నో ఛాన్స్.. సాయిరెడ్డి చెప్పిందే నిజమవుతుందా.. !
''కూటమి ఉన్నంత వరకు.. వైసీపీకి ఛాన్స్ లేదు.'' అని ఆ పార్టీ మాజీ నాయకుడు.. మాజీ ఎంపీ వేణుం బాకం విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయాల్లో చర్చకు వస్తున్నాయి.;
''కూటమి ఉన్నంత వరకు.. వైసీపీకి ఛాన్స్ లేదు.'' అని ఆ పార్టీ మాజీ నాయకుడు.. మాజీ ఎంపీ వేణుం బాకం విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయాల్లో చర్చకు వస్తున్నాయి. వాస్తవానికి ఆయ న పైకి చెప్పినా.. చెప్పకపోయినా.. వైసీపీ నాయకులు కూడా కూటమి బలంగా ఉన్నంత వరకు తమకు ఛాన్స్ తక్కువేనని అంగీకరిస్తున్నారు. అందుకే గతంలో ఉన్నంత దారుణంగా.. ఇప్పుడు జనసేనపై కామెంట్లు చేయడం లేదు.
గతంలో జనసేనను టార్గెట్ చేసుకుని కూటమి కట్టేందుకు పరోక్షంగా వైసీపీనే కారణమైంది. ఈ విషయా న్ని పవన్ కల్యాణే చెప్పుకొచ్చారు. వైసీపీ కనుక ఇలా చేసి ఉండకపోతే.. కూటమి కట్టే వాళ్లంకాదు! అని ఆయన రాజమండ్రిలోనే చెప్పారు. సో.. ఏతావాతా.. వైసీపీనే కూటమికి బలాన్ని ఇచ్చిందన్నది వాస్తవం. ఇక, కూటమిగా మూడు పార్టీలు ఎన్నికలకు వెళ్లడంతో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. ఇప్పుడు కూడా కూటమి బలంగానే ఉంది. దీంతో వైసీపీకి చుక్కలు కనిపిస్తాయన్నది చర్చ.
ప్రభుత్వ వ్యతిరేకతపైనే జగన్ దృష్టి పెట్టుకున్నారన్నది కూడా ప్రస్తుతం జరుగుతున్న వాదన. ఇది నిజమే కావొచ్చు. సహజంగానే ఏ ప్రభుత్వం ఉన్నా.. కొంత వ్యతిరేకత ఖాయం. సంక్షేమ కార్యక్రమాలు అందని వారు.. తమకు మేలు జరగలేదని భావించిన వారు.. కొంత వ్యతిరేకత చూపించే అవకాశం ఉంది. అంత మాత్రాన.. వైసీపీకి మేలు జరగదన్నది విశ్లేషకులు చెబుతున్నారు. ఒక ప్రాంతంలో ఓట్లు తగ్గినా.. మరో ప్రాంతంలో పుంజుకునేందుకు ఇప్పటికే .. చంద్రబాబు, పవన్ కల్యాణ్లు వ్యూహాత్మకంగా వ్యవహరి స్తున్నారు.
తమకు భారీ బలం ఉన్న ప్రాంతాలకంటే కూడా.. తమకు బలం తక్కువగా ఉన్న జిల్లాలపై ఎక్కువగా ఫోకస్ పెంచారు. ఇది వైసీపీకి నష్టం చేకూరుస్తుందని అంచనా ఉంది. తద్వారా ఒక ప్రాంతంలో ఓటు బ్యాంకు ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా తగ్గినా.. మరో ప్రాంతంలో దానిని భర్తీ చేసుకునే అవకాశం ఉంటుంది. మొత్తంగా కూటమి కలిసే ఉంటుందన్నది చెప్పకనే చెబుతున్నారు. ఇలా.. కలివిడిగా ఉన్నంత వరకు.. వైసీపీకి ఛాన్స్ లేదన్న సాయిరెడ్డి చెప్పిన మాట.. ఇప్పుడు మరోసారి వాస్తవంలోకి వస్తోందని అంటున్నారు పరిశీలకులు.