ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాయిదా.. ఎందుకంటే!
అనూహ్యంగా ఈ సమావేశాలు వాయిదా పడినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎప్పుడు నిర్వహిస్తారు అనేది ఇంకా తేల్చలేదు అన్నది కూడా అధికార వర్గాలు చెప్పిన మాట. మరి దీనికి కారణం ఏంటి? ఎందుకు? అనేది ఆసక్తిగా మారింది.;
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 16 నుంచి(మంగళవారం) ప్రారంభం కావాల్సి ఉంది. దీనికి సంబంధించి గతంలోనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటన చేశారు. డిసెంబర్ 16 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలను ప్రారంభిస్తామని చెప్పారు. కానీ, అనూహ్యంగా ఈ సమావేశాలు వాయిదా పడినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎప్పుడు నిర్వహిస్తారు అనేది ఇంకా తేల్చలేదు అన్నది కూడా అధికార వర్గాలు చెప్పిన మాట. మరి దీనికి కారణం ఏంటి? ఎందుకు? అనేది ఆసక్తిగా మారింది.
ప్రస్తుతం కీలకమైన అంశాల్లో ప్రభుత్వానికి కొంత ఇబ్బంది అయితే ఎదురవుతున్న మాట వాస్తవం. అసెంబ్లీ సమావేశాలు పెడితే ఆయా అంశాలను ప్రస్తావించకుండా సభను ముగించడానికి అవకాశం లేదు. వీటిలో రాజధానికి చట్టబద్ధత అంశంపై బిల్లు చేయాల్సి ఉంది. రెండోది రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు మరింతగా పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. మద్దతు ధరలు, ఎరువులు, పురుగు మందులు అదేవిధంగా రైతులకు సంబంధించిన నాణ్యమైన విత్తనాలను అందించడంలో ఒకింత ప్రభుత్వం వెనకబడిందని చెప్పాలి.
ఇది దేశవ్యాప్తంగా ఉన్న సమస్య అన్నది అధికారులు చెబుతున్న మాట. కేంద్ర ప్రభుత్వం సంప్రదాయ వ్యవసాయానికి, ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఎరువులు, పురుగుమందులు తగ్గించే దిశగా అడుగులు వేసింది. దీంతో ఉత్పత్తి అదేవిధంగా దిగుమతులు కూడా తగ్గించుకుంది. ఈ ప్రభావం ఏపీ సహా అన్ని రాష్ట్రాలపై పడింది. ఫలితంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక పంటలకు గిట్టుబాటు ధర కూడా లభించడం లేదన్నది వాస్తవం.
ఇటీవల పత్తి విషయంలో చాలా ఇబ్బందికర పరిణామాలు ఎదురవగా కేంద్రానికి అనేక సందర్భాల్లో లేఖలు రాసినా స్పందించలేదు. అదే విధంగా ఇటీవల వచ్చిన తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు పరిహారం కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఈ అంశాలన్నీ అసెంబ్లీలో చర్చకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సమస్యలు పరిష్కరించడానికి మరో నెల రోజుల సమయం పట్టే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో అవి పరిష్కారం అయ్యేవరకు వాయిదా వేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
అదేవిధంగా రాజధాని అమరావతిపై చట్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. కానీ దీనికి సంబంధించి రాష్ట్రంలోనే బిల్లు తయారు చేసే పంపించాలని కేంద్రం చెప్పింది. ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టులో కేసు పడినప్పుడు కేంద్రం తమకు సంబంధం లేదని, ఏపీ రాజధాని అంశం ఏపి ఇష్టమని దానిలో తాను జోక్యం చేసుకోలేమని చెప్పింది. ఇప్పుడు నేరుగా కేంద్ర ప్రభుత్వం దీనిపై చట్టం చేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బిల్లును తయారుచేసి కేంద్రానికి పంపిస్తే కేంద్రం దానిని ఆమోదించే అవకాశం ఉంటుంది.
ఇక రాజధాని సరిహద్దుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత కొరవడింది. గతంలో 33 వేల ఎకరాలను రైతుల నుంచి తీసుకున్నారు. 20,000 ఎకరాల ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. దీంతో మొత్తంగా 53 వేల ఎకరాలలో అమరావతిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ ఇప్పుడు మరో 46వేల ఎకరాలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇంకా పరిస్థితులు కొలిక్కి రాలేదు. ఆయా సమస్యల నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాలు ఇప్పటికిప్పుడు కాకుండా జనవరి రెండో వారం నుంచి నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. ఇక, వైసీపీ ఈ సమావేశాలకు కూడా వచ్చే అవకాశం లేదు. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప వచ్చే పరిస్థితి ఉండదని జగన్ ఇప్పటికే స్పష్టం చేశారు.