యూఏఈలో జాక్‌పాట్: ఒక్క టికెట్‌తో కోటీశ్వరుడైన తమిళ భారతీయుడు!

ఆయనకు దక్కిన బహుమతి విలువ అక్షరాలా రూ.60.42 కోట్లు (25 మిలియన్ దిర్హామ్‌లు). ఈ విజయం శరవణన్‌ను అంతర్జాతీయ స్థాయిలో హాట్‌టాపిక్‌గా మార్చింది.;

Update: 2025-11-04 07:56 GMT

ప్రవాస జీవితంలో కష్టపడుతున్న భారతీయుడికి అదృష్టం పలకరించింది. యూఏఈలో నివసిస్తున్న తమిళనాడుకు చెందిన శరవణన్‌ వెంకటాచలం ‘బిగ్ టికెట్ అబుధాబి 280’ లాటరీలో జాక్‌పాట్ గెలుచుకుని ఒక్కసారిగా కోట్లాధిపతిగా మారిపోయారు. ఆయనకు దక్కిన బహుమతి విలువ అక్షరాలా రూ.60.42 కోట్లు (25 మిలియన్ దిర్హామ్‌లు). ఈ విజయం శరవణన్‌ను అంతర్జాతీయ స్థాయిలో హాట్‌టాపిక్‌గా మార్చింది.

*అదృష్టం పలికిన విధానం

శరవణన్‌ అక్టోబర్‌ 30న ‘463221’ నంబర్‌ టికెట్‌ను కొనుగోలు చేశారు. నవంబర్‌ 3న నిర్వహించిన డ్రాలో అదే నంబర్‌ జాక్‌పాట్‌గా నిలిచింది. ఫలితాలు ప్రకటించిన వెంటనే లాటరీ నిర్వాహకులు శరవణన్‌ను సంప్రదించడానికి ప్రయత్నించగా, ఆయన ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌లో ఉండటంతో మాట్లాడలేకపోయారు. దీంతో నిర్వాహకులు ఈమెయిల్ ద్వారా కూడా సంప్రదించడానికి ప్రయత్నిస్తామని తెలిపారు.

దశాబ్ద కాలంగా యూఏఈలోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న శరవణన్‌, సాధారణ జీవితం గడుపుతున్నారు. ఈ అనూహ్య విజయంపై ఆయన సహచరులు, స్నేహితులు, సోషల్ మీడియాలో అభిమానులు "లక్కున్నోడు బ్రో!" అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

* పన్ను రహిత కోట్లు

‘బిగ్ టికెట్ అబుధాబి’ లాటరీ 1992లో ప్రారంభమై నేడు ప్రపంచంలోనే అత్యధిక బహుమతి విలువ గల నెలవారీ లాటరీగా గుర్తింపు పొందింది. ఒక్క టికెట్‌ ధర 500 దిర్హామ్‌లు (సుమారు రూ.11,400).

ఈ లాటరీలో గెలిచేవారికి ఉన్న పెద్ద ప్రత్యేకత ఏమిటంటే యూఏఈలో లాటరీ బహుమతిపై ఎలాంటి ఆదాయపు పన్ను ఉండదు. అంటే విజేతలు సంపూర్ణ మొత్తాన్ని పొందుతారు. ఇదే భారత్‌లో అయితే, దాదాపు 30% పన్ను, సర్‌చార్జ్‌, సెస్‌ వంటి రూపాల్లో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్ను రహిత మొత్తం శరవణన్‌కు అదనపు ప్రయోజనం.

*యూఏఈలో కొనసాగుతున్న భారతీయుల అదృష్ట పరంపర

ఇటీవలి కాలంలో యూఏఈ లాటరీల్లో భారతీయులు వరుసగా జాక్‌పాట్‌లు కొడుతున్నారు. కొన్ని వారాల క్రితమే ఆంధ్రప్రదేశ్‌కి చెందిన అనిల్‌కుమార్‌ అబుధాబి లాటరీలో ఏకంగా 100 మిలియన్ దిర్హామ్‌లు (రూ.240 కోట్లు) గెలిచి వార్తల్లో నిలిచారు. తన తల్లి పుట్టినరోజు నంబర్‌తో టికెట్‌ కొనుగోలు చేయడం ఆయనకు లక్‌గా మారింది. గెలిచిన మొత్తంలో కొంత భాగాన్ని ఛారిటీకి విరాళంగా ఇస్తానని ఆయన ప్రకటించారు.

*ప్రేరణగా శరవణన్‌ కథ

ప్రవాస జీవితంలో కష్టపడుతున్న కోట్లాది మంది భారతీయులకు శరవణన్‌ కథ ఒక గొప్ప ప్రేరణగా నిలుస్తోంది. కష్టపడి పనిచేస్తూ, కేవలం ఒక చిన్న టికెట్‌తోనే అదృష్టాన్ని పరీక్షించుకున్న ఆయనకు కోట్ల రూపాయల బహుమతి దక్కడం ‘జీవితం ఎప్పుడైనా మారవచ్చు’ అనే నిజాన్ని మరోసారి రుజువు చేసింది.

Tags:    

Similar News