భేటీ జరుగుతోంది. కానీ, ఈ దఫా జరగనున్న మంత్రి వర్గ సమావేశానికి కేంద్రంలోని అందరు మంత్రులను ఆహ్వానించారు. కేబినెట్ మంత్రులతో పాటు.. సహాయ మంత్రులు, స్వతంత్ర హోదా ఉన్న మంత్రులు (ఉదాహరణకు కిషన్ రెడ్డి) కూడా ఈ సమావేశానికి రానున్నారు. షెడ్యూల్ ప్రకారం.. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశం సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుందని అంచనా వేశారు. అంటే.. ఇంత భారీ స్థాయిలో మంత్రివర్గ సమావేశం నిర్వహించడం.. ఈ ఏడాది ఇదే తొలిసారి అని కూడా అధికారులు చెబుతున్నారు.
పదవులు ఉంటాయా?
ప్రస్తుతం సహాయ మంత్రులు గా ఉన్నవారిలో కొందరికి పదవులు ఊడుతాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అదేవిధంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎ న్నికల్లో కీలకంగా వ్యవహరించిన బీజేపీ నాయకులకు పదవులు ఇస్తారన్న ప్రచారం కూడా ఉంది. వీరిలో తమిళనాడు నుంచి అన్నామలై పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలానే.. బీహార్ మాజీ సీఎం, రాజ్యసభకు నామినేట్ అయిన.. నితీష్కుమార్ను కూడా మంత్రి వర్గంలోకి తీసుకుంటారని అంటున్నారు. అలాగే.. వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులను పార్టీకి పరిమితం చేసి.. ఎన్నికలపై ఎక్కువగా దృష్టి పెట్టేలా చేయనున్నారు. అలానే.. టీడీపీ, జనసేన నుంచి కూడా ఒక్కొక్కరు చొప్పున మంత్రి వర్గంలో అవకాశం దక్కనుందని అంటున్నారు.