పెట్రోల్, డీజిల్ వాహనాలకు ‘ఎండ్ కార్డ్’.. కంపెనీలకు గడ్కరీ వార్నింగ్..
నితిన్ గడ్కరీ ఏదైనా చెబితే అది కేవలం మాటలకే పరిమితం కాదు.. భవిష్యత్తులో రాబోయే పెను మార్పునకు సంకేతం.;
నితిన్ గడ్కరీ ఏదైనా చెబితే అది కేవలం మాటలకే పరిమితం కాదు.. భవిష్యత్తులో రాబోయే పెను మార్పునకు సంకేతం. ఢిల్లీలో జరిగిన ఇండస్ట్రీ ఈవెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆటోమొబైల్ రంగానికి ఒక ‘అల్టిమేటం’ లాంటివి. పెట్రోల్, డీజిల్ వాహనాల శకం ముగిసిపోతోందని ఆయన ఆయా కంపెనీలకు హెచ్చరించారు.
భారత రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తన దార్శనికతతో ఇప్పటికే దేశ వ్యాప్తంగా హైవేల రూపురేఖలను మార్చేశారు. ఇప్పుడు ఆయన దృష్టి వాహనాల ఇంధనంపై పడింది. ‘పెట్రోల్, డీజిల్ వాహనాలకు ఫ్యూచర్ లేదు’ అని ఆయన చెప్పడం వల్ల ఆటోమొబైల్ కంపెనీల్లో కలకలం మొదలైంది. పెట్రోల్ ధరల సెంచరీ, ఇంధన కొరత, పెరుగుతున్న కాలుష్యం మధ్య భారత్ ఒక కొత్త ‘ఇంధన విప్లవం’ దిశగా వెళ్తోందని ఈ వ్యాఖ్యలు చాటిచెబుతున్నాయి.
గడ్కరీ ఎందుకు ఈ వ్యాఖ్యల చేశారు..
గడ్కరీ వ్యాఖ్యలను విశ్లేషిస్తే మూడు ప్రధాన విషయాలు అర్థం చేసుకోవచ్చు. అందులో ఒకటి భారత్ ఏటా లక్షల కోట్ల రూపాయలను ముడి చమురు దిగుమతుల కోసం వెచ్చిస్తోంది. దీనివల్ల మన విదేశీ మారక నిల్వలు హరించుకుపోతున్నాయి. ప్రత్యామ్నాయ ఇంధనాలు వాడడం వల్ల ఈ భారాన్ని తగ్గించుకోవచ్చని కేంద్రం భావిస్తోంది. రెండోది.. ప్రపంచంలోని అత్యంత కలుషిత నగరాల్లో మన దేశానికి చెందినవే ఎక్కువగా ఉంటున్నాయి. ప్రపంచ జనాభాలో భారత్ నెం.1 కాబట్టి ఇక్కడి జనాభా అవసరాలకు తీర్చేందుకు ఎక్కువ మొత్తంలో వాహనాలు ఉపయోగిస్తారు. కాబట్టి పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి వచ్చే కార్బన్ ఉద్గారాలను అరికట్టాలంటే ఎలక్ట్రిక్ లేదంటే లేదా గ్రీన్ హైడ్రోజన్ వాహనాలే ఏకైక మార్గం. ఇక మూడో అంశం ఇంధన కొరత – భవిష్యత్తు సవాళ్లు భూగర్భంలో శిలాజ ఇంధనాలు తరిగిపోతున్న వేళ, రాబోయే తరాలకు ఇంధన భద్రత కల్పించాలంటే పునరుత్పాదక ఇంధనాలే ఆధారం.
ప్రత్యామ్నాయాలు ఏంటి?
గడ్కరీ పెట్రోల్ వద్దు అని ఎంత సీరియస్ గా చెప్తున్నారో.. ప్రత్యామ్నాయాలను అంతగా ప్రోత్సహిస్తున్నారు. బ్యాటరీ టెక్నాలజీ పెరుగుతుండడం, ఛార్జింగ్ స్టేషన్ల నిర్మాణం జరుగుతుండడంతో ఈవీ (ఎలక్ట్రిక్ వెహికిల్స్)లు మొదటి ప్రాధాన్యతగా మారాయి. ఇథనాల్ వంటి బయో ఇంధనాలతో నడిచే ఇంజిన్లను తయారు చేయాలని కంపెనీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. భవిష్యత్తులో భారీ వాహనాలు (బస్సులు, లారీలు) గ్రీన్ హైడ్రోజన్తో నడిచేలా ప్రయోగాలు జరుగుతున్నాయి.
ఆటోమొబైల్ రంగంపై ప్రభావం
గడ్కరీ ప్రకటనతో మారుతి, హ్యుందాయ్, టాటా వంటి దిగ్గజ సంస్థలు తమ ప్లాన్లను మార్చుకోవాల్సి ఉంటుంది. పెట్రోల్ ఇంజిన్లపై పెట్టుబడులు తగ్గించి, ఈవీ ప్లాంట్లపై దృష్టి పెట్టడం ఇప్పుడు ఒక ‘మెకానికల్ నెసెసిటీ’గా మారింది. వినియోగదారులు కూడా కొత్త వాహనం కొనేప్పుడు అది ఎన్ని రోజులు మార్కెట్లో ఉంటుందనే ఆందోళనలో పడ్డారు.
నితిన్ గడ్కరీ చెప్పినట్లుగా, టెక్నాలజీ మారుతున్నప్పుడు మనం మారకపోతే చరిత్రలో కలిసిపోతాం. నోకియా, కొడాక్ వంటి సంస్థలు ఎలాగైతే కనుమరుగయ్యాయో.. ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లని ఆటోమొబైల్ కంపెనీలకు కూడా అదే గతి పడుతుందని పరోక్షంగా హెచ్చరించారు. భారతదేశం ఇకపై ‘ఇంధన దిగుమతిదారు’ నుండి ‘ఇంధన ఎగుమతిదారు’గా మారాలనే లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.