శ్మశానంలో ప్రచారం.. సమాదులను ఓట్లు అడిగిన అభ్యర్థి..

ప్రజాస్వామ్యం అనేది కేవలం ఓటు వేయడమే కాదు; ఓటర్ల జాబితా నుంచి పోలింగ్ బూత్ వరకూ ప్రతి దశలోనూ కచ్చితత్వం, బాధ్యత, పారదర్శకత అవసరం.;

Update: 2026-02-10 07:15 GMT

ప్రజాస్వామ్యం అనేది కేవలం ఓటు వేయడమే కాదు; ఓటర్ల జాబితా నుంచి పోలింగ్ బూత్ వరకూ ప్రతి దశలోనూ కచ్చితత్వం, బాధ్యత, పారదర్శకత అవసరం. కానీ మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో జరిగిన ఘటన ఈ వ్యవస్థలో ఎక్కడో ఒక చోట లోపం ఉందనే సందేహాన్ని ముందుకు తెచ్చింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థులు శ్మశాన వాటికకు వెళ్లి సమాధుల వద్ద నిలబడి ‘ఓట్లు2 అడగడం ఒక వినూత్న నిరసనగా కనిపించినా.. అది వాస్తవానికి వ్యవస్థను పట్టి పీడిస్తున్న ప్రశ్న.

సమాధుల వద్ద ప్రచారం..

ఓటర్ల జాబితాలో చనిపోయిన వారి పేర్లు ఇంకా కొనసాగుతుండడం చిన్న తప్పిదం కాదు. ఇది ప్రజాస్వామ్య నైతికతను దెబ్బతీసే అంశం. జీవించి ఉన్న ఓటరుకు ఓటు హక్కు ఒక రాజ్యాంగ హామీ. కానీ చనిపోయిన వారి పేర్లు జాబితాలో ఉండడం అంటే జీవించే ప్రజాస్వామ్యాన్ని మృతదేహాలపై నిలబెట్టినట్టే. ఇదే విషయాన్ని ఎత్తిచూపేందుకు అభ్యర్థులు శ్మశానానికి వెళ్లి సమాధుల వద్ద ప్రచారం చేయడం నిరసన. కానీ ఆ దృశ్యం మన రాజకీయ వ్యవస్థకు చేదు అద్దం పట్టింది. ఈ ఘటనలో ముఖ్యంగా ప్రశ్నించాల్సింది అధికార యంత్రాంగం పాత్ర. ఓటర్ల జాబితా తయారీ అనేది ప్రతి ఎన్నికకు ముందు అత్యంత ప్రాధాన్యంతో చేపట్టాల్సిన ప్రక్రియ. గ్రామ స్థాయి సర్వేలు, డోర్ టు డోర్ వెరిఫికేషన్, మరణ రికార్డుల సమన్వయం.. ఇవన్నీ కచ్చితంగా జరిగితే ఇలాంటి పరిస్థితి తలెత్తదు. అయితే ‘తప్పుల తడకగా’ జాబితా రూపొందించారంటూ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేయడం వెనుక ఒక వాస్తవం ఉంది. నిర్లక్ష్యం ఎక్కడో ఒకచోట వ్యవస్థలో చొరబడి ఉంది.

ఒక్క చోటే సమస్య కాదు..

ఇది కేవలం కేసముద్రం సమస్య కాదు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా తరచూ ఇలాంటి వార్తలు వినిపిస్తుంటాయి. చనిపోయిన వారి పేర్లు తొలగించకపోవడం, వలస వెళ్లిన వారి పేర్లు అలాగే ఉంచడం, కొత్తగా అర్హత పొందిన యువ ఓటర్ల పేర్లు చేర్చకపోవడం.. ఇవన్నీ ఎన్నికల విశ్వసనీయతపై ప్రభావం చూపుతాయి. ఎన్నికల ఫలితాలు ఎంత కచ్చితంగా వచ్చినా, జాబితా సరిగా లేకపోతే ప్రజల్లో అనుమానం కలగడం సహజం. ఇక్కడ మరో కోణం కూడా ఉంది. రాజకీయ నాయకులు ఈ సమస్యను ఎప్పటి నుంచో తెలుసు. అయితే అది తమకు అనుకూలంగా ఉంటే నిశ్శబ్దం పాటించడం, ప్రతికూలంగా ఉంటే ఆందోళన చేయడం సాధారణ ధోరణి. కానీ ప్రజాస్వామ్యం అనేది తాత్కాలిక లాభాల కోసం వాడుకునే సాధనం కాదు. ఇది సమగ్ర విశ్వాసంపై నిలిచే వ్యవస్థ. ఒకసారి ఆ విశ్వాసం దెబ్బతింటే దాన్ని తిరిగి పొందడం కష్టం.

ఎన్నికల అధికారులు గుణపాఠం నేర్చుకోవాలి..

శ్మశానంలో ప్రచారం ఘటనలో వ్యంగ్యం, ఆవేదన, కోపం కలిసి ఉన్నాయి. హెచ్చరిక కూడా ఉంది. ఓటు హక్కు పవిత్రమైనదైతే, ఓటర్ల జాబితా కూడా పవిత్రంగానే ఉండాలి. చనిపోయిన వారి పేర్లు జాబితాలో ఉండడం అంటే జీవించి ఉన్న ఓటరుని అవమానించడం వంటిదే. ఎందుకంటే ప్రతి తప్పు ఓటు, ప్రతి నకిలీ నమోదు ఒక నిజమైన ఓటును మసకబార్చే ప్రమాదం కలిగిస్తుంది. ఇప్పటికైనా ఎన్నికల అధికార యంత్రాంగం పాఠం నేర్చుకోవాలి. టెక్నాలజీ ఈ యుగంలో పెద్ద సవాలు కాదు. ఆధార్, మరణ నమోదు వ్యవస్థ, మున్సిపల్ రికార్డులు — ఇవన్నీ పరస్పరం అనుసంధానమైతే జాబితాలోని లోపాలు చాలా వరకు తగ్గుతాయి. ప్రజలకూ బాధ్యత ఉంది. తమ పేర్లు సరిగా ఉన్నాయా? కుటుంబ సభ్యుల వివరాలు కచ్చితమా? అనే విషయాలను తనిఖీ చేయాలి.

ప్రజాస్వామ్యం సజీవంగా ఉండాలంటే అది సజీవుల చేతుల్లోనే ఉండాలి. సమాధుల వద్ద నిలబడి ఓట్లు అడగాల్సిన పరిస్థితి వస్తే… అది కేవలం ఒక ప్రాంతీయ సంఘటన కాదు; అది వ్యవస్థకు ఒక గట్టినిలుపు. కేసముద్రం స్మశానంలో మొదలైన ఈ నిరసన ఒక పెద్ద సంభాషణకు దారితీయాలి — ఎన్నికల జాబితాల కచ్చితత్వం, అధికారుల బాధ్యత, ప్రజల అప్రమత్తత గురించి.

ఎందుకంటే ప్రజాస్వామ్యం ఒక పండుగ మాత్రమే కాదు; అది ఒక నిత్యకర్తవ్యం. జీవించి ఉన్న ప్రతి పౌరుడి గౌరవాన్ని కాపాడటం దాని మొదటి అంకం.

Tags:    

Similar News