భద్రాచలం వెళ్తున్నారా.. ఆగండి!
ఔను.. భద్రాచలం రాములోరిని దర్శించుకునేందుకు వెళ్తున్నారా? అయితే.. వెంటనే మీ ప్రయాణాన్ని వాయిదా వేసుకోండి.
ఔను.. భద్రాచలం రాములోరిని దర్శించుకునేందుకు వెళ్తున్నారా? అయితే.. వెంటనే మీ ప్రయాణాన్ని వాయిదా వేసుకోండి. ఎందుకంటే.. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో భద్రాచలం పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. అదేవిధంగా రామయ్య ఆలయం పరిసరాల్లోకి మోకాల్లోతు నీరు చేరింది. దీంతో తలనీలాలు సమర్పించే కల్యాణకట్ట, సహా వసతి భవనాల వరకు కూడా నీరు చేరింది. దీంతో అధికారులు భక్తులను రావద్దని కోరుతున్నారు.
ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇబ్బందులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ మేరకు ఆలయ అధికారులు ప్రకటన చేశారు. మరోవైపు.. గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మరింతగా నీరు పెరుగుతుందని.. పై ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరికి నీటి ప్రవాహం పెరిగిందని.. తెలిపారు. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ వంటి ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి.
జిల్లాల మధ్య రాకపోకలు బంద్!
ములుగు, భద్రాచలం సహా.. పలు జిల్లాల మధ్య రహదారులు కోసుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయా యని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ములుగు జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అలానే.. సాధారణ వ్యాపారాలు బంద్ అయ్యాయి. ఇక, మేడిగడ్డ రిజర్వాయ్ నుంచి 8 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు ప్రవహిస్తోంది. మరోవైపు.. రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న ఛత్తీసగఢ్లోనూ.. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయి.. ఉద్యోగులు, విద్యార్థులు అవస్థలు పడ్డారు.
మరో 24 గంటలు..
ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో మరో 24 గంటల పాటు తెలంగాణకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణవిభాగం అధికారులు తెలిపారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే ఖాళీ చేయించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి.