దేశంలో 'త్రిభాషా విద్య'.. విజయ్ నెత్తిన పిడుగు!
దేశంలో త్రిభాషా సూత్రం అమలు చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.
దేశంలో త్రిభాషా సూత్రం అమలు చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి గాను పాఠశాలలను వేదిక గా చేసుకున్న దరిమిలా.. తమిళనాడులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చెలరేగాయి. ముఖ్యంగా హిందీని తమపై రుద్దుతున్నారంటూ. అప్పటి సీఎం స్టాలిన్ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా.. దేశవ్యాప్తంగా కూడా హిందీకి వ్యతిరేకంగా ఉద్యమించారు. ఆ సమయంలో కేంద్రంతోనూ ఆయన సంప్రదింపులు జరిపారు. ఫలితంగా కొన్నాళ్ల పాటు ఈవ్యవహారం ఆగిపోయింది. ఇంతలో ఎన్నికలు రావడంతో పూర్తిగా త్రిభాషా విధానం పక్కన పెట్టారని అందరూ అనుకున్నారు.
కానీ, ఎన్నికలు ముగిసిన దరిమిలా.. తాజాగా కేంద్ర విద్యాశాఖ పరిధిలోని సీబీఎస్ ఈ బోర్డు.. తాజాగా త్రిభాషా విధానంపై సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం.. సీబీఎస్ ఈ త్రిభాషా సూత్రాన్ని పాఠశాలలకు వర్తింప చేసింది. ఈ ఏడాది నుంచే అన్ని సీబీఎస్ ఈ పాఠశాలలు, అనుబంధ పాఠశాలలకు కూడా ఈ సూత్రం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఈ ఏడాది నుంచే 9, 10 తరగతుల విద్యార్థులకు మూడు భాషలను వర్తింపచేయాలని స్పష్టం చేసింది. R-1, R-2, R-3 కింద మూడు భాషలను విద్యార్థులు చదివి తీరాలని పేర్కొంది.
వీటిలో R-1 కింద మాతృభాషను అభ్యశించాలని తెలిపింది. R-2 కింద మాతృభాష కాని భాషను ఎంచుకోవాలని, R-3 కింద విదేశీ విద్యను అభ్యసించేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. అయితే.. R-3లో ఏ భాష ఎంపిక చేసుకుంటారన్నది విద్యార్థుల ఇష్టానికే వదిలేసినట్టు సీబీఎస్ ఈ స్పష్టం చేసింది. ఆ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని.. ఉపాధ్యాయుల సంఖ్యను కూడా పెంచుకోవాలని కోరింది. విద్యార్థులను మూడు భాషల దిశగా మానసికంగా కూడా సిద్ధం చేయాలని సీబీఎస్ ఈ పిలుపునిచ్చింది.
తమిళనాట తలనొప్పే!
నిన్న మొన్నటి వరకు ఈవిషయం ఎలా ఉన్నా.. ఇప్పుడు సీబీఎస్ ఈ దేశవ్యాప్తంగా అమలు చేస్తూ.. త్రిభాష విధానానికి జూలై 1వ తేదీని నిర్ణయించడంతో తమిళనాడులో పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చారు. తాజాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్కు ఈ సమస్య పెద్ద సంకటమే కానుంది. అయితే.. ఇప్పటికే `నీట్`ను విజయ్ వ్యతిరేకించారు. దీనిని పూర్తిగా రద్దు చేయడంతోపాటు.. నిర్వహణను రాష్ట్రాలకే వదిలి పెట్టాలన్నారు. ఇప్పుడు త్రిభాష విధానంపై ఆయన ఎలాంటి స్టాండ్ తీసుకుంటారన్నది చూడాలి. త్రిభాషను ఖచ్చితంగా అమలు చేయాలని, జాతీయ విద్యా విధానం మేరకు దీనిని తీసుకువచ్చామని చెబుతున్న దరిమిలా.. ఢిల్లీలో విజయ్ ఏ మేరకు చక్రం తిప్పుతారో చూడాలి.