జనసేన ఎంపీలకు కీలక బాధ్యత..!
జనసేన పార్టీ ఎంపీలకు ఆ పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. కీలక బాధ్యతలు అప్పగించారు.
జనసేన పార్టీ ఎంపీలకు ఆ పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. కీలక బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రస్థాయిలోనే కాదు.. జాతీయ స్థాయిలోనూ గళం వినిపించాలని తేల్చిచెప్పారు. ఎమ్మెల్యేల తో పోల్చుకుంటే.. ఎంపీలకు గురుతర బాధ్యతలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ముఖ్యంగా జాతీయ వాదాన్ని.. సమగ్రతను, సమైక్యతను చాటి చెప్పేందుకు.. ఎంపీలు కీలక రోల్ పోషించాలని కూడా పవన్ స్పష్టం చేశారు.
గత ఎన్నికల్లో ఏపీలోని మచిలీపట్నం, కాకినాడ నుంచి బాలశౌరి, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్లు జనసేన తరఫున విజయం దక్కించుకున్నారు. ఇక, ఇటీవల రాజ్యసభ ఎంపీగా.. లింగమనేని రమేష్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఇప్పటి వరకు ఇదరు పార్లమెంటు సభ్యులు కేవలం తమ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం అయ్యారు. నియోజకవర్గ సమస్యలను మాత్రమే పట్టించుకున్నారు. ఇక, ఇప్పుడు మూడో ఎంపీ కూడా తోడు కావడంతో వీరి సంఖ్య మూడుకు చేరింది.
ఈ నేపథ్యానికి తోడు.. జాతీయస్థాయిలో జనసేన గళం వినిపించాలని పార్టీ అధినేత నిర్ణయించిన దరిమిలా.. సమైక్యతా వాదాన్ని బలంగా వినిపించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే తన పార్టీ ఎంపీలకు పవన్ కల్యాణ్ .. కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ ముగ్గురు ఎంపీలకు భాషా పరమైన సమస్య లేదు. బాలశౌరి సీనియర్ నేత కావడం, గతంలోనూ ఎంపీగా పనిచేసిన అనుభవం ఉండడం కలిసి వస్తోంది. ఇక, ఉదయ్శ్రీనివాస్ కూడా జాతీయస్థాయిలో వ్యాపార వేత్త కావడంతో ఆయనకు కూడా భాషాపరమైన సమస్య రాకపోవచ్చు.
ఇప్పటి వరకు..
వాస్తవానికి ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలేకాదు.. దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, కేరళ, తమిళనాడు కు చెందిన ఎంపీలు.. జాతీయస్థాయిలో పెద్దగా గళం వినిపించలేదనే చెప్పాలి. ఉత్తరాదివారే.. ఈ విషయంలో ముందున్నారు. ఈ నేపథ్యంలో ఒకరకంగా తొలిసారి.. జనసేన ఎంపీలు జాతీయస్థాయిలో తమ గళం వినిపిస్తే.. ముఖ్యంగా దేశ సమగ్రతకు కృషి చేస్తే.. ఆ ప్రభావం భిన్నంగా ఉంటుందన్న చర్చ సాగుతోంది. పవన్ కల్యాణ్ అప్పగించిన బాధ్యతనువీరు ఎలా నెరవేరుస్తారో చూడాలి.