యూట్యూబ్ చూస్తూ డైట్.. చివరికి పైకి పోయాడు

"ఈ డైట్‌ను ప్రారంభించే ముందు శక్తీశ్వరన్ ఎటువంటి వైద్య సలహా తీసుకోలేదు. యూట్యూబ్‌లో చూసిన వీడియోలను గుడ్డిగా నమ్మాడు.;

Update: 2025-07-26 03:00 GMT

సోషల్ మీడియాలో చూసిన ఫ్రూట్ జ్యూస్ డైట్‌ను పాటించి తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాకు చెందిన 25 ఏళ్ల యువకుడు శక్తీశ్వరన్ ప్రాణాలు కోల్పోయాడు. మూడు నెలల పాటు కేవలం పండ్ల రసాలు మాత్రమే తాగి, ఇతర ఆహారం తీసుకోకపోవడంతో ఆరోగ్యం క్షీణించి మరణించాడు. సామాజిక మాధ్యమాల ప్రభావం మరోసారి ఒక యువకుడి ప్రాణాలను బలిగొంది. యూట్యూబ్‌లో చూసిన వీడియోల ప్రభావంతో "డిటాక్స్ డైట్" పేరుతో ఫ్రూట్ జ్యూస్ డైట్‌ను అనుసరించిన శక్తీశ్వరన్ అనే 25 ఏళ్ల యువకుడు గురువారం కన్నుమూశాడు. ఈ విషాద ఘటన తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా, కొలచెల్ పట్టణంలో చోటుచేసుకుంది.

అసలేం జరిగింది?

శక్తీశ్వరన్ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే యువకుడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల యూట్యూబ్‌లో చూసిన ఒక "డిటాక్స్ డైట్" వీడియో అతడిని బాగా ప్రభావితం చేసింది. ఆ వీడియోలోని సలహాలను నమ్మి, రోజూ కేవలం పండ్ల రసాలు మాత్రమే తాగడం ప్రారంభించాడు. దాదాపు రెండు నుంచి మూడు నెలల పాటు సాధారణ భోజనం పూర్తిగా మానేసి, ఈ ఫలరసం డైట్‌ను పాటించాడు. క్రమంగా శక్తీశ్వరన్ శరీరం బలహీనపడింది. తీవ్రమైన అలసట, అస్వస్థతకు గురయ్యాడు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నప్పటికీ, అప్పటికే తీవ్రంగా నీరసించి ఉన్న శక్తీశ్వరన్ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచాడు.

-వైద్య నిపుణుల హెచ్చరిక

ఈ ఘటనపై స్పందించిన వైద్య నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. "ఈ రకమైన మోనో డైట్స్ కేవలం ఒకరకమైన ఆహారపదార్థం తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, మినరల్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ వంటి ముఖ్యమైన పోషకాలను అందించలేవు. వీటిని దీర్ఘకాలం పాటు పాటిస్తే శరీరంలో తీవ్రమైన పోషకాహార లోపం ఏర్పడి, ప్రాణాంతక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి" అని హెచ్చరించారు.

కుటుంబ సభ్యుల వేదన

"ఈ డైట్‌ను ప్రారంభించే ముందు శక్తీశ్వరన్ ఎటువంటి వైద్య సలహా తీసుకోలేదు. యూట్యూబ్‌లో చూసిన వీడియోలను గుడ్డిగా నమ్మాడు. మేము ఎంత చెప్పినా వినలేదు. ఇప్పుడు మా కళ్ల ముందే మా బిడ్డను కోల్పోయాం" అంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

ఈ విషాద ఘటన సమాజానికి ఒక గంభీర హెచ్చరిక. సోషల్ మీడియా ద్వారా అందుతున్న ఆరోగ్య సలహాలు అన్నీ నమ్మదగినవి కావు, అందరికీ అనుకూలమైనవి కావు. ప్రతి మనిషి శరీరం భిన్నంగా స్పందిస్తుంది. వైద్య నిపుణుల సలహా లేకుండా ఎలాంటి డైట్‌ను కూడా ప్రారంభించకూడదని ఈ ఘటన మరొక్కసారి గుర్తుచేస్తోంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ముఖ్యం, కానీ సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండాలి. మితమైన, సమతుల్య ఆహారం, సరైన వ్యాయామం, వైద్యుల పర్యవేక్షణతో మాత్రమే ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. లేకపోతే, శక్తీశ్వరాన్ వంటి విషాద గాథలు మరిన్ని వినాల్సి వస్తుంది.

Tags:    

Similar News