కేశినేని బ్రదర్స్ ‘వార్’.. రూ.120 కోట్ల స్కామ్ గుట్టురట్టు.!
ఈ పొలిటికల్ ఫైట్లో విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని చిన్ని వేసిన సరికొత్త స్కెచ్ ఇప్పుడు సంచలనంగా మారింది.
బెజవాడ పొలిటికల్ స్క్రీన్ మీద సరికొత్త ‘బ్రదర్స్ వార్’ పీక్స్ కి చేరింది. నిన్నటివరకు పార్టీల మార్పు, టికెట్ల రాజకీయం చుట్టూ తిరిగిన కేశినేని సోదరుల వివాదం.. ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. ఒకరి జాతకాలను ఒకరు రోడ్డుపైకి లాగుతూ, ఏకంగా వందల కోట్ల బ్యాంక్ స్కామ్స్, ఈడీ ఫిర్యాదుల వరకు వెళ్లడంతో ఏపీ పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. 2024 ఎన్నికల ముగిసినా వీరి మధ్య మంటలు చల్లారకపోగా.. మరింత ముదరడం గమనార్హం.
ఈ పొలిటికల్ ఫైట్లో విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని చిన్ని వేసిన సరికొత్త స్కెచ్ ఇప్పుడు సంచలనంగా మారింది. తనపై వస్తున్న బినామీ, భూ ఆక్రమణల ఆరోపణలకు చెక్ పెడుతూ.. ఆయన నేరుగా మాజీ ఎంపీ కేశినేని నాని ఆర్థిక మూలాలనే టార్గెట్ చేశారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకును నాని అడ్డంగా ముంచేశారని, దాదాపు రూ.120 కోట్ల ప్రజాధనాన్ని మొండి బకాయిలుగా మార్చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. నిబంధనల్లోని లూప్హోల్స్ను వాడుకుంటూ నాని విజయవాడ ‘విజయ్ మాల్యా’లా మారారని, చివరకు ఆయన ఉంటున్న ఇల్లు, వాడుతున్న హోటల్ కూడా బ్యాంక్ ఆధీనంలోనే ఉన్నాయంటూ చిన్ని బాంబ్ పేల్చారు.
అయితే, తమ్ముడు వేసిన ఈ రివర్స్ అటాక్పై మాజీ ఎంపీ కేశినేని నాని కూడా ఏమాత్రం తగ్గడం లేదు. సోషల్ మీడియా వేదికగా ఆయన రీ-కౌంటర్ ఇచ్చారు. వేల కోట్ల ప్రభుత్వ భూములను ఒక కార్పొరేట్ సంస్థకు కట్టబెట్టే పెద్ద డీల్ను తాను సీఎంకు లేఖ రాసి అడ్డుకున్నానని, ఆ ఫ్రస్టేషన్తోనే తనపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. బెజవాడ పాలిటిక్స్లో ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ ఇద్దరు నేతల మధ్య నడుస్తున్న ఈ కోట్ల రూపాయల మైండ్ గేమ్ రాబోయే రోజుల్లో ఇంకెన్ని సంచలనాలకు దారితీస్తుందో చూడాలి.