మూడేళ్ల ముందే ఏపీలో ఎన్నికల ఎట్మాస్ఫియర్.. !
కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా జమిలి ఎన్నికలే జరిగినా.. వచ్చే 2029 వరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు.
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగేందుకు మూడేళ్ల సమయం ఉంది. కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా జమిలి ఎన్నికలే జరిగినా.. వచ్చే 2029 వరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. జమిలి ఎన్నికలను కూడా 2029 నాటికే నిర్వహించాలని భావిస్తున్నారు. సో.. అప్పటి వరకు రాష్ట్రంలో ఎన్నికల హడావుడి పెద్దగా ఉండదు. కానీ, ప్రస్తుతం రాజకీయ వాతావరణాన్ని గమనిస్తే.. మాత్రం దీనికి భిన్నంగా కనిపిస్తోంది. మూడేళ్లకు ముందుగానే రాష్ట్రంలో ఎలక్షన్ ఎట్మాస్ఫియర్ స్పష్టంగా కనిపిస్తోంది.
ఎందుకు.. ?
సాధారణంగా ఎప్పుడైనా.. ఎక్కడైనా ఎన్నికలకు ముందు ఏడాది మాత్రమే రాజకీయంగా ఆ తరహా పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయంగా నాయకులు, ప్రత్యర్థుల మధ్య మాటల తూటాలు కూడా పేలుతుంటాయి. కానీ, దీనికి భిన్నంగా ఏపీలో మాత్రం చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయంగా అధికార, ప్రత్యర్థుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్ల రాజకీయం కొనసాగుతోంది. వైసీపీపై పైచేయి సాధించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీలు ఎవరికివారే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ప్రధానంగా వచ్చే ఎన్నికల నాటికి మరోసారి విజయం దక్కించుకోవాలన్న ప్రధాన లక్ష్యం దీనిలో ఇమిడి ఉన్నప్ప టికీ.. ఇప్పుడే ఎందుకు? అనేది కీలక ప్రశ్న. ఇతర రాష్ట్రాలకు, ఏపీకి ఉన్న ప్రత్యేక తేడానే దీనికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రెండేళ్ల పాలన గడిచిపోయిన తర్వాత.. ప్రజల్లో ఏర్పడే అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందన్న వాదన అధికార పార్టీల్లో కనిపిస్తోంది. ఇక, ఇప్పుడు ఏర్పడిన గ్యాప్ను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అవకాశం ఉంటుందని వైసీపీ అంచనా వేస్తోంది.
ఇదేసమయంలో కూటమి పార్టీలు విజయంపైనే ఎక్కువగా దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షంపై పైచేయి కోసం.. అధికార పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇక, ప్రతిపక్షం గత ఎన్నికల ఫలితం నుంచి వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునే దిశగా చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడిప్పుడే పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కాయని అంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి ఎన్నికల వాతావరణం నెలకొందని.. ఈ విషయంలో ఎవరూ ఎక్కడా తగ్గడం లేదని పేర్కొన్నారు.