తప్పుడు ప్రచారం నమ్మొద్దు: జనసేన జాగ్రత్తలు
"నేతలూ తప్పుడు ప్రచారం నమ్మొద్దు." అంటూ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేరుతో సోమవారం రాత్రి ఓ కీలక ప్రకటన జారీ చేసింది.
``నేతలూ తప్పుడు ప్రచారం నమ్మొద్దు.`` అంటూ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేరుతో సోమవారం రాత్రి ఓ కీలక ప్రకటన జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఏ నిర్ణయమైనా పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కనుసన్నల్లోనే జరుగుతుందని తేల్చి చెప్పింది. క్షేత్రస్థాయిలో కొందరు తమను పార్టీ ఎంపిక చేసిందని.. తామే పోటీ చేయనున్నామని చెబుతున్న సమాచారం.. చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ప్రకటించింది. దీనిని ఎవరూ విశ్వసించరాదని స్పష్టం చేసింది. అంతేకాదు.. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎవరిని ఎంపిక చేయాలనే నిర్ణయం పూర్తిగా పార్టీ అధినేతదేనని పేర్కొంది.
అంతేకాదు.. కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, బీజేపీలతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని పార్టీ కేంద్ర కార్యాలయం పేర్కొంది. ఈ చర్చలకు పార్టీ అధినేత నిర్ణయించిన నాయకులు హాజరవుతున్నారని, ప్రస్తుతం ఈ చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని తెలిపింది. పార్టీ కోసం కష్టపడిన వారిని, త్యాగాలు చేసిన వారిని, ముఖ్యంగా వీర మహిళలను పార్టీ గుర్తుంచుకుంటుందని వారి ఆకాంక్షలు నెరవేర్చేందుకు పార్టీ అధినేత ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారని తెలిపింది. అయితే.. ముందుగానే కొందరు క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నట్టు పార్టీ దృష్టికి వచ్చిందని.. ఇది సరికాదని పార్టీ స్పష్టం చేసింది. ఇలాంటి ప్రచారం చేసేవారిని ఉపేక్షించేది లేదని పేర్కొంది.
పార్టీ తరఫున ఎవరు పోటీ చేయాలి? స్థానిక సంస్థల్లో ఎన్ని సీట్లు తీసుకోవాలి? అనే విషయాలు పూర్తిగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్కు సంబందించిన వ్యవహారమని.. దీనిపై ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని పార్టీ కార్యాలయం తెలిపింది. అదేసమ యంలో పార్టీ సిద్ధాంతాలు.. కూటమి విజయాలను అందరూ దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పార్టీ తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా అందరూ వ్యవహరించాలని పేర్కొంది. దీనిలో ఎలాంటి మార్పూలేదని పేర్కొంది. స్థానిక ఎన్నికల్లో విజయం దక్కించుకోవడం ఎంత ముఖ్యమో.. పార్టీ నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తల మధ్య ఐక్యత కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేసింది. ఈ విషయంలో పార్టీ లైన్ను ఎవరూ అధిగమించరాదని పేర్కొంది.
కమిటీ సమావేశం
జనసేన పార్టీ తరఫున స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు లెక్కకు మిక్కిలిగా నాయకులు, కార్యకర్తలు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో అందరి అభిప్రాయాలు తీసుకునేందుకు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాధ్ నేతృత్వంలో 14 మందితో కూడిన కమిటీని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ కమిటీ సోమవారం తొలిసారి భేటీ అయింది. వివిధ జిల్లాలకు చెందిన నాయకుల అభ్యర్థనలను పరిశీలించింది. మరోవైపు స్థానిక ఎన్నికల్లో 34 శాతం మహిళలకు రిజర్వేషన్ ప్రకటించిన దరిమిలా వీర మహిళ విభాగం నుంచి కూడా భారీగా దరఖాస్తులు వచ్చాయి. వీటిని కూడా వడపోసి.. పార్టీ అధినేత ముందు పెట్టనున్నారు.