'బండి' వ్యవహారంపై ఢిల్లీ ఆరా.. విషయం సీరియస్సేనా?
నిజానికి ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి కాబట్టి సరిపోయిందని.. లేకపోతే.. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఈ వ్యవహారమే బీజేపీని ఇరుకున పెట్టి ఉండేదన్న చర్చ కూడా జరిగింది.
తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కు పెద్ద తిప్పలే ఎదుర వుతున్నాయా? పుత్రుడి కారణంగా ఆయన సంపాయించుకున్న పేరు, పరపతి ఇబ్బందుల్లో పడిపోయిందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. బండి కుమారుడు భగీరథ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాంటూ.. బాలిక వాంగ్మూలం ఇవ్వడం... దీనిపై కేసు నమోదు కావడం తెలిసిందే. అయితే.. వాస్తవానికి నాలుగు రోజులుగా ఈ వ్యవహారం నలుగుతున్నా.. అనూహ్యంగా ఇప్పుడు ఢిల్లీ వరకు పాకింది.
జాతీయ మీడియాలో ''కేంద్ర సహాయ మంత్రి బండి కుమారుడిపై పోక్సో కేసు నమోదైంది'' అంటూ.. మంగళవారం సాయంత్రం హోరెత్తి పోయింది. అంతేకాదు.. దీనికి కర్ణాటకలోని మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు.. మాజీ ఎంపీ..ప్రజ్వల్ రేవణ్ణ ఉదంతాన్ని కూడా జతకలిపి మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు, వివరణలు, వార్తలు ప్రసారం చేశారు. ఈ పరిణామం జరుగుతున్న క్రమంలోనే కేంద్ర మహిళా కమిషన్ తోపాటు.. కేంద్ర హోం శాఖ(దీనిలోనే బండి సంజయ్ సహాయ మంత్రిగా ఉన్నారు) ఆరా తీసినట్టు కూడా మీడియా వెల్లడించింది.
నిజానికి ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి కాబట్టి సరిపోయిందని.. లేకపోతే.. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఈ వ్యవహారమే బీజేపీని ఇరుకున పెట్టి ఉండేదన్న చర్చ కూడా జరిగింది. ఇదిలావుంటే.. అసలు ఏం జరిగిందన్న విషయంపై కేంద్ర హోం శాఖ వర్గాలు కూడా ఆరా తీశాయి. దీనిపై తెలంగాణ డీజీపీని నివేదిక కోరే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు.. కేంద్ర మంత్రి బండి నుంచి కూడా వివరణ తీసుకుంటారన్న చర్చ జరిగింది. ఎలా చూసుకున్నా.. బండి కుమారుడి వ్యవహారం ఢిల్లీ వరకు చేరడం గమనార్హం.
అయితే.. ఈ విషయంలో తన కుమారుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని బండి సంజయ్ చెబుతున్నారు. దీనిని తొలుత రాజకీయ కుట్రగా ఆయన పేర్కొన్నా.. తరువాత తప్పు చేసి ఉంటే.. తన కుమారుడైనా శిక్షకు అర్హుడే అన్నారు.
సో.. దీంతో వ్యవహారం.. ముదురుతున్న సంకేతాలు వస్తున్నాయి. మరో వైపు.. భగీరథ్ కనిపించకుండా తప్పించుకోవడం.. ఫోన్ స్విచ్ఛాప్ చేసుకున్న దరిమిలా.. మరింతగా అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పుడు కేంద్రం కూడా జోక్యం చేసుకుంటే.. పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందని అంటున్నారు. మరి ఏంజరుగుతుందో చూడాలి.