జైలు నుంచి విడుదలైన బోరుగడ్డ.. అన్ని కేసుల నుంచి బెయిలు
వైసీపీ సానుభూతిపరుడు, గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్ ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యాడు.;

వైసీపీ సానుభూతిపరుడు, గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్ ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యాడు. గుంటూరు అరండల్ పేట పోలీసు స్టేషన్ పరిధిలోని ఏఈఎల్సీ చర్చి ట్రెజరర్ కర్ణపూడి బాబూప్రకాశ్ ను బెదిరించిన కేసులు గత ఏడాది అక్టోబరు 17న బోరుగడ్డను పోలీసులు అరెస్టు చేశారు. తొలుత రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు.. ఆ తర్వాత మరిన్ని కేసులు నమోదు చేశారు. దీంతో సుమారు 9 నెలలు పాటు బోరుగడ్డ జైలులోనే గడపాల్సివచ్చింది. చివరికి అన్నికేసుల్లోనూ బెయిలు మంజూరు కావడంతో శుక్రవారం సాయంత్రం గుంటూరు జైలు నుంచి బయటకు వచ్చాడు.
బోరుగడ్డపై రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 కేసులు నమోదు చేసినట్లు చెబుతున్నారు. ఎక్కువగా బెదిరింపులు, సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలపై బోరుగడ్డపై కేసులు నమోదు అయ్యాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నాటి ప్రతిపక్ష నేతలు, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ పట్ల అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారని బోరుగడ్డపై కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 50 కేసులు నమోదు చేయగా, ఇందులో గుంటూరు జిల్లా పరిధిలోనే 15 వరకు ఉన్నట్లు చెబుతున్నారు.
తొలుత చర్చి ట్రెజరరును బెదిరించిన కేసులో అరెస్టు అయిన బోరుగడ్డ ఆ తర్వాత కొన్నాళ్లకు మధ్యాంతర బెయిలుపై బయటకు వచ్చారు. తన తల్లి ఆరోగ్యం బాగోలేదని కోర్టుకు నివేదించడంతో బెయిల్ మంజూరు అయింది. అయితే నకిలీ పత్రాలు సమర్పించి ఆయన బెయిలు తీసుకున్నట్లు పోలీసులు మరో కేసు నమోదు చేయడంతో బోరుగడ్డ బయటపడే మార్గం సంక్లిష్టంగా మారింది. ఇదే సమయంలో గుంటూరు జిల్లా పెదకాకాని పోలీసుస్టేషన్ పరిధిలో ప్రభుత్వ సర్వేయర్ ను బెదిరించారని 2016 మే 9న నమోదైన కేసులోనూ పోలీసుల బోరుగడ్డను అరెస్టు చేశారు.
దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు జిల్లా జైలుకు బోరుగడ్డను తీసుకువచ్చారు. అయితే గురువారం నాటికి ఆయనపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిలు మంజూరు అయింది. దీంతో శుక్రవారం బెయిలు పత్రాలు దాఖలు చేసి జైలు నుంచి బోరుగడ్డ బయటకు వచ్చారు. బోరుగడ్డ అరెస్టు తర్వాత ఆయనకు సహకరించారని దాదాపు 11 మంది పోలీసులపై ప్రభుత్వం వేటు వేసిందని చెబుతున్నారు. తొలుత అరండల్ పేట పోలీసుస్టేషనులో రాచమర్యాదలు చేశారని కొందరిని, ఆ తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకువెళుతుండగా, మార్గ మధ్యలో బిర్యాని తినడానికి అనుమతిచ్చారని మరికొందరిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇలా బోరుగడ్డ జైలుకు వెళ్లిన నుంచి తిరిగి వచ్చేవరకు ఆయన ప్రతికదలిక పెద్ద సంచలనంగా చర్చనీయాంశంగా మారింది.