షాకింగ్... ఆ ఒక్క జిల్లాలో 14,542 మంది మహిళల్లో క్యాన్సర్ లక్షణాలు!
అవును... క్యాన్సర్ పై చాలాకాలంగా పలువురు సెలబ్రెటీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు అవగాహనా కార్యక్రమాలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే.;
క్యాన్సర్... మనిషిని శారిరకంగానూ, మానసికంగానూ పూర్తిగా కృంగదీస్తూ తీవ్ర ఆందోళన కలిగించే వ్యాది! ఇటీవల కాలంలో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా వ్యాపిస్తున్నాయని అంటున్నారు. ప్రధానంగా మహిళల్లో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఈ సమయంలో ఓ షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది. ఒకే జిల్లాలో ఏకంగా 14,542 మంది మహిళల్లో క్యాన్సర్ అనుమానిత లక్షణాలు బయటపడ్డాయి.
అవును... క్యాన్సర్ పై చాలాకాలంగా పలువురు సెలబ్రెటీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు అవగాహనా కార్యక్రమాలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. క్యాన్సర్ లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించడం వల్ల నివారణ సులభమవుతుందని చెబుతున్నారు. ఈ సమయంలో... క్యాన్సర్ కేసులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు సంజీవని పథకం ప్రారంభించగా.. ఇందులో షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది.
ఇందులో భాగంగా... మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో వేలాది మంది మహిళల్లో క్యాన్సర్ అనుమానిత లక్షణాలు బయటడ్డాయి. ఈ వ్యవహారం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. క్యాన్సర్ కేసులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు సంజీవని పథకంలో భాగంగా అధికారులు జరిపిన స్క్రీనింగ్ పరీక్షల్లో ఈ విషయం వెల్లడైంది. ఈ విషయాలను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ప్రకాశ్ అబిత్కర్ తెలిపారు.
ఈ సందర్భంగా... మార్చి 8 నుంచి మొత్తం 2,92,996 మందికి సర్వే నిర్వహించగా.. క్యాన్సర్ లక్షణాలకు సంబంధించి ఇచ్చిన ప్రశ్నపత్రానికి మహిళలు సమాధానాలిచ్చారని పేర్కొన్న మంత్రి... వారిలో 14,542 మంది మహిళల్లో క్యాన్సర్ తరహా లక్షణాలు గుర్తించినట్లు తెలిపారు. అనంతరం ముగ్గురికి గర్భాశయ క్యాన్సర్, ఒకరికి రొమ్ము క్యాన్సర్, ఎనిమిది మందికి నోటి క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ కూడా అయిందని మంత్రి వెల్లడించారు.
ఈ నేపథ్యంలో క్యాన్సర్ నిర్ధారణ కోసం గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు, స్క్రీనింగ్ టెస్ట్ లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో... జిల్లా ఆసుపత్రులు, మెడికల్ కాలేజీ ఆస్పత్రుల్లోనూ క్యాన్సర్ కు చికిత్స అందించనున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో... ఇప్పటికే ఎనిమిది జిల్లా ఆసుపత్రుల్లో డే కేర్ కీమోథెరపీ కేంద్రాలను ప్రారంభించామని, అన్ని జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
అయితే... మహిళలకు ప్రత్యేక క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేసిన మంత్రి... టాటా మెమోరియల్ ఆస్పత్రి నుంచి శిక్షణ పొందిన 'క్యాన్సర్ వారియర్స్' ప్రతి నెలా నిపుణులతో కలిసి రెండుసార్లు 11 ఆస్పత్రులను సందర్శిస్తారని తెలిపారు.