యుద్ధం ఆగలేదు.. మాపై తప్పుడు ప్రచారం వద్దు: మోడీ
పశ్చిమాసియాలో యుద్ధం ఆగలేదని.. ప్రస్తుతం విరామం మాత్రమే ప్రకటించారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.;
పశ్చిమాసియాలో యుద్ధం ఆగలేదని.. ప్రస్తుతం విరామం మాత్రమే ప్రకటించారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ క్రమంలో ప్రపంచ దేశాలు అనేక ఇబ్బందులు పడుతున్నాయన్నారు. కొన్ని కొన్ని దేశాల్లో చమురు నిల్వలు కూడా తరిగిపోయి.. సబ్సిడీలను ఎత్తేశాయన్నారు. మరికొన్ని దేశాల్లో నిత్యావసర సరుకులకు కొరత ఏర్పడి.. ప్రజలు అల్లాడే పరిస్థితి వచ్చాయని తెలిపారు. కానీ, మన దేశంలో అలాంటి పరిస్థితి రాకుండా.. పెద్ద ఎత్తున కృషి చేస్తున్నామని చెప్పారు.
అయితే.. ప్రజల కోసం తాము ఇంత కష్టపడుతుంటే.. కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ప్రధాని మండిపడ్డారు. ఇది తగదని.. ప్రజలు వీటిని విశ్వసించవద్దని ఆయన తేల్చి చెప్పారు. గత నెల రోజులుగా జరిగిన ఇరాన్ యుద్ధం కారణంగా అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయన్నారు. దీనిలో ఏ దేశానికీ మినహాయింపు లేదని స్పష్టం చేశారు. 140 కోట్ల మంది ప్రజలు ఉన్న భారత్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
ఇటు పార్లమెంటులోనూ సమస్యలపై చర్చిస్తున్నామన్న ప్రధాని.. తాము ఏమీ దాచడం లేదన్నారు. ఏం జరిగినా ప్రజలకు పలు వ్యవస్థల ద్వారా చెబుతున్నామని తెలిపారు. ప్రస్తుతం ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నామన్న ఆయన.. దీనిని సమర్ధవంతంగా ఎదిరించేందుకు అందరూ ఐక్యంగా ముందుకు సాగాల్సి ఉందన్నారు. కానీ.. కొందరు రాజకీయాలే పరమావధిగా వ్యవహరిస్తున్నారని పరోక్షంగా కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు.
తాజాగా ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ప్రధాన మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా దేశంలోనే రెండో అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం తొలి దశ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జేవేరులో నిర్వహించిన సభలో ప్రధాని ప్రసంగించారు. యుద్ధం సహా..ప్రస్తుతం దేశంలో నెలకొన్న అంశాలపై ఆయన ప్రసంగిస్తూ.. ఎల్పీజీ సిలిండర్ల సరఫరా త్వరలోనే సాధారణ స్థితికి చేరుతుందన్నారు. ఇంధన ధరలను అన్ని దేశాలు పెంచాయని.. కానీ, మన దేశంలో పైసా కూడా పెరగకుండా చూస్తున్నామని వ్యాఖ్యానించారు.