కవితకు డిపాజిట్ కూడా కష్టమే: కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర సేన-టీఆర్ఎస్.. పేరుతో కొత్త పార్టీని ప్రకటించిన కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.;
తెలంగాణ రాష్ట్ర సేన-టీఆర్ఎస్.. పేరుతో కొత్త పార్టీని ప్రకటించిన కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ ఎవరైనా పెడతారని కానీ.. గెలిచే దమ్ము.. ప్రజల్లో నిలిచే ధైర్యం ఉండాలని వ్యాఖ్యానించారు. కవిత పార్టీని కేఏ పాల్ పార్టీతో పోల్చారు. అంతేకాదు.. కవిత ఒంటరిగా పోటీ చేస్తే.. డిపాజిట్ కూడా రాదని అన్నారు. ఆమెపై ఢిల్లీ లిక్కర్ కేసు ఉందని.. దానిపై ఇంకా విచారణ పూర్తికాలేదని.. ఈ నేపథ్యంలో కవితేమీ.. స్వేచ్ఛానాయకురాలు కాదని వ్యాఖ్యానించారు.
ఇక, తన తండ్రి కేసీఆర్పై కవిత చేసిన వ్యాఖ్యలను కూడా రాజగోపాల్ రెడ్డి తప్పుబట్టారు. కేసీఆర్ నీడలోనే ఆమె ప్రజల మధ్యకు వచ్చిన విషయాన్ని మరిచిపోతున్నారని.. కేసీఆర్.. తెలంగాణ ఉద్యమకారుడిగా ప్రజల్లో పేరు తెచ్చుకున్నారని అన్నారు. ఆయన బిడ్డగానే ఆమెకు ప్రజల్లో గుర్తింపు ఉంటుందన్నారు. అలాంటి తండ్రి నీడన నిన్నటి వరకు బతికిన కవిత.. హఠాత్తుగా ఆయనను టార్గెట్ చేయడం మంచిది కాదన్నారు.
ఇది మర్యాద కూడా కాదన్నారు. రాజకీయంగా పార్టీ పెట్టుకున్నా తొలి సమావేశంలోనే ఆమె కేసీఆర్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం ఉద్యమకారులకు కూడా నచ్చడం లేదన్నారు. తెలంగాణకు అమ్మ అని చెప్పుకొంటున్న కవిత.. తన తండ్రికే విలువ ఇవ్వనప్పుడు.. ఆమె తెలంగాణకు అమ్మ ఎలా అవుతుందని ప్రశ్నించారు.
ఇక, లిక్కర్ కేసు గురించి మాట్లాడుతూ.. ఢిల్లీ లిక్కర్ కేసు.. కవిత పై వేలాడుతోందని ఆమెకు ఇంకా క్లీన్ చిట్ రాలేదని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆమె ఎప్పుడైనా ఈ కేసులో మరోసారి చిక్కుకునే అవకాశం ఉందన్నారు. అందుకే.. బీజేపీని లక్ష్యంగా చేసుకోకుండా.. చాలా బ్యాలెన్స్డ్గా వ్యవహరించారని అన్నారు. డబ్బులు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి కాబట్టి పార్టీ పెట్టారని వ్యాఖ్యానించారు. ``డబ్బులు ఉంటే పార్టీ పెట్టడం పాన్ షాప్ పెట్టినంత సులభమైపోయింది.`` అని ఎద్దేవా చేశారు. కవితతో "ఊదు కాలదు, పీరు లేవదు`` అన్నట్టు ఉంటుందని అన్నారు.