టార్గెట్ ఎవ‌రు?: కాక రేపుతున్న కొండా సురేఖ కామెంట్స్‌..!

తాను విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న‌ప్పుడు.. దేవ‌దాయ శాఖ క‌మిష‌న‌ర్‌తో క‌డియం భేటీ కావడాన్ని మంత్రి సురే ఖ జీర్ణించుకోలేక పోతున్నారు.

Update: 2026-07-09 16:30 GMT

తెలంగాణ దేవ‌దాయ శాఖ మంత్రి కొండా సురేఖ‌.. అమీతుమీకి రెడీ అయిపోయిన‌ట్టు తెలుస్తోంది. వ‌రం గ‌ల్ జిల్లా స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి క‌డియం శ్రీహ‌రి కేంద్రంగా ప్రారంభ‌మైన వివాదం ఇప్పుడు తీవ్రస్థాయికి చేరింది. ``గ‌తంలో టీడీపీలో ప‌నిచేసిన వారి స‌హ‌కారం, అండ ఉండ‌బ‌ట్టే.. క‌డి యం ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.``అని సురేఖ చేసిన వ్యాఖ్య‌లు ఎవ‌రిని ఉద్దేశించి చేశార‌నే కోణంలో రాజ కీయ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి.

వాస్త‌వానికి క‌డియం గ‌తంలో టీడీపీలో ఉన్న‌ప్పుడు.. ప్ర‌స్తుత సీఎం రేవంత్ రెడ్డి కూడా.. ఆయ‌న వెంటే ఉన్నారు. ఇప్పుడు ఇరువురు వేర్వేరు పార్టీల్లో ఉన్నా.. క‌డియం.. శ్రీహ‌రి బీఆర్ ఎస్‌ను కాద‌ని కాంగ్రెస్‌కు మద్ద‌తు ఇవ్వ‌డం వెనుక ఖ‌చ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి అభ‌యం ఉంద‌న్న‌ది తెలిసిందే. గ‌త విచార‌ణ స‌మ‌యంలోనూ సీఎం చెబితే రాజీనామా చేస్తానంటూ కూడా క‌డియం ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ల‌క్ష్యంగానే సురేఖ కామెంట్లు చేసి ఉంటార‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

తాను విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న‌ప్పుడు.. దేవ‌దాయ శాఖ క‌మిష‌న‌ర్‌తో క‌డియం భేటీ కావడాన్ని మంత్రి సురే ఖ జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ విష‌యంపై బుధ‌వార‌మే ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి సుదీర్ఘ లేఖ రాశారు. అనంత‌రం.. గురువారం మ‌ధ్యాహ్నం.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ మ‌హేష్ గౌడ్‌ను క‌లిసిన మంత్రి.. ఆయ‌న‌కు కూడా ఫిర్యాదు లేఖ‌ను అందించారు. పార్టీకి సంబంధం లేని శాస‌న స‌భ్యుడు.. మంత్రి శాఖ‌కు సంబందించి స‌మీక్ష చేయ‌డం ఏంట‌ని ఆమె ప్ర‌శ్నించారు. త‌క్ష‌ణ‌మే క‌డియంపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

అనంత‌రం.. మీడియాతో మాట్లాడిన సురేఖ‌.. పార్టీలు మార‌డం.. అధికారంలో ఉన్న‌వారి వెనుక తిర‌గ‌డం క‌డియంకు వెన్న‌తో పెట్టిన విద్య‌గా విమ‌ర్శించారు. బీఆర్‌ఎస్ త‌ర‌ఫున కారు గుర్తుపై గెలిచిన వ్యక్తి... ఆ పార్టీని మోసం చేసి కాంగ్రెస్‌లో చేరారని దుయ్య‌బ‌ట్టారు. మొదటి నుంచి కూడా కడియం రాజకీయం ఇలానే ఉంటుందని ఎద్దేవా చేశారు. ``టీడీపీలో ఆయనకు మిత్రులుగా ఉన్న వారి సహకారం కూడా ఉంది. అందుకే ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు.`` అని సురేఖ వ్యాఖ్యానించ‌డం రాజ‌కీయంగా వివాదానికి దారి తీస్తోంది. మ‌రోవైపు మ‌హేష్ కుమార్ గౌడ్ మాత్రం ఈ వివాదం టీ క‌ప్పులో తుఫానేన‌ని త్వ‌ర‌లోనే స‌మ‌సి పోతుంద‌ని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News