చెప్పిన మాటలే ఎన్నిసార్లు చెబుతారు చంద్రబాబు?

అవే మాటలు. చెప్పినవే చెప్పటం. వినేవారికి విసుగు రావటమే తప్పించి.. చెప్పిన మాటల్నే చెప్పే చంద్రబాబుకు మాత్రం అలిసిపోరు.;

Update: 2025-06-17 06:30 GMT
చెప్పిన మాటలే ఎన్నిసార్లు చెబుతారు చంద్రబాబు?

అవే మాటలు. చెప్పినవే చెప్పటం. వినేవారికి విసుగు రావటమే తప్పించి.. చెప్పిన మాటల్నే చెప్పే చంద్రబాబుకు మాత్రం అలిసిపోరు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులో ఇద్దరు మనుషులు ఉంటారు. ఒకరు ప్రభుత్వాధినేతగా.. మరొకరు పార్టీ అధినేతగా వ్యవహరిస్తారు. సచివాలయంలో ఉన్నప్పుడు.. ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొనే వేళలో తానో పార్టీ అధినేత అన్న విషయాన్ని మర్చిపోతారు. కింది స్థాయి నేతలు..వారికి ఉండే ఈతి బాధలు.. కార్యక్తలు.. వారి అవసరాలు.. వారి కష్టాలు లాంటివి పెద్దగా పట్టించుకోరు.

అదే చంద్రబాబు పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నంతనే ఆయనలో రెండో మనిషి నిద్ర లేస్తారు. పార్టీ నేతల సందోహాన్ని చూసినంతనే ఆయన విపరీతమైన భావోద్వేగానికి గురవుతారు. తానేం చేయాలని భావిస్తున్నానో చెప్పటం మొదలు పెడతారు. వరాల చిట్టా విప్పుతారు. పార్టీ సమావేశం నుంచి బయటకు రాగానే.. మొదటి మనిషి బయటకు వస్తారు. ఇలాంటి తీరు మొదటిసారి కాదు.. చివరిది కూడా కాదు. తాజా విశాఖలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యల్ని చూస్తే..

‘‘టీడీపీలో కార్యకర్తే అధినేత. అందుకే ఇక నుంచి సగం రోజు ప్రభుత్వం. సగం రోజు ప్రజల కోసం. సగం రోజు కార్యకర్తల కోసం పని చేస్తాను. కార్యకర్తలకు నాయకులు అండగా ఉండాలి. లేకుంటే తెలియజేసేలా ఒక కార్యక్రమం అమలు చేస్తాం. కార్యకర్తలను ఆర్థికంగా పైకి తీసుకురావటానికి చర్యలు తీసుకుంటాం. పార్టీ పదవులు ఇస్తుననాం. కార్యకర్తలు మీరు పవర్ ఫుల్. మీరు రోడ్డుపైకి వస్తే ఎవ్వరూ నిలబడలేరు. మనం అందరం కచ్ఛిత ప్రణాళిక చేసుకుంటే వేరే వాళ్లు ఏమీ చేయలేరు’’ అని వ్యాఖ్యానించారు.

నిజానికి దీనికి మించి ఆయన మరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఈ తరహా మాటలు చంద్రబాబు నోటి నుంచి గతంలో వచ్చినవి కావు.కొత్త తరహాలో మాట్లాడిన ఆయన మాటల్ని చదవాల్సిందే. ‘అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని బాగు చేయాలని నేను రాత్రింబవళ్లు పట్టుదలతో పని చేస్తున్నప్పుడు మీరు అలుగుతారు. అప్పుడు కాడి కింద పడేస్తారు. మీరు ఎక్కడికీ పోరు. ఏ జెండా పట్టుకోరు. ఎవరికీ ఓటేయ్యరు. కానీ.. అలకబూనుతారు. అదే ప్రమాదం. ఇకపై మీరు భవిష్యత్తులో అలిగే పరిస్థితి.. మనం ఓడే పరిస్థితి రానివ్వను. కార్యకర్తల కోసం టైం కేటాయించినప్పుడు తెలియని శక్తి వస్తుంది. ప్రాణం పోతున్నా జై టీడీపీ అన్న చంద్రయ్య అనే కార్యకర్తను మర్చిపోను’ అని వ్యాఖ్యానించారు.

ఇన్ని మాటలు చెప్పిన చంద్రబాబు.. తాజాగా అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది వ్యవధిలో కార్యకర్తలకు ఏం చేశారు? ఎంత సమయాన్ని కేటాయించారు? పార్టీకోసం మరేం చేశారు? లాంటి ప్రశ్నలు వేసుకుంటే ఎలాంటి సమాధానం లభించదు. నిజానికి విశాఖపట్నంలో తాజాగా నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముందు కూడా గతంలో ఈ తరహా మాటలే చెప్పారు. కాకుంటే.. ఇప్పటి మాదిరి మాత్రం చెప్పలేదనే చెప్పాలి.

మొన్నటికి మొన్న ముగిసిన మహానాడులోనూ కార్యకర్తలకు పెద్దపీట వేస్తానని చెప్పటం తెలిసిందే. పార్టీ పదవులు.. నామినేటెడ్ పదవుల విషయానికే వద్దాం. పెండింలో చాలానే ఉన్నాయి. అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. ఇలాంటప్పుడు మరింత వేగంగానిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. అందుకు భిన్నంగా.. ఎప్పటికప్పుడు.. పార్టీకి కార్యకర్తలకు పెద్దపీట వేస్తానంటూ మాటలు చెప్పటమే తప్పించి చేతల్లో చూపించని తీరుతో ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయాన్ని చంద్రబాబు గుర్తిస్తే మంచిది. కార్యకర్తల కోసం ఏదేదో చేస్తానంటూ చెప్పే ఆయన మాటలు విని.. విని బోర్ కొట్టేసిన పరిస్థితి. ఇప్పటికైనా మాటలు మానేసి.. చేతల్లో చేసి చూపిస్తే బాగుంటుందన్నది మర్చిపోకూడదు. అలా చంద్రబాబు ఎప్పుడు చేస్తారో?

Tags:    

Similar News