ప్రమాదం తర్వాత ఫస్ట్ ట్రిప్... అహ్మదాబాద్-లండన్ ఏఐ విమానంలో సమస్య!
అవును... దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియాలో వరుస ఘటనలు భయాందోళనకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే.;

జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం ఏఐ 171 బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్.. టేకాఫ్ అయిన క్షణాల్లో కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 241 మంది ప్రాణాలు కోల్పోగా, ఒకే ఒక్క ప్రయాణికుడు గాయాలతో బయటపడ్డారు. ఇక ఈ విమానం కూలిన నివాస సముదాయాల్లోని మరో 33 మంది మృతి చెందారు.
ఈ ఘోర విమాన ప్రమాదం అనంతరం ఏఐ 171 ఫ్లైట్ నెంబర్ ను ఎయిరిండియా పక్కనపెట్టేసింది. దాని స్థానంలో ఏఐ 159 నెంబర్ ను వినియోగించింది. అయితే.. తాజాగా ఇప్పుడు ఆ కొత్త సిరీస్ విమానంలోనూ సాంకేతిక సమస్య ఎదురైంది. ఇందులో భాగంగా... ఎయిరిండియా ఏఐ 159 బోయింగ్ 787 - 8 డ్రీమ్ లైనర్ విమానం మంగళవారం టెన్షన్ పెట్టింది.
అవును... దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియాలో వరుస ఘటనలు భయాందోళనకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. అహ్మాదాబాద్ లో జరిగిన ఘోర ప్రమాదం అనంతరం వరుసగా ఈ ఘటనలు జరుగుతుండటం గమనార్హం. ఇందులో భాగంగా.. వరుసగా పలు విమానాల్లో సాంకేతిక లోపాలు బయటపడుతుండటం కలవరపెడుతోంది.
ఈ క్రమంలో... ఎయిరిండియా ఏఐ-159 బోయింగ్ 787 - 8 డ్రీమ్ లైనర్ విమానం మంగళవారం మధ్యాహ్నం 1:10 గంటలకు అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరాల్సి ఉంది. ఈ క్రమంలోనే విమానంలో తనిఖీలు చేస్తున్నారు. ఈ సమయంలో సాంకేతిక సమస్యను గుర్తించారు. దీంతో.. టేకాఫ్ నిలిపేసిన అధికారులు సర్వీసును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
కాగా... జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాలసిన ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన అనంతరం లండన్ వెళ్లాల్సిన తొలి షెడ్యూల్డ్ విమానం ఇదే కావడం గమనార్హం.