అమెరికాకు సవాల్ విసురుతున్న భారత్, చైనా!
ఆర్థిక వృద్ధి రేటు పరంగా చూస్తే అభివృద్ధి చెందిన దేశాల కంటే భారత్, చైనాలు ఎంతో వేగంగా దూసుకుపోతున్నాయి.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దశాబ్దాలుగా తిరుగులేని ‘పెద్దన్న’గా వెలుగొందుతున్న అమెరికా ఆధిపత్యానికి రాబోయే రోజుల్లో గట్టి బ్రేకులు పడనున్నాయా? డాలర్ బలగం, సాంకేతిక ఆవిష్కరణలు, భారీ పెట్టుబడులతో అంతర్జాతీయ వాణిజ్యాన్ని శాసిస్తున్న యుఎస్ఏకు ఆసియా ఖండం నుంచి సరికొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక ముఖచిత్రంలో వెనుకబడిన దేశాలుగా భావించిన భారత్, చైనాలు.. నేడు గ్లోబల్ ఎకానమీ గమనాన్ని మార్చేసే సూపర్ పవర్స్గా అవతరిస్తున్నాయి.
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్, సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్, గోల్డ్మన్ సాక్స్, పిడబ్ల్యూసి వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థల తాజా నివేదికలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రాబోయే దశాబ్దాల్లో గ్లోబల్ ఎకనామిక్ మ్యాప్ను ఈ రెండు ఆసియా శక్తులే తిరగరాయబోతున్నాయని విశ్లేషకులు బలంగా నమ్ముతున్నారు.
ప్రపంచ వృద్ధిలో సగం వాటా ఈ రెండు దేశాలదే!
తాజా అంచనాల ప్రకారం 2026 నుంచి 2030 మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్తంగా నమోదయ్యే మొత్తం జీడీపీ వృద్ధిలో దాదాపు సగం వాటాను (50%) భారత్, చైనాలు సంయుక్తంగా అందించబోతున్నాయి. రాబోయే ఐదేళ్లలో చైనా తన ఆర్థిక వ్యవస్థకు సుమారు 5.7 ట్రిలియన్ డాలర్ల సరికొత్త జీడీపీని జోడించనుంది. ఇదే కాలంలో భారతదేశం దాదాపు 2.1 ట్రిలియన్ డాలర్ల అదనపు వృద్ధిని నమోదు చేయవచ్చని అంచనా. ఈ స్థాయి భారీ ఆర్థిక విస్తరణను ప్రపంచంలోని మరే ఇతర దేశాలూ అందుకోలేవని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది కేవలం సంఖ్యల వృద్ధి మాత్రమే కాదు.. ప్రపంచ సంపద ఆసియా వైపు మళ్లుతోందనడానికి స్పష్టమైన సంకేతం.
అమెరికాను దాటేస్తున్న వృద్ధి రేట్లు
ఆర్థిక వృద్ధి రేటు పరంగా చూస్తే అభివృద్ధి చెందిన దేశాల కంటే భారత్, చైనాలు ఎంతో వేగంగా దూసుకుపోతున్నాయి. 2026 నాటి అంచనాల ప్రకారం జీడీపీ వృద్ధి రేటు భారత్6.5%, చైనా4.4%, అమెరికా 2.3% గా ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశంలో జరుగుతున్న డిజిటల్ విప్లవం, వేగంగా విస్తరిస్తున్న స్టార్టప్ ఎకోసిస్టమ్, ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్న యువ జనాభా, బలమైన దేశీయ వినియోగ మార్కెట్ మన ఆర్థిక రథాన్ని వేగంగా ముందుకు నడిపిస్తున్నాయి. మరోవైపు చైనా ప్రపంచ తయారీ కేంద్రంగా తన స్థానాన్ని నిలబెట్టుకుంటూనే అధునాతన మౌలిక వసతులు, బలీయమైన సప్లై చైన్ నెట్వర్క్, పరిశోధన-అభివృద్ధి రంగాలలో భారీ పెట్టుబడులతో తన ఆర్థిక ఆధిపత్యాన్ని మరింత పటిష్టం చేసుకుంటోంది.
2050 నాటికి సరికొత్త సమీకరణాలు
దీర్ఘకాలిక ఆర్థిక ప్రాజెక్టులు మరింత ఆసక్తికరమైన నిజాలను వెల్లడిస్తున్నాయి. 2029 నాటికి బ్రిటన్, జర్మనీ వంటి దేశాలను వెనక్కి నెట్టి భారతదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగడం ఖాయమని నివేదికలు చెబుతున్నాయి. 2045 నాటికి సీఈబీఆర్ నివేదిక ప్రకారం అమెరికాను అధిగమించి చైనా ప్రపంచంలోనే నెం.1 ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 2050 నాటికి గోల్డ్మన్ సాక్స్, పీడబ్ల్యూసీ వంటి గ్లోబల్ ఏజెన్సీల అంచనాల ప్రకారం, ప్రపంచంలోనే అత్యున్నత ఆర్థిక శక్తులలో చైనా మొదటి స్థానంలో భారతదేశం రెండు లేదా మూడో స్థానంలో నిలవనున్నాయి. అమెరికా తన అగ్రస్థానాన్ని కోల్పోయి తర్వాతి స్థానాలకు పరిమితం కాక తప్పదని ఈ నివేదికలు హెచ్చరిస్తున్నాయి.
ఆసియా శతాబ్దం దిశగా అడుగులు?
ఈ మార్పులు కేవలం ఆర్థిక రంగానికే పరిమితం కావు. అంతర్జాతీయ రాజకీయాలు, ప్రపంచ వాణిజ్య ఒప్పందాలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం అంతా ఇకపై ఆసియా కేంద్రంగానే సాగనున్నాయి. ఒకవేళ భారత్-చైనా సరిహద్దు విభేదాలు పక్కన పెట్టి ఆర్థికంగా మరింత పరస్పర సహకారాన్ని పెంచుకుంటే ప్రపంచ వేదికపై ఒక తిరుగులేని సరికొత్త ఆర్థిక కూటమి ఏర్పడే అవకాశం ఉంది.
అమెరికా ప్రభావం ప్రపంచం నుండి రాత్రికి రాత్రే పూర్తిగా తుడిచిపెట్టుకుపోనప్పటికీ ఏకధృవ ప్రపంచం అంతమై బహుళ ప్రత్యామ్నాయ కేంద్రాలు ఏర్పడే కాలం చాలా దగ్గరలోనే ఉందనేది జగమెరిగిన సత్యం.