ఆయన రాజీనామా తిరస్కరణ...మిగిలిన సంగతేంటి ?
అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొంతమంది వైసీపీ ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామాలు చేశారు.;
శాసనమండలిలో వైసీపీకి బలం పూర్తిగా ఉంది. మూడింట రెండు వంతుల మెజారిటీ ఆ పార్టీ సొంతం. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొంతమంది వైసీపీ ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. అలా చేసిన వారిలో జయ జయ మంగళ వెంకట రమణ ఒకరు. ఆయన రాజీనామాను తాజాగా శసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు తిరస్కరించడం విశేషం.
వైసీపీలోకి వచ్చి :
టీడీపీలో ఉన్న జయ మంగళ వెంకట రమణ వైసీపీ అధికారంలో ఉన్నపుడు ఆ పార్టీలోకి వచ్చి చేరారు. దాంతో ఆయనకు వైసీపీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. అయితే ఆయన 2024 నవంబరు నెలలో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామా నాటి నుంచి పెండింగులో ఉంది. తాను ఎపుడో ఎమ్మెల్సీ పదవికి వైసీపీకి రాజీనామా చేసినా కూడా తన రాజీనామాను మండలి ఛైర్మన్ ఆమోదించడం లేదని ఆయన కోర్టు మెట్లు కూడా ఎక్కారు. ఆ మీదట మోషెన్ రాజు ఆయన రాజీనామా విషయంలో పిలిపించి మాట్లాడారు. ఆయన ఆ మీదట తాజాగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ రాజీనామా తిరస్కరణ వెనక కారణాలు ఏమిటి అన్నది తెలియరావడం లేదు కానీ సరైన ఫార్మెట్ లో ఆయన రాజీనామా చేయలేదని చెప్పి పక్కన పెట్టారని అంటున్నారు.
మరో నలుగురు ఉన్నారు :
కేవలం జయమంగళ వెంకట రమణ మాత్రమే కాదు ఆ బాటలో మరో నలుగురు కూడా తమ ఎమ్మెల్సీ పదవులకు వైసీపీకి రాజీనామా చేశారు. వారే మర్రి రాజశేఖర్,కర్రీ పద్మశ్రీ, పోతుల సునీత, బల్లి కళ్యాణ్ చక్రవర్తి. వీరిని కూడా కొంతకాలం క్రితం మండలి చైర్మన్ తన చాంబర్ కి పిలిపించుకుని వారు రాజీనామా చేసిన దాని మీద విచారణ జరిపారు. అయితే మొదట ఇపుడు జయ మంగళ వెంకట రమణ రాజీనామాను తిరస్కరించడంతో మిగిలిన వారి సంగతి ఏమిటి అన్న చర్చ సాగుతోంది. ఒకవేళ వీరి రాజీనామాలను కూడా ఆమోదించకపోతే మాత్రం కచ్చితంగా ఈ సీట్లలో ఖాళీలు ఏర్పడే చాన్స్ లేదని అంటున్నారు.
పదవీ కాలం వరకూ :
అయితే ఈ రాజీనామాలు కనుక ఆమోదించకపోతే మాత్రం వీరి పదవీకాలం పూర్తి అయ్యేంతవరకూ కొనసాగుతారు. లేదా టీడీపీ కూటమికి మండలిలో మెజారిటీ వచ్చిన తరువాతనే దీని మీద నిర్ణయం ఉంటుంది అని అంటున్నారు. ఇక చూస్తే బల్లి కళ్యాణ్ చక్రవర్తి పదవీ కాలం 2027 దాకా ఉంది. మర్రి రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, వెంకట రమణ పదవీ కాలాం 2029 దాకా ఉంటే పోతుల సునీత పదవీ కాలం 2030 దాకా ఉంది. అయితే 2027 నాటికి శాసన మండలిలో పూర్తి మెజారిటీ కూటమికి దక్కుతుంది అని అంటున్నారు. మెజారిటీ వైసీపీ ఎమ్మెల్సీల పదవీ కాలం తీరిపోవడంతో ఆ ప్లేస్ లోకి పెద్ద ఎత్తున కూటమి ఎమ్మెల్సీలు వచ్చి చేరుతారు. దాంతో అప్పుడు కూటమి నిర్ణయాలు అమలు అవుతాయని అంటున్నారు.