మంత్రి వర్గ విస్తరణ.. చంద్రబాబు ఏమన్నారంటే!
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణ వ్యవహారంపై కొన్ని రోజులుగా చర్చ సాగుతోంది.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణ వ్యవహారంపై కొన్ని రోజులుగా చర్చ సాగుతోంది. ఆశావహులు పెద్ద ఎత్తున పార్టీకార్యాలయానికి వస్తు న్నారు. తమ ప్రొఫైల్ను.. క్షేత్రస్థాయిలో తాము చేపడుతున్న కార్యక్రమాలను కూడా వివరిస్తున్నారు. మంత్రులుగా తమకు ఎందుకు చాన్స్ ఇవ్వాలో కూడావారు చెబుతున్నారు. పార్టీకి, ప్రభుత్వం తరఫున ప్రజలకు తాము చేస్తున్న సేవలను వివరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా మంత్రి వర్గంలో చోటును ఆశిస్తున్న నాయకుల సందడితో .. పార్టీ కార్యాలయం సహా.. నారా లోకేష్ కార్యాలయం కూడా కిటకిటలాడుతోంది. అయితే.. ఎవరూ బయటకు మాత్రం చెప్పడం లేదు. నియోజకవర్గం పనులపై వచ్చామని.. అంతే తప్ప ఇంకేమీ లేదని చెబుతున్నారు. కానీ, అత్యంత కీలక నాయకులకు మాత్రం అసలు విషయాన్ని చేరవేస్తున్నారు.
మొత్తంగా ఈ వ్యవహారం రాజకీయ చర్చకు దారితీసింది. ఈ విషయంపై తాజాగా చంద్రబాబు స్పందించా రు. మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ఎవరు చెప్పారని ప్రశ్నించడంతోపాటు.. పదవులు కావాలని అను కున్నవారు పార్టీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. మంత్రులుగా తీసుకోవాలని అనుకుంటే.. తామే ఎంపిక చేసి పిలుస్తామని కూడా తేల్చి చెప్పారు. ప్రజల మధ్య ఉండే వారికి మాత్రమే పదవులు కోరుకోకపోయినా.. లభిస్తాయని ఆయన చెప్పారు.
అంతేకాదు.. పార్టీ కార్యాలయానికి వచ్చేవారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని కూడా పార్టీ ఏపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావుకు తేల్చి చెప్పినట్టు తెలిసింది. కాగా.. మంత్రి వర్గ విస్తరణపై కొన్నాళ్లుగా చర్చ నడుస్తోంది. కొందరు మంత్రుల గ్రాఫ్ బాగోలేదని చంద్రబాబు ప్రకటించిన ప్రతిసారీ.. ఈ విషయంపై ఆశలు ఉన్న వారు.. పార్టీ కార్యాలయాలకు వస్తున్నారు. కానీ, ఇది సరికాదని, తామే ఎంపిక చేస్తామని.. అయినా.. ఇప్పట్లో మంత్రి వర్గాన్ని మార్చే ఉద్దేశం కూడా లేదని అంటున్నారు.