'ఎగ్జిట్ పోల్' పై ఎన్నికల సంఘం ఆంక్షలు
ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఎగ్జిట్ పోల్స్పై నిషేధం విధించడంతోపాటు.. తాజాగా మరికొన్ని ఆంక్షలు కూడా విధించింది.;
దేశంలో జరుగుతున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఆంక్షలు విధించింది. వాస్తవానికి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో.. ఇప్పటికే ఈ నెల 9న మూడు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. అస్సాం, కేరళం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. దీంతో అక్కడి ప్రజల తీర్పు ఎలా ఉంది? వారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారన్నది రాజకీయంగా ఆసక్తి నెలకొన్న అంశం.
దీంతో పలు మీడియా సంస్థలు సహా.. సర్వే సంస్థలు కూడా ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాయి. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం.. వాటిని విడుదల చేయడానికి, ప్రసారం చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. అంతే కాదు.. కనీసం వాటిలోని అంశాలను కూడా లీక్ చేయవద్దని తేల్చి చెప్పింది. వాస్తవానికి ఇలా మల్టీ స్టేట్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు.. ఈ నిషేధం ఎలానూ ఉంటుంది. కానీ.. తాజాగా కొన్ని విషయాలు వెలుగు చూడడంతో ఎన్నికల సంఘం రాత్రికి రాత్రి అలెర్ట్ అయింది.
ఐదు రాష్ట్రాల్లోనూ జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు సహా.. ఇతర చిన్నాచితకా పార్టీలుకూడా పోటీ చేస్తున్నాయి. ఇక, ప్రాంతీయ పార్టీలైన కొన్ని కూడా తమ సమీప రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నాయి. దీంతో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు, ప్రజలు, పార్టీలు కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉందని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఎగ్జిట్ పోల్స్పై నిషేధం విధించడంతోపాటు.. తాజాగా మరికొన్ని ఆంక్షలు కూడా విధించింది.
ఇవీ ఆంక్షలు..
+ ఎట్టి పరిస్థితిలోనూ ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించిన విషయాలపై లీకులు ఇవ్వరాదు.
+ మీడియా సహా సర్వే సంస్థలు వ్యాసారాలు రాయడం.. ఫలితం తెలిసేలా కామెంట్లు చేయడం కుదరదు.
+ సర్వే ఫలితాలను.. ఈ నెల 29 సాయంత్రం 6 గంటల వరకు వెల్లడించరాదు.
+ ఏ సంస్థయినా.. సర్వే ఫలితాలు వెల్లడిస్తే.. వాటిని నిషేధ జాబితాలో పెడతారు.
+ మీడియా సంస్థల అక్రిడేషన్ను రద్దు చేస్తారు.