షాకింగ్‌ : ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్నారుల లైంగిక వేధింపుల కంటెంట్‌

సాధారణంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పెయిడ్‌ యాడ్‌ పోస్ట్‌ కావాలంటే చాలా గైడ్‌ లైన్స్‌ను దాటుకుని రావాల్సి ఉంటుంది.

Update: 2026-07-04 07:02 GMT

ఇండియాలో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్ కంటెంట్‌ విషయంలో స్వీయ నియంత్రణ పాటించడం లేదు. ప్రభుత్వ విధి విధానాలకు అనుగుణంగా కూడా వ్యవహరించడం లేదు. సోషల్‌ మీడియాలో కొందరు చైల్డ్‌ అబ్యూజ్‌ వీడియోలు షేర్‌ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. వాటిని కొన్ని సార్లు వెంటనే తొలగించడం, కొన్ని సార్లు లేట్‌గా తొలగించడం జరుగుతుంది. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో పెయిడ్‌ యాడ్స్ ద్వారా చైల్డ్‌ అబ్యూజ్ కంటెంట్‌ షేర్ కావడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. సాధారణ యూజర్లు షేర్ చేసే కంటెంట్‌ విషయంలో ఇన్‌స్టాగ్రామ్‌కు సంబంధం ఉండక పోవచ్చు. కానీ ఆ వీడియో కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా లేకుంటే తొలగించే అవకాశం ఉంటుంది. కానీ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌ డబ్బులు తీసుకుని యాడ్స్‌ రూపంలో ఆ కంటెంట్‌ను షేర్‌ చేయడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ ఇప్పుడు ప్రశ్న.

ఇన్‌స్టాగ్రామ్‌లో అశ్లీల కంటెంట్‌...

ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీఐ కథనం ప్రకారం ఇన్‌స్టాగ్రామ్‌లో అశ్లీల కంటెంట్‌ను ప్రోత్సహిస్తూ యాడ్స్‌ ప్లే అయ్యాయి. ఆ వీడియోలో చిన్నారుల వీడియోలు ఉండటం గమనార్హం. ఏకంగా చైల్డ్‌ సెక్సువల్‌ అబ్యూజ్‌ కీ వర్డ్స్‌ తో ఆ యాడ్‌ ప్లే అయ్యింది. మీరు పిల్లలకు సంబంధించిన వీడియోలు చూడాలి అంటే ఈ లింక్‌ లో చూడవచ్చు అంటూ టెలిగ్రామ్ లింక్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ ఇవ్వడం జరిగింది. దీంతో చైల్డ్‌ అబ్యూజ్ కంటెంట్‌ను ఇన్‌స్టాగ్రామ్ నేరుగా సపోర్ట్‌ చేస్తుందని, ప్రమోట్‌ చేస్తుందని, డబ్బులు చెల్లించి ఆ వీడియో చూడమని తమ యూజర్లకు చెబుతుంది అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ పై విమర్శలు వస్తున్నాయి. ఈ విషయాన్ని బీబీసీ ప్రతినిధులు మెటా ఇండియా ప్రతినిధులను ప్రశ్నించిన సమయంలో సరైన సమాధానం రాలేదు. బీబీసీ ఈ విషయమై ఇచ్చిన కథనం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌...

ఇప్పటికే బీబీసీ కథనంకు స్పందించిన కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ మెటాకు సమన్లు జారీ చేయడం జరిగింది. చైల్డ్‌ అబ్యూజ్‌ యాడ్స్‌కు ఎలా అనుమతి ఇచ్చారు అనే విషయంపై వివరణ ఇవ్వాలంటూ మెటా అధికారులకు అశ్విని వైష్ణవ్‌ సమన్లు ఇచ్చాడు. అయితే మెటా ఇండియా ఇప్పటి వరకు ఈ విషయమై స్పందించేందుకు ఆసక్తి చూపించలేదు. అయితే ప్రభుత్వం ఇచ్చిన సమన్లకు మాత్రం మెటా నుంచి త్వరలోనే సమాధానం వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి తప్పిదాలు జరుగుతూ ఉంటాయని, మళ్ళీ ఇలాంటి తప్పిదాలు జరగకుండా తమ సిస్టంలో మార్పులు చేస్తామని మెటా ప్రభుత్వంకు ఇచ్చే సమాధానంలో ఉండవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. కానీ ఇప్పటి వరకు జరిగిన తప్పిదం విషయంలో మెటా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఎలాంటి శిక్ష అనుభవిస్తుందని కొందరు ప్రశ్నిస్తున్నారు.

మెటాకు సమన్లు జారీ...

సాధారణంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పెయిడ్‌ యాడ్‌ పోస్ట్‌ కావాలంటే చాలా గైడ్‌ లైన్స్‌ను దాటుకుని రావాల్సి ఉంటుంది. అన్ని గైడ్‌ లైన్స్ దాటే సమయంలో చైల్డ్‌ అబ్యూజ్‌ కంటెంట్‌కి సంబంధించిన యాడ్‌ అని దాన్ని గుర్తించడంలో ఎలా విఫలం అయ్యారని బిబిసీ ప్రతినిధులు ప్రశ్నించారు. అందుకు మెటా ప్రతినిధుల నుంచి సమాధానం లేదు. మాడరేషన్‌ టెక్నాలజీ ఆమోదం పొందిన తర్వాత మాత్రమే ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ యాడ్‌ అయినా పడుతుంది. అలాంటిది అంత సులువుగా యాడ్‌ ఎలా వచ్చిందని ప్రశ్నించిన సమయంలో మొదట ఆ యాడ్‌ తమ గైడ్‌ లైన్స్‌కి అనుగుణంగానే ఉందని కంపెనీ ప్రతినిధులు చెప్పినట్లు బీబీసీ తమ కథనంలో పేర్కొంది. అయితే ప్రభుత్వం తీవ్రంగా స్పందించడంతో అప్పుడు యాడ్‌ ను తొలగించి వివరణ ఇచ్చిందని, టెలిగ్రామ్‌లోనూ ఇలాంటి వీడియోలు ఉండటంపై కేంద్ర ఐటీ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.

టెలిగ్రామ్‌ వివరణ ఇస్తూ అలాంటి కంటెంట్‌ను షేర్‌ చేసే వారి అకౌంట్స్‌ను బ్లాక్‌ చేస్తున్నామని, ఇప్పటి వరకు 2.75 లక్షల గ్రూప్స్‌, యూజర్స్‌ను తొలగించినట్లుగా టెలిగ్రామ్‌ ప్రతినిధులు తెలియజేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ముందు ముందు ఇలాంటి కంటెంట్‌ యాడ్స్ రాకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సామాన్యులు అంటున్నారు.

Tags:    

Similar News