'ఇండియా జన్బంధన్'... ఏంటిది?
జాతీయ స్థాయిలో `ఇండియా జన్బంధన్`పై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కొన్ని ప్రాంతీయ పార్టీల మద్దతుతో ఏర్పాటు చేసిన `ఇండియా బ్లాక్` నేతలు.. సోమవారం ఢిల్లీలో భేటీ అవుతున్నారు.
జాతీయ స్థాయిలో `ఇండియా జన్బంధన్`పై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కొన్ని ప్రాంతీయ పార్టీల మద్దతుతో ఏర్పాటు చేసిన `ఇండియా బ్లాక్` నేతలు.. సోమవారం ఢిల్లీలో భేటీ అవుతున్నారు. అయితే.. సుదీర్ఘ విరా మం తర్వాత.. ఈ భేటీ సాగుతుండడం, ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కీలక పార్టీలు చావు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. మరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో 15 ఏళ్ల ప్రభుత్వాన్ని కోల్పోయిన దరిమిలా.. రెండు మెట్లు దిగివచ్చిన మాజీ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ.. తాజాగా జరుగుతున్న సమావేశానికి ఒక రోజు ముందే ఢిల్లీకి చేరుకున్నారు.
ఏంటి వ్యూహం?
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారును కార్నర్ చేయడమే ఇండియా జన్ బంధన్ సమావేశం ప్రధాన ఉద్దేశం. ఈ సమావేశం ద్వారా.. ప్రధాని మోడీని 2029లో ఎలా గద్దెదించాలన్న విషయంపైనే ఆయా పార్టీలు చర్చించనున్నాయి. అంతేకాదు.. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎలా వ్యవహరించాలన్న విషయంపైనా చర్చిస్తాయి. ఈ క్రమంలో ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో భారీగానే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే.. ఈ సమావేశానికి ఇండియా కూటమి పార్టీల్లో కొన్ని హాజరు కాకపోవడం గమనార్హం. ముఖ్యంగా తమిళనాడు ప్రధాన ప్రతిపక్షం డీఎంకే ఈ సమావేశానికి రావడం లేదని తేల్చి చెప్పింది.
ఇక, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా.. ఇండియా జన్బంధన్ సమావేశానికి.. ఇండి యా కూటమికి కూడా దూరంగా ఉంటున్నామని పేర్కొంది. అయితే.. గత ఏడాది వరకు.. ఇండియా కూటమితో దూరం పాటిం చిన మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో చావుదెబ్బతిన్న నేపథ్యంలో ఇప్పుడు ఇండియా కూటమిని బలోపేతం చేసేందుకు నడుం బిగించడం గమనార్హం. ఆమే స్వయంగా కొన్ని పార్టీల నాయకులకు ఫోన్లు చేసి.. రావాలని కోరుతున్నారు. ఇక, మోడీ బాధితులుగా చెప్పుకొనే కొందరు నాయకులు కూడా ఈ సమావేశానికి వస్తున్నారు.
అసలు పేరేంటి?
ఇండియా జన్ బంధన్- పేరు చిత్రంగా ఉన్నప్పటికీ.. దీనిలో అనేక అంశాలను పేర్కొన్నారు. మోడీ పాలనతో ప్రజలు ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ధరలు పెరిగిపోయిన నేపథ్యంలో తినేందుకు తిండి కూడా దొరకని పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, నిరుద్యోగుల ఆకాంక్షలు కకావికలం అవుతున్నాయని పేర్కొన్నారు. పెట్టుబడి దారుల్లోనూ భయాలు నెలకొన్నాయని.. దీంతో వారు కూడా రావడం లేదని చెబుతున్నారు. ఇక, విదేశాంగ విధానంలో మోడీ సర్కారు పూర్తిగా విఫలమైందని.. తెలిపారు. ఈ క్రమంలో భారత్.. జనాలు దిగ్బంధనంలో కూరుకుపోయారన్న అర్ధం వచ్చేలా ఇండియా జన్బంధన్ అని ఈ సమావేశానికి పేరుపెట్టడం గమనార్హం.