అమెరికాకు షాక్....రష్యాకి ఇండియా ఓకే !

భారత దేశం ప్రపంచంలో ఎపుడూ తటస్థ విదేశాంగ విధానం అవలంబిస్తూంటుంది. అయితే ఎపుడైనా అమెరికా రష్యా అన్న పోటీ వస్తే రష్యా వైపు ఇండియా మొగ్గు చూపుతుంది.

Update: 2026-05-18 18:02 GMT

భారత దేశం ప్రపంచంలో ఎపుడూ తటస్థ విదేశాంగ విధానం అవలంబిస్తూంటుంది. అయితే ఎపుడైనా అమెరికా రష్యా అన్న పోటీ వస్తే రష్యా వైపు ఇండియా మొగ్గు చూపుతుంది. దానికి చారిత్రకమైన స్నేహ బంధమే అతి ముఖ్య్ కారణం. రష్యా భారత్ చెలిమి కాలలకు అతీతమైనది. పైగా గాఢమైనది అందుకే కష్టకాలంలో రష్యా భారత్ సహకరించుకుంటాయి. గల్ఫ్ యుద్ధం నేపథ్యంలో ముడి చమురుకు భారత్ ఇబ్బంది పడుతోంది. దాంతో గత కొంతకాలంగా రష్యా నుంచి చమురు కొనుగోళ్ళు చేస్తోంది. అమెరికా సైతం ఆంక్షలను సడలించామని చెబుతూ వచ్చింది. ఆ గడువు అయితే తాజాగా పూర్తి అయింది. దాంతో భారత్ కి రష్యా ముడి చమురు ఇక మీదట లభ్యం కాదా. భారత్ వైఖరి ఏమిటి అన్న దాని మీద కేంద్రం పూర్తి స్పష్టత ఇచ్చింది.

రష్యాతోనే అంటూ :

అగ్ర రాజ్యం అమెరికా ఆంక్షలు పెట్టినా లేక అవి లేకపోయినా కూడా రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్ళు చేస్తూనే ఉంటుందని కేంద్రం వివరణ ఇచ్చింది. దేశం ప్రయోజనాలకే ముఖ్యమని కూడా వెల్లడించింది. అంతే కాదు మరో కొత్త విషయం తెలిపింది. అమెరికా ఆంక్షలు అమలులో ఉన్నప్పుడు కూడా రష్యా నుంచి కొనుగోలు చేశామన్న కేంద్రం చెప్పడం విశేషం. దేశీయ ఇంధన అవసరాలు, ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తున్నామని తెలిపింది. దానికి అనుగుణంగానే ముడి చమురు దిగుమతులు ఉంటాయని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ వెల్లడించారు.

భారత్ ఇష్ట ప్రకారం :

ఇక ముడి చమురు ఏ దేశం నుంచి కొనాలనేది పూర్తిగా భారత దేశ వాణిజ్య ప్రయోజనాలపై ఆధారపడి ఉంటుందని కూడా ఆమే తెలిపారు. అయితే ప్రస్తుతం దేశంలో చమురు కొరత లేదని ఆమె చెప్పారు. ఇదిలా ఉంటే రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసేందుకు భారత్ సహా ప్రపంచ దేశాలకు అనుమతిస్తూ అమెరికా గతంలో ఆంక్షలు సడలించిన విషయం తెలిసిందే. కానీ ఆ గడువు మే 17తో ముగిసిన నేపథ్యంలో దేశంలో చమురు కొరతపై మరోసారి ఆందోళనలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ విధంగా స్పందించింది.

తగినన్ని నిల్వలు :

ఇదిలా ఉంటే పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా ముడి చమురు దిగుమతులకు అంతరాయం ఏర్పడినప్పటికీ దేశంలోని రిఫైనరీలు సాధారణంగా పనిచేస్తున్నాయని సుజాతా శర్మ చెప్పారు. దేశంలో తగినంత ముడి చమురు నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పిజి సహజ వాయువుల నిల్వలు తగినంతగా ఉన్నాయని తెలిపారు. మార్చి నుంచి ఏడు లక్షలకు పైగా పిఎన్‌జి కనెక్షన్లకు గ్యాసిఫికేషన్ జరిగిందని అలాగే రెండు లక్షల డెబ్బై ఆరు వేల కనెక్షన్లకు మౌలిక సదుపాయాలు కల్పించబడ్డాయని ఆమె వివరించారు. గత నాలుగు రోజులలో దేశంలో సుమారు కోటి డెబ్బై రెండు లక్షల గృహ వినియోగ ఎల్‌పిజి సిలిండర్లు పంపిణీ చేయబడ్డాయని కూడా చెప్పారు. ఈ నెల ప్రారంభం నుంచి సుమారు లక్షా ఎనిమిది వేల టన్నుల వాణిజ్య ఎల్‌పిజి అమ్ముడైందని ఆమె తెలిపారు. అదే విధంగా గత నాలుగు రోజులలో లక్షా తొంభై వేలకు పైగా అయిదు కేజీల సిలిండర్లు అమ్ముడయ్యాయని తెలిపారు. మొత్తం మీద ఊరటను ఇచ్చే ప్రకటనలు అయితే కేంద్రం నుంచి వచ్చాయి. అదే సమయంలో రష్యా నుంచి ముడి చమురు కొంటామని చెప్పడం కూడా భారతదేశంలో ఇంధన కొరతను తీర్చేదిగా ఉందని అంటున్నారు.

Tags:    

Similar News