ఏపీలో మూడో పార్టీ వస్తే మూడేది ఎవరికి ?

ఏపీ లో చూస్తే ప్రస్తుతానికి రాజకీయ వాతావరణం కూటమికి వైసీపీయే ప్రత్యర్ధిగా ఉంది.

Update: 2026-05-20 04:09 GMT

రాజకీయాల్లో అవకాశాలు రావు, తీసుకోవాలి. ప్రజలు ఎపుడూ తెలివైన వాళ్ళు. వారికి తామే ఆల్టర్నేషన్ అని ఎవరైనా అనుకుంటే అంతకంటే పొరపాటు ఉండదు, ప్రజలు తమదైన చైతన్యంతో తమకు కావాల్సిన ఆల్టర్నేషన్ ని తెచ్చుకుంటారు. గద్దె మీద కూర్చోబెడతారు. దానికి తాజా ఉదాహరణ తమిళనాడు. అక్కడ డీఎంకే ఓడితే అన్నా డీఎంకేనే దిక్కు అనుకున్నారు ఆ పార్టీ నేతలు. కానీ ఫలితాలు వచ్చిన తరువాత సీన్ అర్ధం అయింది మూడవ ప్లేస్ లోకి పడిపోయింది. అంటే జనాల ఆలోచనలు ఎంత వేగంగా మారుతాయన్నది అర్ధం చేసుకోవాలిన అవసరం ఉంది. ఇదే కాదు దేశాన్ని మూడు నాలుగు దశాబ్దాలకు పైగా ఏకచత్రాధిపత్యంగా ఏలిన కాంగ్రెస్ పార్టీ కూడా చివరికి విపక్షంలోకి రావాల్సి వచ్చింది.

కూటమికి ప్రత్యర్థిగా :

ఏపీ లో చూస్తే ప్రస్తుతానికి రాజకీయ వాతావరణం కూటమికి వైసీపీయే ప్రత్యర్ధిగా ఉంది. అదే వైసీపీలో ధీమాను కూడా పెంచుతోంది. కూటమి తప్పులు చేస్తే అధికారం తమకే దక్కుతుందని మెచ్చి వరమాలను తమ మెడలో వేస్తారని వైసీపీ నేతలు భావిస్తున్నారు. యాంటీ ఇంకెంబెన్సీ మీదనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో మేమే అని చెబుతున్నారు. మరో విషయం ఏమిటి అంటే ఒక పార్టీకి ఒకేసారి అధికారం ఇవ్వడం ఏపీ ప్రజలు చేస్తారు కాబట్టి ఆ ట్రాక్ రికార్డు చూసినా తమకే చాన్స్ అని కూడా వారు విశ్వాసంగా ఉన్నారు.

థర్డ్ ఫోర్స్ వస్తే :

అయితే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ సమయం ఉంది. రాజకీయంగా చూస్తే అది చాలా ఎక్కువ సమయమే. ఎందుకంటే క్షణాలలో అంతా మారే సీన్ పొలిటికల్ గా ఉంటుంది. అలా చూసినపుడు ఈ మూడేళ్ళలో కొత్త పార్టీ వచ్చినా లేక థర్డ్ ఫోర్స్ ఏదైనా ఎమర్జ్ అయినా ఎవరికి ఎక్కువ నష్టం అన్న చర్చ వస్తోంది. సాధారణంగా మూడవ పార్టీ వస్తే కనుక అది ఖాయంగా ప్రతిపక్ష పార్టీకే చేటు చేస్తుంది. దానికి మళ్ళీ అన్నా డీఎంకేని ఉదహరించాల్సి ఉంటుంది. అందువల్ల ఏపీలో కూడా వైసీపీకే దెబ్బ పడుతుందని అనే వారూ ఉన్నారు.

టర్న్ కావడం లేదు :

ఏపీలో రెండేళ్ళ కూటమి ప్రభుత్వం పాలనలో అసంతృప్తి ఉంది. అయితే అది ఏ మేరకు అన్నది తెలియడం లేదు కానీ అధికారంలో ఉన్న పార్టీకి సహజం. కానీ ఆ అసంతృప్తి వైసీపీ వైపు మళ్ళడం లేదు. అంటే వైసీపీకి 2024 లో వచ్చిన 40 శాతం ఓట్లు అలా నికార్సుగా నిలిచి ఉన్నాయో లేవో తెలియడం లేదు కానీ కొత్త ఓట్లు అయితే జత చేరడం లేదు అన్న విశ్లేషణలు ఉన్నాయి. మరో వైపు చూస్తే ఏపీలో వైసీపీని వీడిన వారు ఉన్నారు, కూటమిలో చోటు లేని వారు ఉన్నారు. ఇంకా అన్ని పార్టీల తీరు చూసి కొత్తదనం కోసం ఆలోచిస్తున్న వారు ఉన్నారు. వీరందరి కోసం ఏదైనా పార్టీ వచ్చినా లేక ఫోర్స్ గా అందరూ కలిసి ప్రయత్నం చేసినా అపుడు ఏమిటి జరుగుతుంది అన్నది ఒక కీలకమైన చర్చ. అలాంటి సందర్భాలలో కచ్చితంగా వైసీపీకి ఇబ్బంది అవుతుందని అంటున్నారు.

గొంతుకగా మారాలి :

వైసీపీ అయితే రెండేళ్ళ కాలంలో జనంలోకి పెద్దగా వచ్చింది లేదు. ఇక అసెంబ్లీ ముఖం ఎమ్మెల్యేలు చూసింది అంతకంటే లేదు. అధినేత జగన్ కూడా జనంలోకి వచ్చే ప్రయత్నం చేయడం లేదు. దాంతో తమ గొంతుకని విపక్షం వినిపించలేకపోతోంది అన్న భావన అయితే మెల్లగా జనంలోకి వెళ్తోంది. సరిగ్గా ఈ సమయంలో సర్దుకుని వైసీపీ దూకుడుగా ముందుకు సాగకపోతే మాత్రం మూడవ పార్టీ అయినా లేదా శక్తి అయినా వస్తే మాత్రం ఆ పార్టీ విజయావకాశాలనే దెబ్బ తీస్తాయన్న విశ్లేషణలు ఉన్నాయి. చూడాలి మరి ఏపీ రాజకీయాల్లో ఏ మార్పులు వస్తాయో.

Tags:    

Similar News