వాట్సాప్ గవర్నెన్స్ కిక్కిస్తోందా.. కాల్ సెంటర్కు ప్లాన్.. !
రాష్ట్రంలో కూటమి సర్కారు ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు వాట్సాప్ గవర్నెన్స్ను తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.;
రాష్ట్రంలో కూటమి సర్కారు ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు వాట్సాప్ గవర్నెన్స్ను తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. అరచేతిలోని స్మార్ట్ ఫోన్ ద్వారానే పాలనను ప్రజలకు చేరువ చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే గత ఏడాది కాలంలో బర్త్, డెత్ సర్టిఫికెట్ల నుంచి పింఛన్ల వరకు అనేక సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. మొత్తంగా ప్రస్తుతం 183 రకాల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామని ఆర్ టీ జీఎస్ అధికారులు కూడా చెబుతున్నారు.
కిక్కిచ్చిందా..?
అయితే.. ఏ లక్ష్యం అయినా.. అది ప్రజలకు చేరువ అయితేనే ప్రయోజనం. ఈ విషయంలోనే చంద్రబా బు తాజాగా సమీక్షించారు. వాట్సాప్ గవర్నెన్స్ తీరుతెన్నులను ఆయన తెలుసుకున్నారు. వాట్సాప్ గవర్నెన్స్పై ప్రజల అభిప్రాయం తెలుసుకున్నారు. అయితే.. గ్రామీణ ప్రాంతాలకు ఈ సేవలు చేరువ కాలేదని స్పష్టమైంది. అంతేకాదు.. పట్టణాల్లోనూ.. వాట్సాప్ గవర్నర్ అంతగా చొరవ చూపలేకపోతున్నట్టు అధికారులు వివరించారు. అయితే.. దీనికి ప్రచారం కల్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ఎంతగా అయినా..
సహజంగానే ఏపీ ప్రజలైనా.. దేశంలోని ప్రజలైనా.. నేరుగా తమకు ప్రభుత్వం నుంచి సేవలు అందాలని కోరుకుంటారు. సామాజిక మాధ్యమాల ద్వారా కొంత మేరకు సంతృప్తి ఉన్నా.. భూములు, రిజిస్ట్రేషన్ వంటివిషయాల్లో వారికి అధికారులు లేదా సంబంధిత సిబ్బంది నేరుగా సమాధానం చెబితేనే సంతృప్తి చెందుతారు. ఇదే ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్లో ప్రధాన సమస్యగా మారింది. కొన్ని ప్రశ్నలకు కొన్ని సమాధానాలనే వాట్సాప్ ఫీడ్ బ్యాక్లో నిక్షిప్తం చేయడంతో ప్రజలకు ఆయా సమాధానాలు సంతృప్తి ఇవ్వడం లేదు.
మార్పు దిశగా..
ఈ క్రమంలో వాట్సాప్ గవర్నెన్స్పై ప్రజలు పెద్దగా సంతృప్తి వ్యక్తం చేయడంలేదని అధికారులు చెబుతు న్నారు. మరిన్ని ఫీచర్లు ఏర్పాటు చేయడంతోపాటు.. వాట్సాప్ కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు. తద్వారా ఏదైనా సమస్య ఉంటే.. నేరుగా ప్రజలు వాట్సాప్ కాల్ సెంటర్ ప్రతినిధితో మాట్లాడి సంతృప్తి చెందే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇక, వాట్సాప్ సేవల వినియోగంలో మెజారిటీ ప్రజలకు అవగాహన లేకపోవడం కూడా ఈ సమస్యకు ప్రధాన కారణంగా మారింది.