అసెంబ్లీలో జగన్ & కో సినిమా... వైసీపీ అధినేత పరువు తీసేసిన సీఎం చంద్రబాబు
పోలవరం ఎడమ కాలువ పనుల్ని రూ. 960 కోట్లతో చేపడుతున్నాం. దీనిని పూర్తి చేసి ఉత్తరాంధ్రకు నీళ్లిస్తాం. రూ.894 కోట్ల నిధులు నిర్వాసితులకు నిధులు ఇచ్చాం.;
అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు విశ్వరూపం ప్రదర్శించారు. సమగ్ర సాగునీటి వినియోగంపై శాసనసభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. గత ఐదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం, క్రిష్ణా-గోదావరి నదులను అనుసంధానం చేసిన పట్టిసీమతోపాటు ఇతర ప్రాజెక్టులపై అప్పటి ముఖ్యమంత్రి జగన్, సాగునీటి శాఖ మంత్రులు మాట్లాడిన వీడియోలను ప్రదర్శించారు. జగన్ అండ్ కో సినిమాను చూపిన చంద్రబాబు తన ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రాజెక్టులను వివరించారు.
గత ప్రభుత్వంలో పట్టిసీమను వినియోగించుకోకుండా రైతుల పొట్టకొట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. పోలవరం పనులను నిర్లక్ష్యం చేసి రైతులకు తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వంలో సమర్థ నీటి నిర్వహణతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం చేసిన క్రుషి సీఎం అసెంబ్లీలో వివరించారు. భవిష్యత్తులో ఏమేం చేయబోతున్నామనేది స్పష్టం చేశారు. ఇరిగేషన్ రంగంపై సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వం ఇరిగేషన్ రంగంపై ఆడిన డ్రామాలపై రూపొందించిన వీడియోను సభలో ప్రదర్శించారు.
నిండుగా భూగర్భజలాలు
రాష్ట్రంలో 1.06 కోట్ల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నామని వెల్లడించారు. కూటమి అధికారంలోకి వచ్చాక రూ. 12 వేల కోట్లు ఖర్చు పెట్టామని వివరించారు. ఐదేళ్లలో రూ. 60 వేల కోట్లను ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు. ఈ ఏడాది కురిసిన వర్షాల వల్ల 94 శాతం రిజర్వాయర్ల నీళ్లు నింపారని జలవనరుల శాఖ అధికారులను అభినందించారు. ప్రాజెక్టులలో 1040 టీఎంసీల నీళ్లు ప్రస్తుతం నిల్వ ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో భూగర్భ జలాలను కూడా పెంచడానికి చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ సారి 2.1 శాతం వర్షపాతం తక్కువగా పడినా నీటి నిర్వహణ వల్ల గతంతో పోలిస్తే 1.5 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయని సీఎం తెలిపారు. ప్రస్తుతం 8.43 మీటర్ల మేర భూగర్భజలాలు ఉన్నాయని, భూగర్భంలో 697 టీఎంసీల నీరు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఏపీని కరవు రహిత రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత కూటమి తీసుకుంటుంది.” అని సీఎం చెప్పారు.
పట్టిసీమ వద్దన్నారు... పోలవరాన్ని నాశనం చేశారు
“రాష్ట్ర విభజన తర్వాత పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. జూన్ 2 తేదీ కంటే ముందే 7 ముంపు మండలాలను కలపాలని ప్రధానిని కోరాను. పార్లమెంటు సమావేశాని కంటే ముందు ముంపు మండలాలు కలుపుతూ ఆర్డినెన్సును తెచ్చాం. ఆ నిర్ణయంతోనే పోలవరం ప్రాజెక్టు ముందుకు వెళ్లింది. భూసేకరణ, కాంట్రాక్టుల వివాదాలు, కుడి కాలువ లాంటి సమస్యలను దాటుకుని 2019 నాటికి 72 శాతం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేశాం. స్పెల్ వే, స్పిల్ ఛానల్, గేట్లు, కాఫర్ డ్యామ్ పనులు, కుడి కాలువ పనులు వంద శాతం పూర్తి చేశాం. గతంలో రూ.400 కోట్లతో డయాఫ్రం వాల్ నిర్మించాం. గత పాలకుల అసమర్థత వల్ల డయాఫ్రం వాల్ కొట్టుకు పోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక... మళ్లీ రూ. 1000 కోట్లతో కొత్తగా మళ్లీ నిర్మిస్తున్నాం. 2025 డిసెంబరు నాటికి డయాఫ్రం వాల్ పూర్తి చేస్తాం’’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ఉత్తరాంధ్రకు నీళ్లిస్తాం..
పోలవరం ఎడమ కాలువ పనుల్ని రూ. 960 కోట్లతో చేపడుతున్నాం. దీనిని పూర్తి చేసి ఉత్తరాంధ్రకు నీళ్లిస్తాం. రూ.894 కోట్ల నిధులు నిర్వాసితులకు నిధులు ఇచ్చాం. 2019-24 మధ్య పోలవరం ప్రాజెక్టులో చేసిన పనులు 3.84 శాతం మాత్రమే. 2021కి పూర్తి కావాల్సిన ప్రాజెక్టును 7 ఏళ్లు వెనక్కు నెట్టారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లింది మనమే. ఐదేళ్ల పాటు పోలవరం పనులను పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టును జాతికి అంకితం చేసే అవకాశం ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కింది. 2027 డిసెంబరు నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లిస్తాం. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా 439 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తరలించాం. పొదుపు చేసిన నీటిని శ్రీశైలం నుంచి రాయలసీమ ప్రాంతానికి తరలించి నీరిచ్చాం. గత ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతలను వినియోగించలేదు. ప్రజాధనంతో కట్టిన పట్టిసీమను వాడకుండా వదిలేశారు. టీడీపీ ప్రభుత్వంలో పట్టిసీమ కట్టారని... దాని తాము వాడడం ఏంటనే అహంభావంతో ఆ ప్రాజెక్టును పక్కన పెట్టారని సీఎం ఆరోపింారు. రెండేళ్ల పాటు అసలు నీటిని తరలించలేదు. మూడో ఏడాది కరువు వస్తే.. ఇంకా నీటిని విడుదల చేయకుంటే తంతారని పట్టిసీమ ప్రాజెక్టును వినియోగించారు. భేషజంతో ప్రభుత్వ ఆస్తులను వినియోగించకుండా ప్రజలను, రైతులను నష్టపరిచే ప్రయత్నం చేశారు. టీడీపీకి పేరు వస్తుందనే పట్టిసీమను ఐదేళ్లలో వినియోగించలేదు. ప్రజావేదికను కూల్చి విధ్వంసంతో మొదలుపెట్టి విధ్వంసంతోనే ఓడిపోయారు.” అని చంద్రబాబు వివరించారు.