'అర్ధరాత్రి బిర్యానీ ట్రెండ్'.. మంచిదేనా?
బిర్యానీ.. గతంలో ఏ పండగో.. ప్రత్యేక కార్యక్రమమో జరిగితే.. తినేవారు. కానీ.. ఇప్పుడు దైనందిన ఆహారం లో బిర్యానీ ఒక భాగం అయింది.;
బిర్యానీ.. గతంలో ఏ పండగో.. ప్రత్యేక కార్యక్రమమో జరిగితే.. తినేవారు. కానీ.. ఇప్పుడు దైనందిన ఆహారం లో బిర్యానీ ఒక భాగం అయింది. మంచిదే. కానీ, దీనిని వేళా పాళా లేకుండా తినేస్తుండడంతో అనేక రుగ్మతలు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ సంస్థ.. 'స్విగ్గీ' తన వార్షిక ఆర్డర్ల నివేదికలో బిర్యానీల గురించి ఆసక్తికర విషయాలు తెలిపింది.
పగటి పూట కంటే కూడా.. రాత్రుళ్లు.. తెల్లవారుజామున తమకు బిర్యానీ ఆర్డర్లు భారీగా వస్తున్నాయని పేర్కొంది. ఉదాహరణకు మధ్యాహ్నం భోజన సమయంలో బిర్యానీ కావాలంటూ.. 20 శాతం మంది ఆర్డర్ చేస్తుండగా.. రాత్రి 11- తెల్లవారు జామున 4 గంటల మధ్యలో బిర్యానీ కావాలంటూ.. 110 శాతం మంది ఆర్డర్లు చేస్తున్నారని స్విగ్గీ వెల్లడించింది. జొమాటో కూడా ఇదే విధంగా తన వార్షిక నివేదికలో పేర్కొంది.
ముఖ్యంగా అభివృద్ది చెందిన నగరాలైన.. హైదరాబాద్, ముంబై, చెన్నై.. బెంగళూరు వంటి నగరాల్లో 'అర్ధరాత్రి బిర్యానీ ట్రెండ్' కొనసాగుతున్నట్టు ఆయా సంస్థల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇక, ఏపీలోని విజయవాడ, విశాఖల్లో బిర్యానీలకు 30 శాతం నుంచి 40 శాతం మంది అర్ధరాత్రి దాటిన తర్వాత.. ఆర్డర్లు పెడుతున్నారు. ఫాస్ట్ ఫుడ్ కోసం.. 60 శాతం మంది ఆర్డర్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు అర్ధరాత్రి దాటిన తర్వాత.. ఇలా మసాలాలతో కూడిన, గ్యాస్ ఉత్పత్తి చేసే పదార్థాలు తీసుకోవచ్చా? అనేది ప్రశ్న.
దీనిపై నిపుణులు చాలా కీలక సూచనలు చేస్తున్నారు. వాస్తవానికి సాయంత్రం 7 గంటల లోపే డిన్నర్ పూర్తి చేయాలని.. వీటిలో మసాలాలు ఉండే వాటిని పరిహరించాలని సూచిస్తున్నారు. ఇక, అర్థరాత్రి వేళ అవసరమైతే మంచినీరు మాత్రమే తాగాలని సూచిస్తున్నారు. కానీ.. ఇప్పుడు ట్రెండ్ అర్ధరాత్రి బిర్యానీగా నడుస్తోంది. దీనివల్ల అనేక రుగ్మతలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.
ఇవీ ప్రధాన రుగ్మతలు..
1) బాడీలో మెటబాలిజం దెబ్బతింటుంది.
2) రక్త ప్రసరణ వ్యవస్థలో మార్పులు వస్తాయి.
3) జీర్ణక్రియలు దెబ్బతిని.. ఉదర సంబంధిత సమస్యలు పెరుగుతాయి.
4) బాడీలో కొవ్వు(కొలెస్ట్రాల్) పెరుగుతుంది.
5) గ్యాస్/ అసెడిటీ సమస్యలకు అర్ధరాత్రి బిర్యానీ రెడ్ కార్పెట్!.
6) నిద్ర లేమి సమస్యలు.
7) కొందరిలో శృంగార పరమైన సమస్యలు వచ్చే అవకాశం.